22-04-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మీరిప్పుడు నామ-రూపాల జబ్బు నుండి రక్షించుకోవాలి, తప్పుడు ఖాతాను తయారు చేసుకోకూడదు, ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి"

ప్రశ్న:-

భాగ్యశాలి పిల్లలు ఏ ముఖ్య పురుషార్థము ద్వారా తమ భాగ్యాన్ని తయారుచేసుకుంటారు?

జవాబు:-

భాగ్యశాలి పిల్లలు అందరికీ సుఖమునిచ్చే పురుషార్థము చేస్తారు. మనసా-వాచా-కర్మణా ఎవ్వరికీ దుఃఖమునివ్వరు. శీతలంగా నడుచుకుంటారు కనుక వారి భాగ్యము తయారవుతూ ఉంటుంది. ఇది మీ విద్యార్థి జీవితము. మీరిప్పుడు గుటకలు మింగకూడదు. అపారమైన సంతోషములో ఉండాలి.

గీతము:-

మీరే తల్లి, తండ్రి..... (తుమ్ హీ హో మాతా పితా.....)

ఓంశాంతి. పిల్లలందరూ మురళి వింటారు, మురళి ఎక్కడకు వెళ్ళినా అక్కడి వారందరికి, ఈ మహిమ సాకార వ్యక్తిది కాదు, నిరాకారునిదని తెలుసు. నిరాకారుడు ఇప్పుడు సాకారుని ద్వారా సమ్ముఖములో మురళి వినిపిస్తున్నారు. ఇప్పుడు ఆత్మలైన మేము వారిని చూస్తున్నామని కూడా అంటారు. ఆత్మ చాలా సూక్ష్మమైనది, ఈ కళ్ళకు కనిపించదు. భక్తి మార్గములోని వారికి కూడా ఆత్మలమైన మనము సూక్ష్మమని తెలుసు. కాని ఆత్మ అంటే ఏమిటో పూర్తి రహస్యము బుద్ధిలో లేదు, పరమాత్మను స్మృతి చేస్తారు కాని వారు ఎవరో తెలియదు. ఈ విషయాలు ప్రపంచానికి తెలియవు. ఇంతకుముందు మీకు కూడా తెలిసేది కాదు. ఇప్పుడు వీరు లౌకిక టీచరు లేక బంధువు కూడా కాదని పిల్లలైన మీకు నిశ్చయముంది. సృష్టిలో ఇతర మనుష్యులెలా ఉన్నారో, ఈ దాదా కూడా అలాగే ఉండేవారు. త్వమేవ మాతాశ్చ పితా... అని మీరు మహిమను పాడుతునప్పుడు వారు పైన ఉన్నారని భావించేవారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - నేను ఇతనిలో ప్రవేశించాను, ఆ నేను ఇతనిలో ఉన్నాను. ఇంతకుముందు అయితే చాలా ప్రేమగా మహిమ చేసేవారు, భయపడేవారు కూడా. ఇప్పుడైతే వారు ఇక్కడ ఈ శరీరములో ప్రవేశించారు. నిరాకారులుగా ఉండేవారు ఇప్పుడు సాకారములోకి వచ్చేశారు. వారు కూర్చొని పిల్లలకు నేర్పిస్తున్నారు. ప్రపంచములోని వారికి వారేమి నేర్పిస్తున్నారో తెలియదు. వారు గీతా భగవానుడు కృష్ణుడని భావిస్తారు. వారు రాజయోగము నేర్పిస్తారని చెప్తారు. అచ్ఛా. అయితే తండ్రి ఏం చేస్తారు? మీరే మా మాత-పిత... అని పాడుతూ ఉండేవారు కానీ వారి నుండి ఎప్పుడు ఏమి లభిస్తుందో కొద్దిగా కూడా తెలియదు. గీత వినేటప్పుడు అనుకునేవారు, కృష్ణుని ద్వారా రాజయోగము నేర్చుకున్నాము, మళ్ళీ ఎప్పుడు వచ్చి నేర్పిస్తారు అని. అది కూడా ధ్యానములోకి వచ్చి ఉంటుంది. ఈ సమయమే మహాభారత యుద్ధ సమయము, కనుక కృష్ణుని సమయమిదే అయి ఉంటుంది. తప్పకుండా అదే చరిత్ర-భూగోళము రిపీట్ అవ్వాలి. రోజురోజుకూ అర్థము చేసుకుంటూ ఉంటారు. గీతా భగవానుడు తప్పకుండా ఉండాలి. మహాభారత యుద్ధము కూడా తప్పకుండా కనిపిస్తుంది. ఈ ప్రపంచము తప్పకుండా సమాప్తమవుతుంది. పాండవులు పర్వతాల పైకి వెళ్ళిపోయారని చూపిస్తారు. కనుక వినాశనము సమీపంగా ఉందని వారి బుద్ధిలోకి తప్పకుండా వచ్చి ఉంటుంది. అయితే ఇప్పుడు కృష్ణుడు ఎక్కడున్నారు? గీతా భగవానుడు కృష్ణుడు కాదు, శివుడు అని మీ ద్వారా విననంత వరకు వారు వెతుకుతూనే ఉంటారు. మీ బుద్ధిలో అయితే ఈ మాట పక్కాగా ఉంది. ఇది మీరు ఎప్పుడూ మర్చిపోలేరు. గీతా భగవానుడు కృష్ణుడు కాదని, శివుడని మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. ప్రపంచములో మీరు తప్ప ఇతరులెవ్వరూ ఇలా చెప్పరు. ఇప్పుడు గీతా భగవానుడు రాజయోగము నేర్పించేవారు అంటే, దీని నుండి నరుని నుండి నారాయణునిగా తప్పకుండా తయారుచేస్తారు అని ఋజువవుతుంది. భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. నరుని నుండి నారాయణుడిగా తప్పకుండా చేస్తారు. స్వర్గములో ఈ లక్ష్మినారాయణుల రాజ్యముండేది కదా. ఇప్పుడైతే ఆ స్వర్గము కూడా లేదు, అలాగే నారాయణుడు కూడా లేరు, దేవతలు కూడా లేరు. చిత్రాలు మాత్రము ఉన్నాయి. వీటి ద్వారా వీరు ఒకప్పుడు ఉండి వెళ్ళారని అర్థము చేసుకుంటారు. ఇప్పుడు వీరు వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలయ్యింది అని మీరు అర్థం చేసుకుంటారు. నేటికి 5000 సంవత్సరాల క్రితము వీరి రాజ్యముండేదని మీకు తెలుసు. ఇప్పుడిది అంతిమ సమయము. యుద్ధము కూడా ఎదురుగా నిలబడి ఉంది. తండ్రి మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. అన్ని సేవాకేంద్రాలలో చదువును చదువుతారు, చదివిస్తారు కూడా. చదివించే యుక్తి చాలా బాగుంది. చిత్రాల ద్వారా జ్ఞానము మంచిగా లభించగలదు. ముఖ్యమైనది - గీతాభగవానుడు శివుడా లేక కృష్ణుడా? ఇరువురికి చాలా వ్యత్యాసము ఉంది కదా. సద్గతిదాత, స్వర్గస్థాపన చేసేవారు మరియు ఆదిసనాతన దేవీ దేవతా ధర్మమును మళ్ళీ స్థాపన చేసేవారు శివుడా లేక శ్రీకృష్ణుడా? ఈ 3 విషయాల నిర్ణయమే ముఖ్యమైనది. దీనికే బాబా చాలా ప్రాముఖ్యమిస్తారు. భలే ఇది చాలా బాగుందని అభిప్రాయము వ్రాసి ఇస్తారు. కాని అలా వ్రాసినందున ఏమీ లాభము లేదు. మీ ముఖ్య విషయమేదైతే ఉందో దానిపై ఫోర్సు ఇవ్వాలి. మీ విజయము కూడా ఇందులోనే ఉంది. భగవంతుడు ఒక్కరేనని మీరు ఋజువు చేసి చెప్తారు. గీతను వినిపించేవారు కూడా భగవంతుడని కాదు. భగవంతుడు ఈ రాజయోగము మరియు జ్ఞానము ద్వారా దేవీ దేవతా ధర్మమును స్థాపించారు.

బాబా అర్థం చేయిస్తున్నారు - పిల్లలపై మాయ దాడి చేస్తూ ఉంటుంది, ఇంతవరకూ కర్మాతీత అవస్థను ఎవ్వరూ పొందలేదు. పురుషార్థము చేస్తూ-చేస్తూ చివర్లో మీరు ఒక్క బాబా స్మృతిలో సదా హర్షితంగా ఉంటారు. దేనికీ వాడిపోరు. ఇప్పుడింకా తలపై పాపభారము చాలా ఉంది. అది స్మృతి ద్వారానే తొలగుతుంది. తండ్రి పురుషార్థము చేసేందుకు యుక్తులు తెలియజేశారు. స్మృతి ద్వారా మాత్రమే పాపాలు సమాప్తమవుతాయి. అనేకమంది తెలివిహీనులు, స్మృతి చేయనందుకు నామ-రూపాలు మొదలైనవాటిలో చిక్కుకుంటారు. హర్షితముఖముతో ఎవరికైనా జ్ఞానము అర్థం చేయించడం కూడా కష్టమే. ఈ రోజు ఎవరికైనా అర్థం చేయించి సంతోషము పొందుతారు, రేపు ఏదైనా ఆటంకము వస్తే ఆ సంతోషం మాయమైపోతుంది. ఇది మాయ చేసే దాడి అని అర్థము చేసుకోవాలి, అందుకే పురుషార్థము చేసి తండ్రిని స్మృతి చేయాలి. ఏడ్వడం, బాధతో బాదుకోవడం, దిగులు చెందడం మొదలైనవి చేయకూడదు. అలా చేస్తే మాయ చెప్పుతో కొడుతుంది అని అర్థము చేసుకోవాలి, అందుకే పురుషార్థము చేసి తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి స్మృతితో చాలా సంతోషము కలుగుతుంది. వెంటనే వారి నోటి నుండి వాణి వెలువడుతుంది. పతిత పావనులైన తండ్రి, నన్ను స్మృతి చేయమని చెప్తున్నారు. రచయిత అయిన తండ్రి పరిచయమున్న మనిషి ఒక్కరు కూడా లేరు. మనుష్యులై ఉండి తండ్రిని తెలుసుకోకపోతే జంతువుల కంటే హీనము కదా. గీతలో కృష్ణుని పేరు వేసేశారు కనుక తండ్రిని ఎలా స్మృతి చేయాలి! ఇది పెద్ద తప్పు, ఇదే మీరు అర్థం చేయించాలి. గీతా భగవానుడు శివబాబా, వారసత్వమునిచ్చేది వారే. వారు ముక్తి-జీవన్ముక్తి దాత, ఈ విషయాలు ఇతర ధర్మాల వారి బుద్ధిలో కూర్చోవు. వారంతా లెక్కాచారము సమాప్తి చేసుకొని తిరిగి వెళ్ళిపోతారు. చివర్లో కొద్దిగా పరిచయము లభిస్తుంది, అయినా వారి ధర్మములోకే వెళ్తారు. మీరు దేవతలుగా ఉండేవారని, ఇప్పుడు తండ్రిని స్మృతి చేస్తే మళ్ళీ దేవతలుగా అవుతారని, వికర్మలు వినాశనమైపోతాయని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇంత చెప్తున్నా తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. బాబాకు వ్రాస్తారు - ఈ రోజు మా స్థితి వాడిపోయి ఉంది, తండ్రిని స్మృతి చేయలేదు. స్మృతి చేయకుంటే తప్పకుండా వాడిపోతారు. ఇది శవాల ప్రపంచము. అందరూ మరణించే ఉన్నారు. మీరు తండ్రికి చెందినవారిగా అయితే తండ్రి ఆజ్ఞ - నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. ఈ శరీరము అయితే పాత తమోప్రధానమైనది. చివరి వరకు ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. ఎంత వరకు తండ్రి స్మృతిలో ఉండి కర్మాతీత స్థితిని చేరుకోరో, అంతవరకు మాయ కదిలిస్తూనే ఉంటుంది, ఎవ్వరినీ వదలిపెట్టదు. మాయ ఎలా ఎదురు దెబ్బ తీస్తుందో చెక్ చేసుకుంటూ ఉండాలి. మనల్ని భగవంతుడు చదివిస్తున్నారని, ఎందుకు మర్చిపోవాలి? ఆత్మ చెప్తుంది - ఆ తండ్రి మా ప్రాణము కంటే ప్రియమైనవారు. అటువంటి తండ్రిని మీరెందుకు మర్చిపోతారు? దానము చేసేందుకు తండ్రి జ్ఞాన ధనమునిస్తారు. ప్రదర్శినీలలో, మేళాలలో మీరు చాలా మందికి దానమివ్వగలరు. మీ అంతట మీరే అభిరుచితో పరుగెత్తి వెళ్ళాలి. ఇప్పుడింకా అక్కడకు వెళ్ళి అర్థం చేయించమని బాబా ఉత్సాహమిప్పించవలసి వస్తుంది. వారిలో కూడా బాగా అర్థము చేసుకున్నవారు ఉండాలి. దేహాభిమానుల యొక్క బాణము తగలనే తగలదు. ఖడ్గాలు కూడా అనేక రకాలు ఉంటాయి కదా. మీ యోగ ఖడ్గము కూడా చాలా పదునుగా ఉండాలి. సేవ చేయాలని, అనేక మంది కళ్యాణము చేయాలని ఉత్సాహము ఉండాలి. చివర్లో తండ్రి తప్ప ఇతరులెవ్వరూ గుర్తు రానంతగా తండ్రిని స్మృతి చేసే అభ్యాసము ఉండాలి, అప్పుడే మీరు రాజ్య పదవిని పొందుతారు. అంత్య కాలములో భగవంతుని స్మృతి చేయాలి, నారాయణుని స్మృతి చేయాలి. తండ్రిని మరియు నారాయణుడినే (వారసత్వమునే) స్మృతి చేయాలి. కాని మాయ తక్కువైనది కాదు. అనేక మంది కచ్చాగా మిగిలిపోతారు. ఎవరి నామ రూపాలలోనైనా చిక్కుకున్నప్పుడు తప్పుడు కర్మల ఖాతా తయారవుతుంది. పరస్పరము ప్రైవేటుగా ఉత్తరాలు వ్రాసుకుంటారు. దేహధారులపై ప్రేమ ఏర్పడితే తప్పుడు కర్మల ఖాతా తయారవుతుంది. బాబా వద్దకు సమాచారాలు వస్తాయి. తప్పుడు కర్మలు చేసిన తర్వాత, బాబా జరిగిపోయింది అని చెప్తారు. అరే! తప్పుడు ఖాతా తయారైపోయింది కదా! ఈ శరీరమైతే మురికిది, దీనిని మీరెందుకు స్మృతి చేస్తారు. తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేస్తే సదా సంతోషంగా ఉంటారు. ఈ రోజు సంతోషంగా ఉంటారు, రేపు మళ్ళీ శవంలా అయిపోతారు. జన్మ జన్మాంతరాలుగా నామ రూపాలలో చిక్కుకుంటూ వచ్చారు కదా. స్వర్గములో నామ రూపాల ఈ జబ్బు ఉండనే ఉండదు. అక్కడ మోహాజీత్ కుటుంబాలు ఉంటాయి. మనము ఆత్మలము, శరీరాలు కాదని వారికి తెలుసు. అది ఆత్మాభిమానుల ప్రపంచము. ఇది దేహాభిమానుల ప్రపంచము. అర్ధ కల్పము మీరు దేహీ-అభిమానులుగా అవుతారు. ఇప్పుడు దేహాభిమానము వదలమని తండ్రి చెప్తున్నారు. దేహీ-అభిమానులుగా అయితే చాలా మధురంగా, శీతలంగా అవుతారు. తండ్రి స్మృతిని మర్చిపోవద్దని చెప్పి పురుషార్థము చేయించేవారు చాలా కొద్దిమందే ఉన్నారు. తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు - నన్ను స్మృతి చేయండి, చార్టు పెట్టండి. కాని మాయ చార్టు కూడా పెట్టనివ్వదు. ఇటువంటి మధురమైన తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి! వీరు పతులకు పతి, తండ్రులకే తండ్రి కదా. తండ్రిని స్మృతి చేసి ఇతరులను కూడా తమ సమానంగా తయారుచేసే పురుషార్థము చేయాలి. ఇందులో చాలా అభిరుచి ఉండాలి. సేవాధారి పిల్లలనైతే తండ్రి ఉద్యోగము నుండి విడుదల చేయిస్తారు. పరిస్థితులను చూసి, ఇప్పుడీ వ్యాపారములో నిమగ్నమవ్వమని చెప్తారు. లక్ష్యము-ఉద్దేశ్యము మీ ఎదురుగా నిలబడి ఉంది. భక్తి మార్గములో కూడా చిత్రాల ముందు స్మృతిలో కూర్చుంటారు కదా. మీరు కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మ అయిన తండ్రిని స్మృతి చేయాలి, విచిత్రులుగా అయ్యి విచిత్రమైన తండ్రిని స్మృతి చేయాలి. ఇది కష్టము. విశ్వానికి అధికారులుగా అవ్వడం పిన్నమ్మ ఇల్లు (సులభము) కాదు. తండ్రి చెప్తున్నారు - నేను విశ్వానికి యజమానిగా అవ్వను, మిమ్మల్ని చేస్తాను. అందుకొరకు ఎంత తల బాదుకోవలసి (కష్టపడవలసి) వస్తుంది. సుపుత్రులకైతే అదే చింత ఉంటుంది, సెలవు తీసుకొని అయినా సేవలో నిమగ్నమవ్వాలి. చాలామంది పిల్లలకు బంధనాలు కూడా ఉన్నాయి, మోహము కూడా ఉంటుంది. మీ జబ్బులన్నీ బయటపడతాయని తండ్రి చెప్తున్నారు. మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. మాయ మిమ్మల్ని తొలగించేందుకు ప్రయత్నిస్తుంది. ముఖ్యమైనది స్మృతియే, రచయిత, రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము లభించింది, ఇంకేం కావాలి. భాగ్యశాలి పిల్లలు అందరికీ సుఖమునిచ్చే పురుషార్థము చేస్తారు, మనసా, వాచా, కర్మణా ఎవ్వరికీ దుఃఖమునివ్వరు. శీతలముగా నడుచుకుంటే భాగ్యము తయారవుతూ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అర్థము చేసుకోకపోతే వారి భాగ్యములో లేదని భావించబడుతుంది. భాగ్యములో ఉన్నవారు శ్రద్ధగా వింటారు. ఏమేం చేసేవారో అనుభవాలు కూడా వినిపిస్తారు కదా. ఇంతవరకు ఏమేం చేశారో, వాటి వలన లభించింది దుర్గతియే అని ఇప్పుడు తెలిసింది. తండ్రిని స్మృతి చేసినప్పుడే సద్గతి లభిస్తుంది. చాలా కష్టంగా గంటో, అర్ధ గంటో స్మృతి చేస్తూ ఉంటారు. లేకుంటే గుటకలు మింగుతూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు - అర్ధ కల్పము గుటకులు మింగుతూ వచ్చారు, ఇప్పుడు తండ్రి లభించారు, ఇప్పుడు మీది విద్యార్థి జీవితము కనుక సంతోషము ఉండాలి కదా. కాని తండ్రిని పదే-పదే మర్చిపోతారు.

తండ్రి చెప్తున్నారు - మీరు కర్మయోగులు. ఆ వృత్తి, వ్యాపారాదులు చేయాల్సిందే. నిద్ర కూడా తగ్గించుకోవడం మంచిది. స్మృతి ద్వారా సంపాదనే కాక సంతోషంగా కూడా ఉంటుంది. స్మృతిలో కూర్చోవడం తప్పనిసరి. పగటి పూట తీరక లభించదు కనుక రాత్రి పూట సమయాన్ని కేటాయించుకోవాలి. స్మృతి ద్వారా చాలా సంతోషము కలుగుతుంది. ఎవరికైనా బంధనము ఉంటే, మేము తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలని వారికి చెప్పవచ్చు, ఇందులో ఎవ్వరూ ఆపలేరు. కేవలం ప్రభుత్వము వారికి వెళ్ళి అర్థం చేయించండి - వినాశనము ఎదురుగా నిలబడి ఉంది, తండ్రి చెప్తున్నారు, "నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి, ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండాలి" అని. కనుక మేము పవిత్రంగా అవుతున్నామని చెప్పండి. అయితే ఎవరికైతే జ్ఞాన నషా ఉంటుందో వారే చెప్పగలరు. ఇక్కడకు వచ్చిన తర్వాత మళ్ళీ దేహధారులను స్మృతి చేస్తూ ఉండకూడదు. దేహాభిమానములోకి వచ్చి కొట్లాడుతూ, గొడవపడుతూ ఉంటే క్రోధ భూతము వచ్చినట్లవుతుంది. బాబా క్రోధం చేసేవారివైపు ఎప్పుడూ చూడను కూడా చూడరు. సేవ చేసేవారిపట్ల ప్రేమ ఉంటుంది. దేహాభిమానము యొక్క నడవడిక కనిపిస్తుంది. తండ్రిని స్మృతి చేస్తేనే పుష్పాలుగా అవుతారు. ఇదే ముఖ్యమైన మాట. పరస్పరము ఒకరినొకరు చూస్తూ, ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. సేవలో అయితే ఎముకలు ఇవ్వాలి. బ్రాహ్మణులు పరస్పరము క్షీరఖండము వలే (పాలు, పంచదార వలె కలిసి మెలిసి) ఉండాలి. ఉప్పు నీరుగా అవ్వకూడదు. జ్ఞానము లేనందువలన ఒకరి పట్ల ఒకరు, తండ్రి పట్ల కూడా ద్వేషం పెట్టుకుంటారు. అటువంటివారు ఏ పదవిని పొందుతారు! మీకు సాక్షాత్కారాలు అవుతాయి, అప్పుడు గుర్తొస్తుంది - మేము పొరపాట్లు చేసాము అని. అప్పుడు తండ్రి, అదృష్టములో లేకపోతే ఏం చేయగలరని అంటారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. నిర్బంధనులుగా అయ్యేందుకు జ్ఞాన నషాలో ఉండండి. దేహాభిమానపు నడవడిక ఉండకూడదు. పరస్పరములో ఉప్పునీరుగా అయ్యే సంస్కారము ఉండకూడదు. దేహధారులపై ప్రేమ ఉంటే బంధనముక్తులుగా అవ్వలేరు.

2. కర్మయోగులై ఉండాలి. స్మృతిలో కూర్చోవడం తప్పనిసరి. ఆత్మాభిమానులుగా అయి చాలా మధురంగా, శీతలంగా అయ్యేందుకు పురుషార్థము చేయాలి. సేవలో ఎముకలనివ్వాలి.

వరదానము:-

ఏక్ నామి మరియు ఎకానమి (పొదుపు) పాఠము ద్వారా అలజడిలో కూడా అచల్-అడోల్ భవ (చలించకుండా, స్థిరంగా కండి)

సమయానుసారంగా, అశాంతి మరియు అలజడి యొక్క వాతావరణము పెరుగుతూ వెళ్తుంది. ఇటువంటి సమయంలో చలించకుండా, స్థిరంగా ఉండేందుకు బుద్ధి లైను చాలా క్లియర్గా ఉండాలి. అందుకు సమయానుసారంగా టచింగ్ మరియు క్యాచింగ్ పవర్ అవసరము. ఈ శక్తిని పెంచుకునేందుకు ఏక్ నామి మరియు ఎకానమి చేసేవారిగా అవ్వండి. ఇటువంటి పిల్లల లైను క్లియర్ గా ఉన్న కారణంగా బాప్దాదా డైరెక్షన్లను సహజంగా గ్రహించి అలజడిలో కూడా చలించకుండా, స్థిరంగా ఉంటారు.

స్లోగన్:-

స్థూల సూక్ష్మమైన కోరికలను త్యాగము చేయండి, అప్పుడు ఏ విషయాన్నైనా ఎదుర్కోగలరు.