ఓంశాంతి. పిల్లలకు తమ ఇల్లు, తమ రాజధాని గుర్తుందా? ఇక్కడ కూర్చున్నప్పుడు బయటి ఇంటి వ్యవహారాలు, ఉద్యోగ-వ్యాపార వ్యవహారాలు మొదలైనవేటి ఆలోచనలు రాకూడదు. కేవలం మన ఇంటి స్మృతి మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఈ పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచములోకి తిరిగి రావాలి, ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. అగ్నిలో ఇదంతా స్వాహా అయిపోతుంది. ఈ కళ్ళతో చూసేదంతా, అంటే మిత్ర-సంబంధీకులు మొదలైనవారందరూ సమాప్తం అయిపోతారు. తండ్రి ఒక్కరు మాత్రమే ఈ జ్ఞానాన్ని ఆత్మలకు అర్థము చేయిస్తారు. పిల్లలూ, ఇప్పుడు తిరిగి తమ ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ నాటకము పూర్తి అవుతుంది. ఇది ఉన్నదే 5 వేల సంవత్సరాల చక్రము. ప్రపంచము సదా ఉండనే ఉంది, కాని అది ఒక్క చక్రము పూర్తిగా తిరిగేందుకు 5 వేల సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ ఉన్న ఆత్మలంతా తిరిగి వెళ్ళిపోతారు. ఈ పాత ప్రపంచమంతా సమాప్తమైపోతుంది. బాబా చాలా మంచి రీతిలో ప్రతి విషయాన్ని అర్థము చేయిస్తారు. కొంతమంది దురదృష్టవంతులు తమ ఆస్తిని అనవసరంగా పోగొట్టుకుంటారు. భక్తి మార్గములో దానపుణ్యాలు చేస్తారు కదా. కొంతమంది ధర్మశాలలు కట్టిస్తారు, కొంతమంది ఆసుపత్రులు నిర్మిస్తారు, దీనికి ఫలితము మరుసటి జన్మలో లభిస్తుందని బుద్ధిలో అర్థం చేసుకుంటారు. ఏ ఆశా లేకుండా, ఆసక్తి లేకుండా ఎవరైనా దానము చేయడము అనేది జరగదు. చాలా మంది మేము ఫలాన్ని ఆశించటం లేదు అని అంటారు. కాని ఫలము తప్పకుండా లభిస్తుంది. ఎవరి వద్దనైనా ధనముందనుకోండి, దానిని ధర్మార్ధం దానం చేస్తే, మాకు మరుసటి జన్మలో ఫలితము లభిస్తుందని వారి బుద్ధిలో ఉంటుంది. ఒకవేళ మమకారము కలిగితే, ఇది నా వస్తువు అని అనుకుంటే, అక్కడ ఫలము లభించదు. దానము మరుసటి జన్మ కొరకే చేస్తారు. మరుసటి జన్మలో లభిస్తుందని తెలిసినప్పుడు దానిపై ఈ జన్మలో మమకారము ఎందుకు పెట్టుకుంటారు, అందుకే మిమ్మల్ని ట్రస్టీగా చేస్తారు, అప్పుడు మమకారము తొలగిపోతుంది. కొంతమంది మంచి ధనవంతుల ఇంటిలో జన్మిస్తే, వారు పూర్వజన్మలో మంచి కర్మలు చేశారని అంటారు. కొంతమంది రాజా-రాణుల వద్ద జన్మ తీసుకుంటారు ఎందుకంటే దానపుణ్యాలు చేసారు, అయితే అది ఒక్క జన్మ యొక్క అల్పకాలిక విషయము. ఇప్పుడైతే మీరు ఈ చదువు చదువుకుంటున్నారు. ఈ చదువు ద్వారా మేము ఇలా తయారవ్వాలని మీకు తెలుసు, కనుక దైవీగుణాలు ధారణ చేయాలి. ఇక్కడ దానము చేసిన దానితో ఈ ఆత్మిక విశ్వవిద్యాలయము, ఆత్మిక ఆసుపత్రులు తెరుస్తారు. దానము చేసిన వాటిపై మమకారము తొలగించివేయాలి. ఎందుకంటే భవిష్యత్తులో 21 జన్మలకు తండ్రి నుండి తీసుకుంటామని మీకు తెలుసు. తండ్రి ఈ ఇళ్ళు మొదలైనవి కట్టిస్తారు. ఇవి తాత్కాలికము. లేకుంటే ఇంతమంది పిల్లలు ఎక్కడ ఉంటారు? అంతా శివబాబాకు ఇచ్చేస్తారు. శివబాబా యజమాని. వారు ఇతని ద్వారా ఈ పని చేయిస్తారు. శివబాబా రాజ్యం చేయరు. వారు స్వయం దాత. వారికి దేనిపై మమకారముంటుంది! ఇప్పుడు తండ్రి శ్రీమతమునిస్తున్నారు - మృత్యువు ఎదురుగా ఉంది. ఇంతకుముందు ఎవరికైనా దానము ఇస్తే మృత్యువు గురించి ఆలోచించేవారు కాదు. ఇప్పుడు బాబా వచ్చారు కావున పాత ప్రపంచమంతా సమాప్తమవ్వనున్నది. తండ్రి చెప్తున్నారు, ఈ పతిత ప్రపంచాన్ని సమాప్తము చేసేందుకే నేను వచ్చాను. ఈ రుద్ర యజ్ఞములో పాత ప్రపంచమంతా స్వాహా అవ్వనున్నది. భవిష్యత్తు కొరకు ఏదైతే తయారుచేసుకుంటారో, అది కొత్త ప్రపంచములో లభిస్తుంది. లేకుంటే మొత్తమంతా ఇక్కడే సమాప్తమైపోతుంది. ఎవరో ఒకరు తినేస్తారు. ఈ రోజులలో మనుష్యులు అప్పులు కూడా ఇస్తారు. వినాశనమైతే అంతా సమాప్తమైపోతుంది. ఇక ఎవ్వరూ ఎవ్వరికీ ఏమీ ఇవ్వరు. అంతా అలా ఉండిపోతుంది. ఈ రోజు బాగుంటారు, రేపు దివాలా తీస్తారు. ఎవరికీ ధనము తిరిగి లభించదు. ఎవరికైనా ఇస్తే, వారు మరణించారనుకోండి, ఎవరు తిరిగి ఇస్తారు? మరి ఇప్పుడు ఏం చేయాలి? భారతదేశ 21 జన్మల కళ్యాణము కొరకు, 21 జన్మల స్వకళ్యాణము కొరకు అది ఉపయోగించాలి. మీరు మీ కొరకే చేసుకుంటున్నారు. శ్రీమతమును అనుసరించి మేము ఉన్నత పదవి పొందుతామని మీకు తెలుసు, దాని వలన 21 జన్మలకు సుఖ-శాంతులు లభిస్తాయి. దీనిని అవినాశి బాబా యొక్క ఆత్మిక ఆసుపత్రి, ఆత్మిక యూనివర్సిటీ అని అంటారు, దీని ద్వారా ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతోషము లభిస్తాయి. కొంతమందికి ఆరోగ్యము ఉంటుంది, ఐశ్వర్యము ఉండదు కనుక సంతోషము ఉండదు. రెండూ ఉంటే, సంతోషము కూడా ఉంటుంది. తండ్రి మీకు 21 జన్మలకు రెండూ ఇస్తారు. వాటిని 21 జన్మలకు జమ చేసుకోవాలి. యుక్తులు రచించడం పిల్లల పని. తండ్రి వస్తూనే పేద పిల్లల భాగ్యము తెరుచుకుంటుంది. తండ్రి పేదల పెన్నిధి. ధనవంతుల భాగ్యములోనే ఈ విషయాలేవీ లేవు. ఈ సమయంలో భారతదేశము అన్నింటికంటే పేదది. ఏదైతే షావుకారుగా ఉండేదో అదే ఇప్పుడు పేదదైపోయింది. ఈ సమయంలో అందరూ పాపాత్మలే. పుణ్యాత్మలు ఎక్కడ ఉంటారో, అక్కడ ఒక్క పాపాత్మ కూడా ఉండదు. అది సత్యయుగము సతోప్రధానమైనది, ఇది కలియుగము తమోప్రధానమైనది. ఇప్పుడు మీరు సతోప్రధానంగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. తండ్రి పిల్లలైన మీకు స్మృతి తెప్పిస్తున్నారు, ఇప్పుడు మేమే స్వర్గవాసులుగా ఉండేవారమని, తర్వాత 84 జన్మలు తీసుకున్నామని మీరు తెలుసుకున్నారు. 84 లక్షల యోనులనేది కేవలం వ్యర్థ ప్రలాపాలు. ఇన్ని జన్మలు జంతువుల యోనిలో ఉన్నారా! చివర్లో మనుష్య పదవి వచ్చిందా? ఇప్పుడు తిరిగి వెళ్ళాలా?
ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. 40 - 50 వేల సంవత్సరాలు లేనే లేవు. మనుష్యులు పూర్తి గాఢాంధకారములో ఉన్నారు. అందుకే రాతిబుద్ధి కలవారని అంటారు. ఇప్పుడు మీరు రాతిబుద్ధి నుండి బంగారుబుద్ధి కలవారిగా అవుతారు. ఈ విషయాలు సన్యాసులు మొదలైనవారెవ్వరూ చెప్పలేరు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలని తండ్రి స్మృతినిప్పిస్తున్నారు. ఎంత వీలైతే అంత తమ బ్యాగ్ బ్యాగేజి అంతా ట్రాన్స్ఫర్ చేయండి. బాబా, ఇదంతా తీసుకోండి, మేము సత్యయుగంలో 21 జన్మలకు పొందుతాము అని అంటారు. ఈ బాబా కూడా దానపుణ్యాలు చేస్తూ ఉండేవారు. అందులో చాలా అభిరుచి ఉండేది. వ్యాపారస్థులు రెండు పైసాల భాగము ధర్మము కొరకు కేటాయిస్తారు, కాని ఈ బాబా ఒక అణా(12 పైసలు) కేటాయించేవారు. ఎవరు వచ్చినా, వారి ద్వారము నుండి ఖాళీ చేతులతో వెళ్ళేవారు కాదు. ఇప్పుడు భగవంతుడు సన్ముఖములోకి వచ్చారు, ఈ విషయము ఎవ్వరికీ తెలియదు. మనుష్యులు దానపుణ్యాలు చేస్తూ-చేస్తూ మరణిస్తారు. తర్వాత ఎక్కడ లభిస్తుంది? పవిత్రంగా అవ్వరు, తండ్రిపై ప్రీతినుంచరు. యాదవులది, కౌరవులది వినాశనకాలములో విపరీతబుద్ధి అని తండ్రి అర్థం చేయించారు. పాండవులది వినాశకాలములో ప్రీతి బుద్ధి. యూరోపు వాసులంతా యాదవులు. వారు మిసైల్స్ మొదలైనవి తయారుచేస్తారు. శాస్త్రాలలో అయితే ఏవేవో విషయాలు వ్రాసేశారు. అనేక శాస్త్రాలు డ్రామా ప్లాను అనుసారంగా తయారై ఉన్నాయి. ఇందులో ప్రేరణ మొదలైన విషయాలేవీ లేవు. ప్రేరణ అనగా సంకల్పము. అయితే తండ్రి ప్రేరణతో చదివించరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇతను కూడా ఒక వ్యాపారస్థుడే. మంచి పేరు ఉండేది, అందరూ చాలా గౌరవించేవారు. తండ్రి ప్రవేశిస్తూనే వీరు నిందలు పడడం ప్రారంభమైపోయింది. శివబాబాను గురించి ఎవ్వరికీ తెలియదు. కనుక వారిని నిందించలేరు. అందరూ ఇతడినే నిందించేవారు. నేను వెన్న తినలేదని కృష్ణుడు కూడా అన్నాడు కదా. అలాగే ఇతను కూడా ఈ పనులన్నీ శివబాబావే, నేనేమీ చేయడం లేదని అంటారు. వారు ఇంద్రజాలికులు, నేను కాదు. అనవసరంగా ఇతడిని నిందించారు. నేనెవరినైనా ఎత్తుకుపోయానా? మీరు పారిపోయి రండి అని నేను ఎవ్వరికీ చెప్పలేదు. నేను అక్కడ ఉన్నాను, అందరూ వారంతట వారే అక్కడకు పారిపోయి వచ్చేశారు. ఊరికే నాపై దోషము వేశారు. ఎన్ని నిందలు పడవలసి వచ్చింది. శాస్త్రాలలో ఏమేమో వ్రాసేశారు. ఇది మళ్ళీ జరుగుతుందని తండ్రి చెప్తున్నారు. ఇవన్నీ జ్ఞానానికి సంబంధించిన విషయాలు. మనుష్యులెవ్వరూ ఈ పని చేయలేరు. అది కూడా బ్రిటిష్ ప్రభుత్వమున్న రాజ్యములో ఇంతమంది కన్యలు, మాతలు ఎవరి వద్దనైనా కూర్చుంటే ఏమవుతుంది? ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. ఎవరి బంధువులైనా వస్తే వెంటనే తరిమేసేవారు. అయితే బాబా అనేవారు, మీరు వీరికి నచ్చజెప్పి తీసుకెళ్ళండి, నేను వద్దని చెప్పను. కాని ఎవ్వరికీ అంత ధైర్యముండేది కాదు. తండ్రి యొక్క శక్తి ఉండేది కదా. నథింగ్ న్యూ (క్రొత్తేమీ కాదు). ఇదంతా మళ్ళీ జరుగుతుంది. నిందలు కూడా పడవలసి వస్తుంది. ద్రౌపది విషయము కూడా ఉంది. వీరంతా ద్రౌపదులు, దుశ్శాసనులు, ఒక్కరి విషయం కాదు. శాస్త్రాలలో ఈ వ్యర్థ ప్రలాపాలు ఎవరు వ్రాశారు? ఈ పాత్ర కూడా డ్రామాలో ఉంది అని తండ్రి చెప్తున్నారు. ఆత్మ జ్ఞానమెవ్వరిలోనూ లేదు. పూర్తి దేహాభిమానులుగా తయారైఉన్నారు. దేహీ-అభిమానులుగా అవ్వడంలో చాలా శ్రమ ఉంది. రావణుడు పూర్తిగా తలక్రిందులుగా చేసేశాడు. ఇప్పుడు తండ్రి సరిగ్గా చేస్తున్నారు.
దేహీ అభిమానులుగా అవ్వడం వలన స్వతహాగా స్మృతి ఉంటుంది, నేను ఆత్మను, ఈ దేహము వాయించేందుకు ఒక వాయిద్యము. ఈ స్మృతి ఉన్నా దైవీగుణాలు వస్తూ ఉంటాయి. మీరు ఎవ్వరికీ దుఃఖము కూడా ఇవ్వలేరు. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యము భారతదేశములోనే ఉండేది. ఇది 5 వేల సంవత్సరాలనాటి విషయము. ఎవరైనా లక్షల సంవత్సరాలని చెప్తే వారు గాఢాంధకారములో ఉన్నారు. డ్రామానుసారముగా సమయము పూర్తి అయినప్పుడు తండ్రి మళ్ళీ వచ్చారు. ఇప్పుడు నా శ్రీమతముపై నడవండి అని తండ్రి చెప్తున్నారు. మృత్యువు ఎదురుగా ఉంది. ఇక లోపల ఉన్న ఆశలన్నీ అలాగే ఉండిపోతాయి. అందరూ తప్పకుండా మరణించాల్సిందే. ఇది అదే మహాభారత యుద్ధము. స్వకళ్యాణమెంత చేసుకుంటారో అంత మంచిది. లేకుంటే మీరు ఖాళీ చేతులతో వెళ్ళవలసి వస్తుంది. ప్రపంచములోని వారంతా ఖాళీ చేతులతోనే వెళ్తారు. పిల్లలైన మీరు మాత్రమే చేతులనిండుగా అనగా ధనవంతులై వెళ్తారు. ఇవన్నీ అర్థము చేసుకునేందుకు చాలా విశాలబుద్ధి కావాలి. ఎన్ని ధర్మాల మనుష్యులున్నారు! ప్రతి ఒక్కరిది తమ-తమ పాత్ర నడుస్తుంది. ఒకరి పాత్ర మరొకరి పాత్రతో కలవదు. ఎవరి ఫీచర్స్ (రూపురేఖలు) వారివే, ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఇదంతా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. ఇవన్నీ అద్భుతమైన విషయాలు కదా. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలమైన మనము 84 జన్మల చక్రములో తిరుగుతాము, మనమంతా ఈ డ్రామాలో పాత్రధారులము, ఈ చక్రము నుండి మనము బయటపడలేము, మోక్షము పొందలేము. అందుకు ప్రయత్నించడం కూడా వ్యర్థమే. ఈ డ్రామా నుండి ఎవ్వరూ బయటకు వెళ్ళలేరు, ఎవరూ కొత్తగా చేరలేరు - అలా జరగనే జరగదు. ఇంత జ్ఞానము అందరి బుద్ధిలోనూ ఉండలేదు. రోజంతా ఈ జ్ఞానాన్ని మననం చేస్తూ ఉండండి. ఒక ఘడియ, అర్ధ ఘడియ... ఇలా స్మృతి చేస్తూ ఉండండి. తర్వాత సమయమును పెంచుకుంటూ వెళ్ళండి. 8 గంటలు భలే స్థూల సేవ చేయండి, విశ్రాంతి కూడా తీసుకోండి, ఈ ఆత్మిక గవర్నమెంటుకు కూడా సమయము కేటాయించండి. మీరు మీ సేవనే చేసుకుంటున్నారు, ఇది ముఖ్యమైన విషయము. స్మృతియాత్రలో ఉండండి మరియు జ్ఞానము ద్వారా ఉన్నత పదవిని పొందాలి. స్మృతి చార్టు పూర్తిగా పెట్టండి. జ్ఞానము సహజమే, తండ్రి బుద్ధిలో నేను మనుష్య సృష్టికి బీజరూపుడను అని ఉంది, నాకు ఈ సృష్టి ఆది-మధ్య అంత్యములు తెలుసు. మనము కూడా బాబా పిల్లలమే. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతూ ఉందో బాబా అర్థం చేయించారు. ఆ సంపాదనకు మీరు 8 -10 గంటలు ఇస్తున్నారు కదా. మంచి కస్టమర్ లభిస్తే, రాత్రి పూట కూడా ఆవలింతలు రావు. అలా ఆవలిస్తే వీరు అలసిపోయారు అని అనుకుంటారు. బుద్ధి ఎక్కడో బయట భ్రమిస్తూ ఉండి ఉంటుంది. సెంటర్లలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పిల్లలైతే ఇతరుల గురించి చింతన చేయరో, తమ చదువులోనే మస్త్ గా(ఆనందంగా నిమగ్నమై) ఉంటారో, వారి ఉన్నతి సదా జరుగుతూ ఉంటుంది. మీరు ఇతరుల చింతన చేస్తూ, తమ పదవిని భ్రష్టము చేసుకోకూడదు. చెడు వినకండి, చెడు చూడకండి... ఎవరైనా మంచిగా మాట్లాడకపోతే, ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయండి. సదా మిమ్మల్ని మీరు చూసుకోవాలి, ఇతరులను కాదు. తమ చదువును వదలకూడదు. చాలా మంది అలుగుతారు. సెంటరుకు రావడం మానేస్తారు, మళ్ళీ వచ్చేస్తారు. రాలేదంటే ఇంకెక్కడికి వెళ్తారు? పాఠశాల అయితే ఒక్కటే. మీ కాళ్ళను మీరే గొడ్డలితో నరుక్కోకండి. మీరు మీ చదువులో మస్త్ గా(ఆనందంగా నిమగ్నమై) ఉండండి. చాలా సంతోషంగా ఉండండి. భగవంతుడు చదివిస్తున్నారు. ఇంకేం కావాలి? భగవంతుడు మన తండ్రి, టీచరు, సద్గురువు, బుద్ధియోగము వారొక్కరితోనే జోడింపబడుతుంది. వారు ఈ ప్రపంచములోని వారందరికీ నంబర్ వన్ ప్రియుడు. వారు మనల్ని విశ్వానికి నంబర్ వన్ యజమానులు చేస్తారు.
తండ్రి చెప్తున్నారు, మీ ఆత్మ చాలా పతితంగా ఉంది, ఎగరలేదు. రెక్కలు తెగిపోయి ఉన్నాయి. రావణుడు అందరి ఆత్మల రెక్కలను నరికేశాడు. శివబాబా చెప్తున్నారు, నేను తప్ప ఇతరులెవ్వరూ పావనంగా చేయలేరు. పాత్రధారులందరూ ఇక్కడే ఉన్నారు, వృద్ధి చెందుతూ ఉంటారు, తిరిగి ఎవ్వరూ వెళ్ళరు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. స్వయం యొక్క చింతనలో మరియు చదువులో మస్త్ గా (ఆనందముగా నిమగ్నమై) ఉండాలి. ఇతరులను చూడకూడదు. ఎవరైనా మంచిగా మాట్లాడకపోతే ఒక చెవితో విని ఇంకొక చెవి నుండి వదిలేయాలి. అలిగి చదువును వదలేయకూడదు.
2. జీవిస్తూ తమదంతా దానము చేసి దానిపై మమకారాన్ని తొలగించాలి. పూర్తిగా వీలునామా చేసి ట్రస్టీగా ఉండి తేలికగా ఉండాలి. దేహీ-అభిమానులుగా అయి సర్వ దైవీగుణాలను ధారణ చేయాలి.