06-04-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - మీపై మీరు దయ చూపుకోండి. తండ్రి ఇచ్చే మతంపై నడుచుకున్నట్లయితే, అపారమైన సంతోషం ఉంటుంది, మాయ యొక్క శాపము నుండి సురక్షితంగా ఉంటారు”

ప్రశ్న:-

మాయ శాపము ఎందుకు తగులుతుంది? శాపము తగిలిన ఆత్మ యొక్క గతి ఏమవుతుంది?

జవాబు:-

1. తండ్రిని, చదువును (జ్ఞానరత్నాలను) అగౌరవపరచడం వలన, తమ మతముపై నడవడం ద్వారా మాయ శాపము తగులుతుంది. 2. ఆసురీ నడవడిక కలిగి ఉండి, దైవీ గుణాలు ధారణ చేయకపోతే, మీపైన మీరు నిర్దయులుగా అవుతారు. బుద్ధికి తాళము వేయబడుతుంది. వారు తండ్రి హృదయమును అధిరోహించలేరు.

ఓంశాంతి. మనము ఆత్మాభిమానులుగా అయ్యి, తండ్రిని స్మృతి చేయాలని ఆత్మిక పిల్లలకు ఇప్పుడు నిశ్చయము ఉంది. మాయా రూపీ రావణుడు శాపగ్రస్థులుగా, దుఃఖితులుగా చేస్తాడు. శాపము అన్న పదమే దుఃఖమునకు చెందినది, వారసత్వము అనే పదము సుఖానికి చెందినది. నమ్మకస్తులుగా, ఆజ్ఞాకారులుగా ఉన్న పిల్లలకు ఈ విషయాలు బాగా తెలుసు. ఆజ్ఞాకారులుగా లేని వారు అసలు పిల్లలే కారు. వారు స్వయాన్ని ఎలా భావించినా కానీ తండ్రి హృదయమును అధిరోహించలేరు, వారసత్వాన్ని పొందలేరు. ఎవరైతే మాయ చెప్పినట్లు నడుచుకుంటారో, తండ్రిని స్మృతి కూడా చేయరో, వారు ఎవ్వరికీ అర్థం చేయించలేరు. అనగా స్వయం వారికి వారే శపించుకుంటారు. మాయ చాలా శక్తివంతమయిందని పిల్లలకు తెలుసు. అనంతమైన తండ్రి మాటలను కూడా వినకపోతే, వారు మాయ చెప్పింది విన్నట్లే. మాయకు వశమైపోతారు. ప్రభువు ఆజ్ఞను శిరసావహిస్తామని అంటారు కదా. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, పురుషార్థము చేసి తండ్రిని స్మృతి చేస్తే, మాయ ఒడి నుండి బయటపడి ప్రభువు ఒడిలోకి వచ్చేస్తారు. తండ్రి బుద్ధివంతులకే బుద్ధివంతులు. తండ్రి మాట వినకపోతే, బుద్ధికి తాళము పడుతుంది. తాళము తెరిచేవారు ఒక్క తండ్రి మాత్రమే. శ్రీమతమును అనుసరించకపోతే, వారి గతి ఏమవుతుంది? మాయ మతముపై ఏ పదవీ పొందలేరు. భలే వింటారు కానీ ధారణ చేయలేరు, ఇతరులతో ధారణ చేయించలేరు, కావున వారి స్థితి ఎలా ఉంటుంది? తండ్రి అయితే పేదల పెన్నిధి. మనుష్యులు పేదలకు దానము చేస్తారు, తండ్రి కూడా వచ్చి ఎంత అనంతమైన దానమును చేస్తారు. శ్రీమతమును అనుసరించకపోతే ఒక్కసారిగా బుద్ధికి తాళము పడ్తుంది. ఆ తర్వాత ఏం ప్రాప్తించుకుంటారు? శ్రీమతమును అనుసరించేవారే తండ్రికి పిల్లలుగా ఉంటారు. తండ్రి అయితే దయా హృదయులు. బయటికి వెళ్తూనే, మాయ ఒక్కసారిగా సమాప్తము చేస్తుంది అని అర్థము కూడా చేసుకుంటారు. ఎవరైనా ఆత్మ హత్య చేసుకున్నట్లయితే, తమంతట తామే సర్వనాశనము చేసుకుంటారు. తండ్రి అయితే అర్థము చేయిస్తూనే ఉంటారు - మీపై మీరు దయ చూపించండి, శ్రీమతమును అనుసరించండి, మీ మతముపై నడవకండి. శ్రీమతమును అనుసరిస్తే అపారమైన సంతోషము కలుగుతుంది. లక్ష్మీనారాయణుల ముఖము ఎంత సంతోషంగా ఉంటుందో చూడండి. కావున పురుషార్థము చేసి ఇటువంటి ఉన్నతమైన పదవిని పొందాలి కదా. తండ్రి అవినాశి జ్ఞాన రత్నములిస్తూ ఉంటే వాటిని ఎందుకు అగౌరవపరచాలి? రత్నాలతో ఒడి నింపుకోవాలి. వింటారు కానీ ఒడి నిండదు, ఎందుకంటే తండ్రిని స్మృతి చేయరు. ఆసురీ నడవడిక నడుస్తూ ఉంటారు. తండ్రి పదే పదే అర్థము చేయిస్తూ ఉంటారు - మీపై మీరు దయ చూపించండి, దైవీ గుణాలను ధారణ చేయండి. వారిది ఆసురీ సంప్రదాయము. తండ్రి వచ్చి వారిని స్వర్గవాసులుగా చేస్తారు. పరిస్తాన్ అనగా స్వర్గము. మనుష్యులు ఎన్ని ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. సన్యాసులు మొదలైన వారి వద్దకు వెళ్తారు, మనసుకు శాంతి లభిస్తుందని భావిస్తారు. వాస్తవానికి ఈ పదమే తప్పు, దీనికి అర్థమే లేదు. శాంతి కావలసింది ఆత్మకు కదా. ఆత్మ స్వయంగా శాంతి స్వరూపము. అయితే ఆత్మకు శాంతి ఎలా లభిస్తుంది? అని కూడా అనరు. మనసుకు శాంతి ఎలా లభిస్తుంది? అని అంటారు. మనసు ఏమిటి, బుద్ధి ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి కొద్దిగా కూడా తెలియదు. వారు ఏదైతే అంటారో లేక చేస్తారో అదంతా భక్తి మార్గం. భక్తిమార్గము వారు మెట్లు దిగుతూ-దిగుతూ తమోప్రధానంగా అవుతూ ఉంటారు. భలే కొంతమందికి ధనము, ఆస్తి మొదలైనవి ఉండవచ్చు కానీ ఉన్నది రావణ రాజ్యములోనే కదా.

పిల్లలైన మీరు చిత్రాలపై అర్థము చేయించే చాలా మంచి అభ్యాసమును చేయాలి. తండ్రి అన్ని సేవాకేంద్రాలలోని పిల్లలకు అర్థము చేయిస్తూ ఉంటారు, కానీ నంబరువారుగా అయితే ఉన్నారు కదా. కొంతమంది పిల్లలు రాజ్య పదవిని పొందే పురుషార్థము చేయకపోతే ప్రజలలోకి వెళ్ళి ఏమవుతారు? సేవ చేయరు, మేము ఏమవుతాము అని తమపై తాము కూడా దయ చూపుకోరు, అప్పుడు డ్రామాలో వారి పాత్ర అంతే అని అర్థము చేసుకోవాలి. తమ కళ్యాణము చేసుకునేందుకు, జ్ఞానముతో పాటు యోగము కూడా ఉండాలి. యోగములో లేనట్లయితే కొద్దిగా కూడా కళ్యాణము జరగదు. యోగము లేకుండా పావనంగా అవ్వలేరు. జ్ఞానమయితే చాలా సహజమే, కానీ తమ కళ్యాణము కూడా చేసుకోవాలి. యోగములో లేనట్లయితే కొద్దిగా కూడా కళ్యాణము జరగదు. యోగము లేకుండా పావనంగా ఎలా అవుతారు? జ్ఞానము వేరు, యోగము వేరు. యోగములో చాలామంది అపరిపక్వంగా ఉన్నారు. స్మృతి చేయాలనే తెలివి కూడా ఉండదు. అలాంటప్పుడు స్మృతి చేయకుండా వికర్మలు ఎలా వినాశనమవుతాయి? తర్వాత శిక్షలు చాలా అనుభవించవలసి వస్తుంది, చాలా పశ్చాత్తాపపడవలసి వస్తుంది. ఆ స్థూల సంపాదన చేయకపోతే ఏ శిక్షలూ అనుభవించరు, ఇందులో అయితే పాపాల భారము తలపై ఉంది. దాని వలన చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. పిల్లలుగా అయి కూడా నియమ విరుద్ధంగా నడుచుకుంటే, చాలా శిక్షలు లభిస్తాయి. తండ్రి అంటున్నారు - మీపైన మీరు దయ చూపుకోండి, యోగము చేయండి. అలా చేయకపోతే, అనవసరంగా మిమ్ములను మీరే హత్య చేసుకుంటారు. ఎలా అయితే ఎవరైనా ఎత్తైన స్థలము నుండి క్రింద పడి, మరణించకపోతే, ఆసుపత్రిలో పడి ఉంటే, బాధతో అరుస్తూ ఉంటారు. అనవసరంగా నేను దూకాను, మరణించలేదు, ఇక దేనికి పనికొస్తాను. ఇక్కడ కూడా అలాంటి వారున్నారు. చాలా ఉన్నతమైన స్థితికి ఎక్కాలి. శ్రీమతమును అనుసరించకపోతే క్రింద పడిపోతారు. ముందు-ముందు ప్రతి ఒక్కరు ఏ పదవిని పొందుతారో తెలుసుకుంటారు. సేవాధారులుగా, ఆజ్ఞాకారులుగా ఉన్నవారే ఉన్నత పదవిని పొందుతారు. లేకపోతే అక్కడ దాస దాసీలు మొదలైనవారిగా అవుతారు. అంతేకాక చాలా కఠిన శిక్షలు కూడా లభిస్తాయి. ఆ సమయంలో ఇద్దరూ ధర్మరాజు రూపాన్ని తీసుకుంటారు. కానీ పిల్లలు అర్థము చేసుకోరు. తప్పులు చేస్తూనే ఉంటారు. శిక్షలైతే ఇక్కడే అనుభవించాలి కదా. ఎవరు ఎంత సేవ చేస్తారో, అంత శోభిస్తారు. లేనట్లయితే దేనికీ పనికి రారు. తండ్రి అంటున్నారు - ఇతరుల కళ్యాణమును చేయలేకపోతే, తమ కళ్యాణమైనా చేసుకోండి. బంధనములో ఉన్నవారు కూడా తమ కళ్యాణాన్ని చేసుకుంటూ ఉంటారు. అయినా తండ్రి పిల్లలకు చెప్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి. నామ రూపాలలో చిక్కుకుంటే మాయ చాలా మోసం చేస్తుంది. పిల్లలు బాబాకు చెప్తుంటారు - బాబా, ఫలానావారిని చూస్తే మాకు చెడు సంకల్పాలు నడుస్తుంటాయి. తండ్రి అర్థము చేయిస్తున్నారు - కర్మేంద్రియాల ద్వారా చెడు కర్మలు ఎప్పుడూ చేయకండి. ఎవరైనా, నడవడిక సరిగ్గాలేని అపవిత్ర మనుష్యులుగా ఉంటే, సెంటరుకు వారిని రానివ్వకూడదు. పాఠశాలలో కూడా చెడు నడవడిక గలవారు చాలా దెబ్బలు తింటూ ఉంటారు. ఫలానావారి నడవడిక బాగాలేనందుకు పాఠశాల నుండి తొలగిస్తున్నామని టీచరు అందరి ముందు తెలుపుతారు. మీ సెంటర్లలో కూడా ఇటువంటి అపవిత్ర దృష్టి గలవారు వస్తే వారిని బయటకు పంపాలి. ఎప్పుడూ కుదృష్టి ఉండకూడదని తండ్రి చెప్తున్నారు. సర్వీసు చేయడం లేదు, తండ్రిని స్మృతి చేయడంలేదు అంటే వారిలో ఏదో ఒక మురికి ఉంది. ఎవరైతే సేవ బాగా చేస్తారో వారి పేరు కూడా ప్రసిద్ధమవుతుంది. ఏ కొంచెము చెడు సంకల్పాలు వచ్చినా, చెడు దృష్టి ఉన్నా, మాయ దాడి చేస్తోందని అర్థము చేసుకోవాలి. వెంటనే వారిని వదిలి వెళ్లాలి. లేకుంటే అది వృద్ధి చెంది నష్టము కలిగిస్తుంది. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే రక్షింపబడుతూ ఉంటారు. తండ్రి పిల్లలందరినీ జాగ్రత్తగా ఉండండి అని సావధాన పరుస్తూ ఉంటారు, మీ కులముకు అపకీర్తి తీసుకురావద్దు. కొంతమంది గంధర్వ వివాహము చేసుకొని కలిసి ఉన్నా పేరు చాలా ప్రసిద్ధము చేస్తారు, కొంతమంది అపవిత్రమైపోతారు. ఇక్కడకు మీరు మీ సద్గతిని చేసుకునేందుకు వచ్చారు, దుర్గతి పొందేందుకు కాదు. అన్నింటికంటే చెడ్డది కామము, తర్వాత క్రోధము. తండ్రి నుండి ఆస్తి తీసుకునేందుకు వస్తారు, కాని మాయ దాడి చేసి శపించినందుకు ఒక్కసారిగా క్రింద పడిపోతారు అనగా స్వయం తమకు తామే శపించుకుంటారు. అందువలన తండ్రి అర్థము చేయిస్తున్నారు - చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా అటువంటివారు వస్తే, వెంటనే వారిని బయటకు పంపించివేయాలి. అమృతము తాగేందుకు వచ్చి బయటకు వెళ్ళిన తర్వాత అసురులై అపవిత్ర పనులు చేశారని చూపిస్తారు కదా. అటువంటివారు ఈ జ్ఞానమును ఇతరులకు వినిపించలేరు. వారి బుద్ధికి తాళము వేయబడుతుంది. తండ్రి అంటున్నారు - మీ సేవలోనే తత్పరులై ఉండాలి. తండ్రి స్మృతిలో ఉంటూ ఉంటూ చివర్లో ఇంటికి వెళ్ళిపోవాలి. "ఓ రాత్రి ప్రయాణీకుడా! అలసిపోవద్దు" అని పాట కూడా ఉంది కదా. ఆత్మ ఇంటికి వెళ్ళాలి. ప్రయాణము చేసేది ఆత్మనే. ఆత్మకు ఇప్పుడు నీవు శాంతిధామానికి వెళ్లే ప్రయాణికుడివి అని రోజూ అర్థము చేయించబడుతుంది. కావున ఇప్పుడు తండ్రిని, ఇంటిని, ఆస్తిని స్మృతి చేస్తూ ఉండండి. మాయ ఎక్కడా మోసం చేయట్లేదు కదా, నా తండ్రిని నేను స్మృతి చేస్తూ ఉన్నానా అని స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి.

అత్యంత శ్రేష్ఠమైన తండ్రి వైపే దృష్టి ఉండాలి - ఇది చాలా ఉన్నతమైన పురుషార్థము. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, చెడు దృష్టిని వదిలేయండి. దేహాభిమానమంటే చెడు దృష్టి, దేహీ-అభిమానమంటే శుద్ధమైన దృష్టి. కావున పిల్లల దృష్టి తండ్రి వైపే ఉండాలి. వారసత్వము చాలా ఉన్నతమైనది - విశ్వానికి చక్రవర్తి, ఇదేమైనా చిన్న విషయమా? చదువు ద్వారా, యోగము ద్వారా విశ్వచక్రవర్తి పదవి లభిస్తుందని ఎవ్వరికీ స్వప్నంలో కూడా ఉండదు. చదువుకొని ఉన్నత పదవి పొందితే తండ్రి కూడా సంతోషిస్తారు, టీచరు కూడా సంతోషిస్తారు, సద్గురువు కూడా సంతోషిస్తారు. స్మృతి చేస్తూ ఉంటే తండ్రి కూడా సహాయము చేస్తూ ఉంటారు. తండ్రి అంటున్నారు - పిల్లలూ, తమ లోపాలను తొలగించివేయండి. లేదంటే అనవసరంగా అపకీర్తి తీసుకొస్తారు. తండ్రి అయితే విశ్వానికి యజమానులుగా చేస్తారు, భాగ్యాన్ని తెరుస్తారు. భారతవాసులే 100 శాతము సౌభాగ్యశాలురుగా ఉండేవారు, వారే మళ్లీ ఇప్పుడు 100 శాతము దుర్భాగ్యశాలురుగా అయ్యారు, మిమ్ములను మళ్లీ సౌభాగ్యశాలురుగా చేసేందుకు చదివించడం జరుగుతుంది.

బాబా అర్థము చెయించారు - ధర్మములలోని గొప్ప-గొప్పవారు ఎవరైతే ఉన్నారో, వారు కూడా మీ వద్దకు వస్తారు. యోగము నేర్చుకొని వెళ్తారు. మ్యూజియం చూసేందుకు వచ్చే టూరిస్టులకు కూడా ఇప్పుడు స్వర్గ ద్వారములు తెరవబడుతున్నాయి అని అర్థము చేయించవచ్చు. వృక్షము చిత్రము చూపించి అర్థము చేయించండి, మీరు ఫలానా సమయానికి వస్తారు, భారతవాసుల పాత్ర ఫలానా సమయములో ఉంటుంది అని. మీరు వింటున్న ఈ జ్ఞానాన్ని తిరిగి మీ దేశానికి వెళ్ళి చెప్పండి - తండ్రిని స్మృతి చేస్తే తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు అని. వారు యోగము చేయాలని ఇష్టపడుతూ ఉంటారు. హఠయోగులు, సన్యాసులు వారికి యోగము నేర్పించలేరు. మీ సంస్థ కూడా విదేశాలకు వెళ్తుంది. అర్థము చేయించేందుకు చాలా మంచి యుక్తి కావాలి. వివిధ ధర్మాలలోని గొప్ప-గొప్పవారు కూడా రావల్సిందే. మీలో ఏ ఒక్కరైనా ఈ జ్ఞానాన్ని మంచిరీతిగా తీసుకెళ్తే ఒక్కరి ద్వారా అనేకమంది అర్థము చేసుకుంటారు. ఒక్కరి బుద్ధిలో కూర్చున్నదంటే, ఆ తర్వాత వార్తాపత్రికలు మొదలైనవాటిలో కూడా ప్రచురిస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయింపబడి ఉంది. లేకపోతే తండ్రిని స్మృతి చేయడం ఎలా నేర్చుకుంటారు? తండ్రి పరిచయమైతే అందరికీ లభించాలి. ఎవరో ఒకరు చెప్పేవారు వెలువడ్తారు. అతి పురాతన వస్తువులను చూసేందుకు మ్యూజియంకు వెళ్తారు. ఇక్కడ మీ పురాతన జ్ఞానాన్ని వినేందుకు అనేకమంది వస్తారు. వారిలో కొంతమంది బాగా అర్థము చేసుకుంటారు. ఇక్కడ నుండే దృష్టి లభిస్తుంది లేక మీ సంస్థ అక్కడకు వెళ్తుంది. తండ్రిని స్మృతి చేస్తే మీ ధర్మంలో ఉన్నత పదవిని పొందుతారని వారికి మీరు చెప్తారు. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ అందరూ క్రిందికి వచ్చేశారు. క్రిందికి దిగడమంటే తమోప్రధానంగా అవ్వడం. తండ్రిని స్మృతి చేయమని పోపు మొదలైనవారు చెప్పలేరు. వారికి తండ్రి గురించే తెలియదు. మీ వద్ద చాలా మంచి జ్ఞానముంది. సుందరమైన చిత్రాలు కూడా తయారవుతూ ఉంటాయి. సుందరమైన వస్తువు ఉంటే, మ్యూజియం ఇంకా చాలా సుందరంగా ఉంటుంది. చూసేందుకు చాలా మంది వస్తారు. ఎంత పెద్ద చిత్రాలైతే అంత బాగా అర్థం చేయించవచ్చు. ఈ విధంగా అర్థం చేయించాలనే అభిరుచి ఉండాలి. బ్రాహ్మణులుగా అయినందుకు ఎంత సేవ చేస్తే అంత గౌరవముంటుందని సదా మీ బుద్ధిలో ఉండాలి. ఇక్కడా గౌరవముంటుంది, అక్కడ కూడా గౌరవముంటుంది. మీరు పూజ్యులుగా అవుతారు. ఈ ఈశ్వరీయ జ్ఞానమును ధారణ చేయాలి. సేవ చేసేందుకు పరుగు తీస్తూ ఉండాలని తండ్రి చెప్తారు. సేవ చేసేందుకు తండ్రి ఎక్కడకు పంపినా అందులో కళ్యాణముంటుంది. రోజంతా సేవ చేసేందుకు ఆలోచనలు నడుస్తూ ఉండాలి. విదేశీయులకు కూడా తండ్రి పరిచయమునివ్వాలి. అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేయండి, ఏ దేహధారినీ గురువుగా చేసుకోకండి. సర్వుల సద్గతిదాత ఆ ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు హోల్ సేల్ మృత్యువు మీ ముందే నిలబడి ఉంది, హోల్ సేల్ మరియు రీటేల్ వ్యాపారాలు ఉంటాయి కదా. తండ్రి హోల్సేల్ వ్యాపారి, వారసత్వము కూడా హోల్ సేల్ గానే ఇస్తారు. 21 జన్మలకు విశ్వమంతటికీ రాజ్యమును తీసుకోండి. త్రిమూర్తి, సృష్టి చక్రము, కల్ప వృక్షము, మెట్ల చిత్రము, విరాట రూప చిత్రము మరియు గీతా భగవంతుడు ఎవరు? - ఈ చిత్రాలన్నీ చాలా ముఖ్యమైనవి. ఇవి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉన్నాయి, ఇందులో తండ్రి మహిమ పూర్తిగా ఉంది. కృష్ణుడిని ఆ విధంగా తయారుచేసింది కూడా ఆ తండ్రియే. ఈ వారసత్వాన్ని గాడ్ ఫాదర్ ఇచ్చారు. కలియుగములో అనేకమంది మనుష్యులున్నారు, సత్యయుగములో కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఈ మార్పులన్నీ ఎవరు చేశారు, ఎవ్వరికీ కొద్దిగా కూడా తెలియదు. టూరిస్టులు సామాన్యంగా పెద్ద పెద్ద నగరాలకు వెళ్తూ ఉంటారు. వారు కూడా వచ్చి తండ్రి పరిచయాన్ని తెలుసుకుంటారు. సేవ చేసేందుకు చాలా పాయింట్లు లభిస్తూ ఉంటాయి. విదేశాలకు కూడా వెళ్లాలి. ఒకవైపు మీరు తండ్రి పరిచయమునిస్తూ ఉంటారు, మరోవైపు మారణహోమము జరుగుతూ ఉంటుంది. సత్యయుగములో చాలా కొద్దిమంది మనుష్యులు మాత్రమే ఉంటారు, కావున మిగిలిన వారందరూ వినాశనమవుతారు కదా. ప్రపంచ చరిత్ర-భూగోళము రిపీట్ అవుతుంది. జరిగిపోయినదంతా మళ్లీ పునరావృతమవుతుంది. కానీ ఇదంతా అర్థము చేయించేందుకు కూడా తెలివి కావాలి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సదా ఒక్క తండ్రి వైపే దృష్టినుంచాలి. దేహీ-అభిమానులుగా అయ్యే పురుషార్థము చేసి మాయ మోసాల నుండి రక్షించుకోవాలి. ఎప్పుడూ చెడు దృష్టి ద్వారా మీ కులముకు అపకీర్తి తీసుకురాకూడదు.

2. సేవ చేసేందుకు పరిగెడుతూ ఉండాలి. సేవాధారులుగా, ఆజ్ఞాకారులుగా అవ్వాలి. స్వయము మరియు ఇతురుల కళ్యాణమును చేస్తూ ఉండాలి. ఎటువంటి చెడు నడవడిక నడవకూడదు.

వరదానము:-

ఐక్యత మరియు సంతుష్టతల సర్టిఫికెట్ ద్వారా సేవలలో సదా సఫలతా మూర్త్ భవ

సేవలలో సఫలతా మూర్తులుగా అయ్యేందుకు రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి - సంస్కారాలను కలుపుకునే యూనిటి(ఐక్యత) మరియు రెండవది సదా స్వయం కూడా సంతుష్టంగా ఉండండి, ఇతరులను కూడా సంతుష్టపరచండి. సదా ఒకరికొకరు స్నేహ భావనతో, శ్రేష్ఠమైన భావనతో సంపర్కములోకి వస్తే ఈ రెండు సర్టిఫికెట్లు లభిస్తాయి. తర్వాత మీ ప్రాక్టికల్ జీవితము తండ్రి ముఖానికి దర్పణంగా అవుతుంది, ఆ దర్పణంలో తండ్రి ఎవరో ఎలా ఉన్నారో అలా కనిపిస్తారు.

స్లోగన్:-

ఆత్మిక స్థితిలో స్థితియై అనేక ఆత్మలకు ప్రాణదానమిస్తే ఆశీర్వాదాలు లభిస్తాయి.