ఓంశాంతి. మొట్టమొదట తండ్రి పిల్లలకు - ఆత్మాభిమాని భవ! అని చెప్తున్నారు. మిమ్ములను మీరు ఆత్మగా భావించండి. భగవద్గీత మొదలైన వాటిలో ఏమున్నా అవన్నీ భక్తిమార్గములోని శాస్త్రాలు. తండ్రి చెప్తున్నారు - నేను జ్ఞానసాగరుడను. పిల్లలైన మీకు జ్ఞానాన్ని వినిపిస్తాను. తండ్రి ఏ జ్ఞానాన్ని వినిపిస్తారు? సృష్టి అనగా డ్రామా ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. ఇది చదువు. చరిత్ర-భూగోళాలున్నాయి కదా. భక్తిమార్గములో ఎవ్వరూ చరిత్ర-భూగోళాన్ని చదవరు. వాటి పేరే ఉండదు. సాధు-సన్యాసులు మొదలైనవారు కూర్చొని శాస్త్రాలు చదువుతారు. ఈ తండ్రి ఏ శాస్త్రాలనూ చదివి వినిపించరు. మిమ్ములను ఈ చదువు ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా చేస్తారు. మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకే మీరు వస్తారు. వారు కూడా మనుష్యులే, వీరు కూడా మనుష్యులే. కానీ వీరు 'ఓ పతితపావనా! రండి' అని తండ్రిని పిలుస్తారు. దేవతలు పావనులని మీకు తెలుసు. మిగిలినవారంతా అపవిత్ర మనుష్యులు, వారు దేవతలకు నమస్కరిస్తారు. వారిని పావనులని, స్వయాన్ని పతితమని భావిస్తారు. కానీ దేవతలు పావనంగా ఎలా అయ్యారో, వారిని అలా ఎవరు చేశారో మనుష్యమాత్రులెవ్వరికీ తెలియదు. కనుక తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇందులోనే శ్రమ ఉంది. దేహాభిమానము ఉండకూడదు. ఆత్మ అవినాశి. సంస్కారాలు కూడా ఆత్మలోనే ఉంటాయి. ఆత్మనే మంచి లేక చెడు సంస్కారాలు తీసుకెళ్తుంది. అందుకే ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - "దేహీ-అభిమానులుగా అవ్వండి”. తమ ఆత్మ గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. రావణరాజ్యము ప్రారంభమైనప్పుడు అంధకార మార్గము ఆరంభమవుతుంది. దేహాభిమానులుగా అవుతారు.
పిల్లలైన మీరు ఎవరి దగ్గరకు వచ్చారో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఇతని వద్దకు కాదు. నేను ఇతని శరీరములో ప్రవేశించాను. ఇది ఇతని అనేక జన్మల అంతిమ పతిత జన్మ. అనేక జన్మలంటే ఏవి? అర్ధకల్పము పవిత్ర జన్మలు. అర్ధకల్పము పతిత జన్మలు అని కూడా తెలిపారు. కావున ఇతను కూడా పతితమైపోయారు. ఈ బ్రహ్మా, స్వయాన్ని ఈశ్వరుడు లేక దేవత అని చెప్పరు. మనుష్యులు ప్రజాపిత బ్రహ్మాను దేవత అని భావిస్తారు. అందుకే బ్రహ్మా దేవతాయ నమః అని అంటారు. తండ్రి చెప్తారు - పతితంగా ఉన్న బ్రహ్మా అనేక జన్మల అంత్యములో మళ్ళీ పావనమై దేవతగా అవుతారు. మీరు బి.కెలు, మీరు కూడా బ్రాహ్మణులే. ఈ బ్రహ్మా కూడా బ్రాహ్మణుడే. వీరిని దేవత అని ఎవరంటారు? బ్రహ్మాను బ్రాహ్మణుడని అంటారు, దేవత అని అనరు. బ్రహ్మా పవిత్రమైనా వారిని దేవత అని అనరు. విష్ణువు (లక్ష్మీ-నారాయణ)గా అవ్వనంత వరకు దేవత అని అనరు. మీరు బ్రాహ్మణ-బ్రాహ్మణీలు. మిమ్ములను మొట్టమొదట శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, బ్రాహ్మణుల నుండి దేవతలుగా చేస్తాను. ఇది మీ అమూల్యమైన వజ్రతుల్యమైన జన్మ అని అంటారు. భలే కర్మభోగముండనే ఉంటుంది. కనుక ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేస్తూ ఉండండి. ఈ అభ్యాసమైనప్పుడే వికర్మలు వినాశనమౌతాయి. దేహధారిగా భావిస్తే వికర్మలు వినాశనమవ్వవు. ఆత్మ, బ్రాహ్మణుడు కాదు. శరీరముతో ఉన్నప్పుడే బ్రాహ్మణులుగా, మళ్ళీ దేవతలుగా... శూద్రులు మొదలైనవారిగా అవుతారు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయడంలో శ్రమ ఉంది. దీనిని సహజ యోగమని కూడా అంటారు. అత్యంత సహజమైనదని తండ్రి చెప్తున్నారు. కొంతమందికి చాలా కష్టమని కూడా అనిపిస్తుంది. అనుక్షణం దేహాభిమాన వశులై తండ్రిని మర్చిపోతారు. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు సమయం పడుతుంది కదా. ఇప్పుడే మీరు ఏకరసులై, మీకు తండ్రి స్మృతి స్థిరంగా ఉండిపోవడం అనేది సాధ్యము కాదు. కర్మాతీత స్థితిని పొందితే తర్వాత శరీరము కూడా ఉండదు. పవిత్రాత్మ తేలికగా అయి సులభంగా శరీరాన్ని వదిలేస్తుంది. పవిత్రాత్మతో అపవిత్ర శరీరము ఉండదు. అలాగని ఈ దాదా తీరాన్ని చేరిపోయారని కాదు. వీరు కూడా - స్మృతి చేయడం చాలా కష్టమని చెప్తారు. దేహాభిమాన వశులైతే వ్యతిరేకంగా మాట్లాడడం, గొడవపడడం మొదలైనవి చేస్తారు. ఆత్మలమైన మనమంతా పరస్పరంలో సోదరులము. అప్పుడు ఆత్మకు ఏమీ జరగదు. దేహాభిమానముతోనే గొడవలు చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు దేహీ-అభిమానులుగా అవ్వాలి. ఎలాగైతే దేవతలు క్షీర ఖండముగా ఉంటారో అలానే మీరు కూడా పరస్పరము చాలా క్షీరఖండముగా ఉండాలి. ఇప్పుడు మీరు ఉప్పునీరుగా అవ్వరాదు. దేహాభిమానానికి వశమైన మనుష్యులు వ్యతిరేకంగా మాట్లాడుతూ, గొడవపడుతుంటారు. పిల్లలైన మీలో ఈ అలవాటు ఉండదు. ఇక్కడ మీరు దేవతలుగా అయ్యేందుకు దైవీ గుణాలను ధారణ చేయాలి. కర్మాతీత స్థితిని పొందాలి. ఈ శరీరము, ప్రపంచము పాతది, తమోప్రధానంగా ఉందని మీకు తెలుసు. పాత వస్తువులపై, పాత సంబంధాలపై ద్వేషం పెట్టుకోవాలి. దేహాభిమాన విషయాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే పాపాలు నాశనమవుతాయి. చాలామంది పిల్లలు స్మృతిలో ఫెయిల్ అవుతారు. జ్ఞానాన్ని అర్థం చేయించడంలో చాలా తీవ్రంగా ఉంటారు కానీ స్మృతి చేసే శ్రమ చాలా పెద్దది. ఇది చాలా పెద్ద పరీక్ష. అర్ధకల్పము భక్తి చేసిన పాత భక్తులు మాత్రమే అర్థము చేసుకోగలరు. భక్తిలో చివర వచ్చినవారు అంతగా అర్థము చేసుకోలేరు.
తండ్రి ఈ శరీరములో వచ్చి చెప్తున్నారు - నేను ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వస్తాను. డ్రామాలో నాకు పాత్ర ఉంది, కల్పములో ఒక్కసారి మాత్రమే వస్తాను. ఇది అదే సంగమయుగము. యుద్ధము కూడా ఎదురుగా నిలిచి ఉంది. ఇది 5 వేల సంవత్సరాల డ్రామా. కలియుగ ఆయువు ఇంకా 40 వేల సంవత్సరాలుంటే ఏమవుతుందో తెలియదు. భగవంతుడు వచ్చినా, మేము శాస్త్రాల మార్గాన్ని వదలమని వారు అంటారు. 40 వేల సంవత్సరాల తర్వాత ఏ భగవంతుడు వస్తారో కూడా తెలియదు. కొంతమంది కృష్ణ భగవానుడు వస్తారని భావిస్తారు. కొద్దిగా ముందుకు వెళ్ళిన తరువాత, మీ పేరు ప్రసిద్ధమైపోతుంది. కానీ ఆ అవస్థ ఉండాలి. పరస్పరములో చాలా చాలా ప్రేమగా ఉండాలి. మీరు ఈశ్వరీయ సంతానము కదా. ఈశ్వరీయ సేవాధారులని మహిమ చేయబడ్డారు. మీరు పతిత భారతదేశాన్ని పావనంగా చేసేందుకు తండ్రికి సహయోగులమని అంటారు. కల్ప-కల్పము మేము ఆత్మాభిమానులుగా అయి మీ శ్రీమతమును అనుసరించి యోగబలముతో మా వికర్మలను వినాశనము చేసుకుంటామని అంటారు. యోగబలము, సైలెన్స్ బలము. సైలెన్స్ బలానికి, సైన్సు బలానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ముందు-ముందు చాలా సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. ప్రారంభంలో ఎంతమంది పిల్లలకు సాక్షాత్కారాలు అయ్యాయి, పాత్రను అభినయించారు. కానీ నేడు వారు లేనే లేరు. మాయ మింగేసింది. యోగములో ఉండకపోతే మాయ తినేస్తుంది. భగవంతుడు మిమ్మల్ని చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు కనుక నియమానుసారంగా చదవాలి. లేకుంటే చాలా చాలా తక్కువ పదవిని పొందుతారు. శిక్షలు కూడా చాలా అనుభవిస్తారు. జన్మ జన్మల పాపిని అని పాడారు కూడా. అక్కడ(సత్యయుగములో) రావణ రాజ్యమే ఉండదు. మరి వికారాల పేరు ఎలా ఉంటుంది? అది సంపూర్ణ నిర్వికార రాజ్యము. అది రామరాజ్యము, ఇది రావణరాజ్యము. ఈ సమయములో అందరూ తమోప్రధానంగా ఉన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ తమ స్థితిని పరిశీలించుకోవాలి - మేము ఎంత సమయము తండ్రి స్మృతిలో ఉండగలము? దైవీగుణాలను ఎంతవరకు ధారణ చేశాము? ముఖ్యమైన విషయం స్వయం లోపల చూసుకోవాలి, నాలో ఏ అవగుణము లేదు కదా? మా ఆహార-పానీయాలు ఎలా ఉన్నాయి? రోజంతటిలో వ్యర్థ విషయాలు లేక అబద్ధాలు మాట్లాడడం లేదు కదా? శరీర నిర్వహణ కొరకు అసత్యము మొదలైనవి చెప్పవలసి వస్తుంది కదా. పాపము తగ్గేందుకు దానము కొరకు కొంత భాగము తీస్తారు కదా. మంచి కర్మలు చేస్తే దాని ఫలితము కూడా లభిస్తుంది. ఎవరైనా ఆసుపత్రి కట్టిస్తే వచ్చే జన్మలో వారికి మంచి ఆరోగ్యము లభిస్తుంది. కళాశాల కట్టిస్తే బాగా చదువుకుంటారు. కానీ పాపానికి ప్రాయశ్చిత్తము చేసుకున్నారా? దాని కొరకు గంగా స్నానము చేసేందుకు వెళ్తారు. ధనము దానము చేస్తే తర్వాత జన్మలో దాని ఫలితము లభిస్తుంది. అందులో పాపము తొలగిపోయే విషయం ఉండదు. అది ధనం ఇచ్చి పుచ్చుకోవడం. ఈశ్వరార్థంగా ఇస్తారు. ఈశ్వరుడు అల్పకాలానికి ఇచ్చేస్తారు. ఇక్కడ మీరు పావనంగా అవ్వాలి. అందుకు తండ్రి స్మృతి తప్ప వేరే ఉపాయము లేదు. పావనులు, పతిత ప్రపంచములో ఎలా ఉంటారు. వారు పరోక్షంగా, ఈశ్వరార్థము చేస్తారు. ఇప్పుడు ఈశ్వరుడు చెప్తున్నారు - నేను సన్ముఖములో మిమ్ములను పావనంగా చేసేందుకు వచ్చాను. నేను దాతను. నాకు మీరిస్తే మీకు ఫలితము నేను ఇస్తాను. ఆ ధనాన్ని నేనేమైనా నా దగ్గర ఉంచుకుంటానా. పిల్లలైన మీ కొరకే భవనాలు మొదలైనవి నిర్మించారు. సన్యాసులు తమ కొరకు పెద్ద-పెద్ద మహళ్ళు మొదలైనవి నిర్మించుకుంటారు. ఇక్కడ శివబాబా తమ కొరకు ఏమీ తయారుచేసుకోరు. 21 జన్మలకు నూతన ప్రపంచములో దీని ప్రతిఫలము లభిస్తుందని అంటారు ఎందుకంటే మీరు సన్ముఖములో ఇచ్చి తీసుకుంటున్నారు. మీరిచ్చే ధనమంతా మీ కొరకే ఉపయోగించబడుతుంది. భక్తిమార్గములో కూడా నేను దాతనే, ఇప్పుడు కూడా నేను దాతనే. అది పరోక్షము, ఇది ప్రత్యక్షము. మీ వద్ద ఏముంటే దానితో సేవాకేంద్రము తెరవండని బాబా చెప్తారు. ఇతరుల కళ్యాణము చేయండి. నేను కూడా సెంటరు తెరుస్తాను కదా. పిల్లలిచ్చిన దానితో పిల్లలకే సహాయము చేస్తాను. నేనేమైనా ధనం నాతోపాటు తీసుకువస్తానా. నేను వచ్చి వీరిలో ప్రవేశించి వీరి ద్వారా కర్తవ్యము చేయిస్తాను. నేను స్వర్గములోకి రాను. ఇదంతా మీ కోసమే. నేను అభోక్తను. ఏమీ తీసుకోను, పాదాలపై పడమని కూడా చెప్పను. నేను పిల్లలైన మీకు అత్యంత విధేయుడైన సేవకుడను. వారే తల్లి-తండ్రి,... సర్వస్వమని కూడా పిల్లలకు తెలుసు. వారు నిరాకారుడు. ఏ గురువును కూడా త్వమేవ మాతాశ్చ పిత,... అని అనరు. గురువును గురువు అని, టీచరును టీచర్ అని అంటారు. ఇతడిని తల్లి-తండ్రి అని అంటారు. కల్ప-కల్పము ఒక్కసారి మాత్రమే వస్తానని తండ్రి చెప్తున్నారు. మీరే 12 నెలల తర్వాత జయంతిని జరుపుకుంటారు. కానీ శివబాబా ఎప్పుడు వచ్చారో, ఏం చేశారో ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మా, విష్ణు, శంకరుల కర్తవ్యము గురించి కూడా తెలియదు. ఎందుకంటే పైన శివుని చిత్రమును తొలగించేశారు. లేకుంటే శివబాబా కరన్ కరావనహార్ (చేసి చేయించేవారు). బ్రహ్మా ద్వారా చేయిస్తారు. వారు ఎలా ప్రవేశించి చేసి చూపిస్తారో పిల్లలైన మీకు తెలుసు. మీరు కూడా అలాగే చేయండని చెప్తారు. ఒకటేమో బాగా చదువుకోండి, తండ్రిని స్మృతి చేయండి. దైవీగుణాలను ధారణ చేయండి. వీరి ఆత్మ కూడా నేను బాబాను స్మృతి చేస్తానని చెప్తుంది. బాబా తోడుగా ఉన్నట్లే ఉంటుంది. మనము నూతన ప్రపంచానికి యజమానులుగా అవుతామని మీ బుద్ధిలో ఉంది. కావున నడవడిక, ఆహార-పానీయాలన్నీ మారాలి. వికారాలను వదిలేయాలి. తప్పకుండా పరవర్తన అవ్వాలి. ఎంతెంతగా పరివర్తన అవుతూ ఉంటారో, తర్వాత శరీరాన్ని వదిలితే శ్రేష్ఠ కులములో జన్మిస్తారు. కులాలు కూడా నెంబరువారుగా ఉంటాయి. ఇక్కడ కూడా కొన్ని చాలా మంచి-మంచి కులాలు ఉంటాయి. 4-5 అన్నదమ్ములు కలిసి ఉంటున్నా ఎటువంటి కొట్లాటలుండవు. మృత్యువు లేనటువంటి అమరలోకానికి వెళ్తామని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. భయపడే మాటే లేదు. ఇక్కడ రోజు రోజుకు భయము పెరుగుతూ ఉంటుంది. బయటకు కూడా రాలేరు. ఈ చదువు కోటిలో కొంతమంది మాత్రమే చదువుకుంటారని మీకు తెలుసు. కొందరు బాగా అర్థము చేసుకుంటారు, చాలా బాగుందని కూడా వ్రాస్తారు. అటువంటి పిల్లలు కూడా తప్పకుండా వస్తారు. రాజధాని స్థాపన అవుతుంది కదా, ఇక కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది.
స్మృతియాత్రలో తీవ్రమైన వేగముతో పరుగులు తీసే పురుషార్థి పిల్లలను చూసి తండ్రి చాలా మహిమ చేస్తారు. ముఖ్యమైనది స్మృతి. దీని ద్వారానే పాత లెక్కాచారాలన్నీ సమాప్తమైపోతాయి. కొంతమంది పిల్లలు - బాబా! మేము ప్రతిరోజు ఇన్ని గంటలు స్మృతి చేస్తామని వ్రాస్తారు. వీరు చాలా గొప్ప పురుషార్థులని బాబా కూడా అనుకుంటారు. పురుషార్థమైతే చేయాలి. కనుకనే తండ్రి చెప్తున్నారు - పరస్పరములో ఎప్పుడూ కొట్లాడుకోకూడదు. ఇది జంతువులు చేసే పని. కొట్లాడుకోవడం అంటే దేహాభిమానము. తండ్రి పేరును అప్రతిష్ఠపాలు చేస్తారు. తండ్రిని గురించే, సద్గురువుకు నింద తీసుకొచ్చేవారు ఉన్నత స్థానము పొందలేరని చెప్తారు. కాని సాధువులు ఈ మాటను తమ కొరకు చెప్పుకున్నారు. కనుక వారు ఎక్కడ శపిస్తారో అని మాతలు భయపడుతూ ఉంటారు. మనము మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. సత్యాతి-సత్యమైన అమరకథను వింటున్నారు. శ్రీ లక్ష్మీనారాయణుల పదవి పొందేందుకు ఈ పాఠశాలకు వస్తున్నామని మీరు చెప్తారు. ఇలా ఇంకెక్కడా చెప్పరు. ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్తారు. ఇందులో స్మృతి చేసే పురుషార్థమే ముఖ్యమైనది. అర్ధకల్పము స్మృతియే చేయలేదు. ఇప్పుడు ఈ ఒక్క జన్మలోనే స్మృతి చేయాలి. ఇదే శ్రమ. స్మృతి చేయాలి, దైవీ గుణాలను ధారణ చేయాలి. ఏదైనా పాపకర్మ చేస్తే 100 రెట్లు శిక్ష పడ్తుంది. పురుషార్థము చేయాలి. తమ ఉన్నతి చేసుకోవాలి. ఆత్మనే శరీరము ద్వారా చదువుకొని బ్యారిస్టరు లేక సర్జన్ మొదలైనవారిగా అవుతుంది కదా. ఈ లక్ష్మీనారాయణుల పదవి చాలా ఉన్నతమైనది కదా. ముందు-ముందు మీకు అనేక సాక్షాత్కారాలు అవుతాయి. మీరు సర్వోత్తమ బ్రాహ్మణ కులభూషణులు, స్వదర్శన చక్రధారులు. కల్పక్రితము కూడా మీకు ఈ జ్ఞానము వినిపించాను. ఇప్పుడు మళ్ళీ వినిపిస్తున్నాను. మీరు విని పదవిని పొందుతారు. తర్వాత ఈ జ్ఞానము ప్రాయఃలోపమైపోతుంది. ఇక ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మీలో మీరు పరిశీలించుకోవాలి - నేను తండ్రి స్మృతిలో ఎంత సమయము ఉంటున్నాను? దైవీ గుణాలు ఎంతవరకు ధారణ చేశాను? నాలో ఏ అవగుణము లేదు కదా? నా ఆహార-పానీయాలు, నడవడిక రాయల్ గా ఉన్నాయా? వ్యర్థ మాటలు మాట్లాడటం లేదు కదా? అబద్ధాలు చెప్పడం లేదు కదా?
2. స్మృతి చార్టును పెంచుకునేందుకు అభ్యాసము చేయాలి - ఆత్మలమైన మనమంతా సోదరులము. దేహాభిమానము నుండి దూరముగా ఉండాలి. మీ ఏకరస స్థితిని తయారు చేసుకునేందుకు సమయాన్ని కేటాయించాలి.