ఓంశాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలు పాటలోని ఒక చరణము విన్నారు. ఈ పాట భక్తి మార్గానికి చెందినది. అది జ్ఞానములోకి మార్చడం జరిగింది. ఇతరులెవ్వరూ అలా చేయలేరు. మీలో కూడా దీపమంటే ఏమిటో, తుఫాను అంటే ఏమిటో నంబరువార్ పురుషార్థానుసారము తెలుసుకున్నారు. ఇప్పుడు ఆత్మ జ్యోతి ఆరిపోయిందని పిల్లలైన మీకు తెలుసు. ఆ జ్యోతిని వెలిగించేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. ఎవరైనా మరణించినప్పుడు కూడా దీపము వెలిగిస్తారు. అది ఆరిపోకుండా చాలా జాగ్రత్త వహిస్తారు. దీపము ఆరిపోతే ఆత్మ అంధకారము ద్వారా వెళ్ళవలసి వస్తుందని భావిస్తారు. అందుకే దీపము ఆరిపోకుండా వెలిగించి ఉంచుతారు. సత్యయుగంలో ఇటువంటి విషయాలు ఉండవు. అక్కడ అందరూ ప్రకాశములోనే ఉంటారు. ఆకలి మొదలైన విషయాలే ఉండవు. అక్కడ చాలా సంపద మొదలైనవన్నీ లభిస్తాయి. ఇక్కడ గాఢాంధకారము అలుముకొని ఉంది. ఇది ఛీ-ఛీ ప్రపంచము కదా. అందరి ఆత్మ జ్యోతులు ఆరిపోయి ఉన్నాయి. అందరికంటే ఎక్కువగా మీ జ్యోతులే ఆరిపోయాయి. ముఖ్యంగా మీ కొరకే తండ్రి వస్తారు. మీ జ్యోతులు ఆరిపోయి ఉన్నాయి. ఇప్పుడు వాటికి కరెంటు ఎక్కడ నుండి లభిస్తుంది? కరెంటు తండ్రి నుండే లభిస్తుందని పిల్లలకు తెలుసు. కరెంటు తీవ్రంగా ఉంటే బల్బులో ప్రకాశము ఎక్కువగా ఉంటుంది. అందువలన ఇప్పుడు మీరు పెద్ద మెషిన్ (యంత్రం) నుండి కరెంటు తీసుకుంటున్నారు. బొంబాయి వంటి పట్టణాలలో చాలామంది మనుష్యులుంటారు. అక్కడ కరెంటు ఎక్కువగా కావాల్సి ఉంటుంది. కనుక దానికి తగినంత పెద్ద మెషిన్ తప్పకుండా ఉంటుంది. ఇది అనంతమైన విషయము. ప్రపంచములోని ఆత్మలందరి జ్యోతి ఆరిపోయి ఉంది. వాటికి కరెంటు ఇవ్వాలి. ముఖ్యమైన విషయము - బుద్ధియోగము తండ్రితో జోడించండి, దేహీ అభిమానులుగా అవ్వండి అని ఆ తండ్రే అర్థం చేయిస్తున్నారు. ప్రపంచములోని పతిత మనుష్యులను పావనంగా చేసేందుకు సుప్రీమ్ తండ్రి వచ్చారు. వారు ఎంత గొప్ప తండ్రి. అందరి జ్యోతులను వెలిగించేందుకు వచ్చారు. ప్రపంచములోని మానవమాత్రుల జ్యోతులన్నింటినీ వెలిగిస్తారు. అసలు తండ్రి ఎవరు? జ్యోతులను ఎలా వెలిగిస్తారు? ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. వారిని జ్యోతి స్వరూపమని కూడా అంటారు. మళ్లీ సర్వవ్యాపి అని కూడా అంటారు. జ్యోతి ఆరిపోయినందుకు జ్యోతి స్వరూపాన్ని పిలుస్తారు. అఖండ జ్యోతి సాక్షాత్కారము కూడా అవుతుంది. అర్జునుడు ఈ తేజమును సహించలేనని కరెంటు చాలా ఎక్కువగా ఉందని చెప్పినట్లు చూపిస్తారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరంతా ఆత్మలని అందరికీ అర్థం చేయించాలి. ఆత్మలు పై నుండి ఇక్కడకు వస్తాయి. ఆత్మ మొదట పవిత్రముగా ఉండేది. అందులో కరెంటు ఉండేది. సతోప్రధానముగా ఉండేది. బంగారు యుగములో ఆత్మలు పవిత్రంగా ఉంటాయి. ఆ తర్వాత అవి అపవిత్రంగా కూడా అవ్వాల్సి ఉంటుంది. అపవిత్రమైనప్పుడు మీరు వచ్చి దుఃఖము నుండి ముక్తులుగా చేయమని గాడ్ ఫాదర్ ను పిలుస్తారు. ముక్తులుగా చేయడం, పవిత్రంగా చేయడం ఈ రెండింటి అర్థము వేరు వేరుగా ఉంది. తప్పకుండా ఎవరి ద్వారానో పతితంగా అవ్వడం వలన బాబా, మీరు వచ్చి ముక్తులుగా చేసి, పవిత్రంగా కూడా చేయండి అని పిలుస్తారు. ఇక్కడ నుండి శాంతిధామానికి తీసుకెళ్ళమంటారు. శాంతిని వరముగా ఇవ్వండి అని వేడుకుంటారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇక్కడ శాంతిగా ఉండలేరు. శాంతి ఉండేది శాంతిధామములో. సత్యయుగములో ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉంటాయి. అందువలన అక్కడ శాంతి ఉంటుంది. ఎలాంటి అలజడి ఉండదు. ఇక్కడ మానవులు అశాంతి వలన కలత చెంది ఉన్నారు. ఒక ఇంటిలోనే, ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు స్త్రీ - పురుషుల మధ్యన గొడవలుంటే, తల్లి, తండ్రి, పిల్లలు, సోదరీ, సోదరులు మొదలైనవారంతా కలత చెందుతారు. అశాంతిగా ఉండే మనుష్యులు ఎక్కడకు వెళ్లినా, అశాంతినే వ్యాపింపజేస్తారు. ఎందుకంటే అది ఆసురీ స్వభావము కదా. సత్యయుగము సుఖధామమని ఇప్పుడు మీకు తెలుసు. అక్కడ సుఖ-శాంతులు రెండూ ఉంటాయి. పరంధామములో అయితే కేవలం శాంతి మాత్రమే ఉంటుంది. దానిని స్వీట్ సైలెన్స్ హోమ్ అని అంటారు. ముక్తిధామము కావలసిన వారికి కేవలం ఇది మాత్రమే అర్థం చేయించండి - మీకు ముక్తి కావాలంటే తండ్రిని స్మృతి చేయండి.
ముక్తి తర్వాత తప్పకుండా జీవన్ముక్తి ఉంటుంది. మొదట జీవన్ముక్తులుగా అవుతారు, తర్వాత జీవన బంధనములోకి వస్తారు. సగము-సగము కదా. సతోప్రధానము నుండి మళ్లీ సతో, రజో, తమోలలోకి తప్పకుండా రావాలి. చివరిలో అర్ధమో-ఒక్కటో జన్మ తీసుకునేవారు సుఖ దుఃఖాలను ఏమి అనుభవం చేస్తారు? మీరు అన్నీ పూర్తిగా అనుభవం చేస్తారు. మేము ఇన్ని జన్మలలో సుఖంగా ఉంటామని, ఇన్ని జన్మలు దుఃఖములో ఉంటామని మీకు తెలుసు. ఫలానా ఫలానా ధర్మాలవారు నూతన ప్రపంచములోకి రాలేరు. వారి పాత్రనే సత్యయుగము తర్వాత ఉంటుంది. కొత్త ఖండాలు ఏర్పడ్డాయి. వారికి అది నూతన ప్రపంచము వలె ఉంటుంది. ఉదాహరణకు బౌద్ధ ఖండము, క్రైస్తవ ఖండము కొత్తవి కదా. వారు కూడా సతో, రజో, తమోల ద్వారా వెళ్లే తీరాలి. వృక్షములో కూడా ఇలాగే ఉంటుంది కదా. నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటుంది. మొదట వచ్చినవారు క్రిందనే ఉంటారు. కొత్త కొత్త ఆకులు ఎలా వస్తాయో చూసారు కదా. కొత్త కొత్త ఆకుపచ్చని లేత ఆకులు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత పుష్పాలు వస్తాయి. నూతన వృక్షము చాలా చిన్నది. కొత్తగా బీజము నాటినప్పుడు దానిని పూర్తిగా సంరక్షించి పోషించాలి. లేకుంటే పాడైపోతుంది. మీరు కూడా పూర్తిగా పాలన ఇవ్వకుంటే వాడిపోతారు. తండ్రి వచ్చి మనుష్యుల నుండి దేవతలుగా చేస్తున్నారు. తర్వాత అందులో నంబరు వారుగా తయారవుతారు. రాజధాని స్థాపనవుతుంది కదా. చాలామంది ఫెయిల్ అవుతారు.
పిల్లల స్థితి ఎలా ఉంటుందో, తండ్రి నుండి అలాంటి ప్రేమ లభిస్తుంది. చాలా మంది పిల్లలకు బాహ్య రూపములో కూడా ప్రేమ చూపించవలసి వస్తుంది. కొందరు బాబా మేము ఫెయిలైపోయాము, పతితులైపోయామని వ్రాస్తారు. ఇప్పుడు వారినెవరు ముట్టుకుంటారు? వారు తండ్రి హృదయాన్ని అధిరోహించలేరు. బాబా పవిత్రులకు మాత్రమే వారసత్వమునివ్వగలరు. మొదట ఒక్కొక్కరినీ పూర్తి సమాచారము అడిగి లెక్కను తీసుకుంటారు. స్థితి ఎలా ఉంటుందో అటువంటి ప్రేమ లభిస్తుంది. బాహ్యముగా భలే ప్రేమిస్తారు కానీ లోలోపల వీరు పూర్తిగా బుద్ధిహీనులు, సేవ చేయలేరు అని తెలుసు. ఆలోచనంటూ కలుగుతుంది కదా. అజ్ఞానములో కూడా బాగా సంపాదించే పుత్రుడైతే తండ్రి కూడా చాలా ప్రేమతో కలుస్తారు. బాగా సంపాదించలేని వారైతే, తండ్రికి కూడా వారిపై అంత ప్రేమ ఉండదు. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. పిల్లలు బయట కూడా సేవ చేస్తారు కదా. ఏ ధర్మానికి చెందినవారైనా వారికి అర్థము చేయించాలి. తండ్రిని ముక్తిదాత అని అంటారు కదా. ముక్తిదాత మరియు మార్గదర్శకుడు ఎవరో వారికి పరిచయమివ్వాలి. సుప్రీమ్ గాడ్ ఫాదర్ అందరినీ విముక్తులుగా చేసేందుకు వస్తారని తెలపాలి. తండ్రి చెప్తున్నారు - మీరు ఎంతో పతితమైపోయారు. పవిత్రత లేనే లేదు. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. తండ్రి అయితే సదా పవిత్రులు. మిగిలినవారంతా పవిత్రుల నుండి తప్పకుండా అపవిత్రులుగా అవుతారు. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ క్రిందకు దిగుతూ వస్తారు. ఈ సమయంలో అందరూ పతితులే. అందువలన తండ్రి సలహా ఇస్తున్నారు - పిల్లలూ, నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారు. ఇప్పుడు మృత్యువు మీ ఎదురుగా నిలబడి ఉంది. ఇప్పుడు పాత ప్రపంచము సమాప్తమవుతుంది. మాయ ఆడంబరము చాలా ఎక్కువగా ఉంది. అందుకే మనుష్యులు ఇదే స్వర్గమని భావిస్తున్నారు. విమానాలు, కరెంటు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ఇదంతా మాయ చూపే ఆడంబరము. ఇవన్నీ ఇప్పుడు సమాప్తమవుతాయి. ఆ తర్వాత స్వర్గ స్థాపన జరుగుతుంది. ఈ కరెంటు మొదలైనవన్నీ స్వర్గములో కూడా ఉంటాయి. అయితే ఇవన్నీ స్వర్గములోకి ఎలా వస్తాయి? తెలిసినవారు ఎవరో తప్పకుండా కావాలి కదా. మీ వద్దకు చాలా మంచి మంచి నైపుణ్యము గలవారు కూడా వస్తారు. వారు రాజ్యములోకి అయితే రారు కానీ మీ ప్రజలుగా వస్తారు. ఇంజనీర్లు మొదలైన మంచి-మంచి తెలివిగల, నైపుణ్యము గల పనివారు కూడా మీ వద్దకు వస్తారు. ఈ ఫ్యాషన్లన్నీ విదేశాల నుండి వస్తూ ఉంటాయి. కనుక విదేశస్థులకు కూడా మీరు శివబాబా పరిచయమునివ్వాలి. తండ్రిని స్మృతి చేయండి అని చెప్పాలి. మీరు కూడా యోగములో ఉండే పురుషార్థము చాలా చేయాలి. ఇందులోనే మాయా తుఫానులు ఎక్కువగా వస్తాయి. కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. ఇది మంచి మాటే కదా. ఏసుక్రీస్తు కూడా వారి రచనయే. రచయిత అయిన సుప్రీమ్ సోల్ (పరమాత్మ) ఒక్కరు మాత్రమే. మిగిలిన వారంతా వారి రచనే. వారసత్వము ఒక్క రచయిత ద్వారా మాత్రమే లభిస్తుంది. ఇటువంటి మంచి మంచి పాయింట్లు నోట్ చేసుకోవాలి.
తండ్రి ముఖ్య కర్తవ్యము - అందరినీ దుఃఖము నుండి ముక్తులుగా చేయడం. వారు సుఖధామము మరియు శాంతిధామము గేట్లు తెరుస్తారు. వారినే "ఓ ముక్తి దాతా! దుఃఖము నుండి ముక్తినిప్పించి, మమ్ములను శాంతిధామము, సుఖధామానికి తీసుకెళ్ళండి” అని అడుగుతారు. ఇక్కడ సుఖధామము ఉన్నప్పుడు మిగిలిన ఆత్మలు శాంతిధామములో ఉంటాయి. స్వర్గము గేటును ఆ తండ్రే తెరుస్తారు. ఒకటేమో నూతన ప్రపంచము గేటు, రెండవది శాంతిధామము గేటు. రెండు గేట్లు తెరుచుకుంటాయి. ఇప్పుడు అపవిత్రమైన ఆత్మలకు తండ్రి శ్రీమతమునిస్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేస్తే, మీ పాపాలు తొలగిపోతాయి. ఇప్పుడు ఎవరెవరు పురుషార్థము చేస్తారో, వారు తమ తమ ధర్మాలలో మళ్లీ ఉన్నత పదవిని పొందుతారు. పురుషార్థము చేయకుంటే, తక్కువ పదవిని పొందుతారు. మంచి మంచి పాయింట్లు నోట్ చేసుకుంటే, సమయానికి పనికి వస్తాయి. శివబాబా కర్తవ్యాన్ని మేము తెలుపుతామని చెప్తే గాడ్ ఫాదర్ శివుని కర్తవ్యాన్ని తెలిపే వీరెవరు అని అడుగుతారు. ఆత్మ రూపములో అందరమూ సోదరులమే అని చెప్పండి. తర్వాత ప్రజాపిత బ్రహ్మా ద్వారా రచనను రచించినప్పుడు, సోదరీ-సోదరులుగా అవుతారని చెప్పండి. లిబరేటర్, గైడ్ అని ఏ గాడ్ ఫాదర్ గురించి అంటారో వారి కర్తవ్యం గూరించి మేము మీకు తెలుపుతామని చెప్పండి. మాకు గాడ్ ఫాదర్ చెప్పారు కనుక మేము మీకు చెప్తున్నాము. తండ్రిని పిల్లలు ప్రత్యక్షము చేస్తారు అని కూడా అర్థం చేయించండి. ఆత్మ చాలా చిన్న నక్షత్రము. ఈ కనులతో చూడలేము. దివ్యదృష్టి ద్వారా సాక్షాత్కారమవుతుంది, అది ఒక బిందువు. దానిని చూసినందున ఎలాంటి లాభమూ లేదు. తండ్రి కూడా అలాంటి బిందువే. వారిని సుప్రీమ్ సోల్ అని అంటారు. ఆత్మలన్నీ ఒకే విధంగా ఉంటాయి. కానీ వారు సుప్రీమ్, జ్ఞానసాగరులు, ఆనంద సాగరులు, లిబరేటర్, గైడ్. వారిని చాలా మహిమ చేయాల్సి ఉంటుంది. తండ్రి వచ్చినప్పుడే తమతో పాటు తీసుకెళ్తారు కదా. వారు వచ్చి జ్ఞానమిస్తారు. ఆత్మ చాలా చిన్నదని నేను కూడా అంతే ఉంటానని ఆ తండ్రి అర్థం చేయించారు. ఏదో ఒక శరీరములో ప్రవేశించి జ్ఞానమిస్తారు. ఈ ఆత్మ ప్రక్కనే వచ్చి కూర్చుంటాను. నాలో శక్తి ఉంది. అవయవాలు లభిస్తే నేను యజమానిగా అవుతాను. కూర్చొని ఈ అవయవాల ద్వారా తెలియజేస్తాను. ఇతనిని ఆడమ్ అని కూడా అంటారు. ఆడమ్ మొట్టమొదటి మనిషి. మానవ వంశముంటుంది కదా. ఇతను తల్లి-తండ్రిగా కూడా అవుతారు. ఇతని ద్వారా రచన కూడా జరుగుతుంది. చాలా వృద్ధులు కానీ దత్తత తీసుకున్నాను లేకుంటే బ్రహ్మా ఎక్కడ నుండి వచ్చారు? బ్రహ్మా తండ్రి పేరు ఏదో ఎవరైనా చెప్పగలరా. బ్రహ్మా-విష్ణు-శంకరులను ఎవరో ఒకరు రచించి ఉంటారు కదా. రచయిత అయితే ఒకే ఒక్కరు. తండ్రి వీరిని దత్తత చేసుకున్నారు. చిన్న పిల్లలు కూర్చొని ఇదంతా అర్థము చేయిస్తే ఇది చాలా గొప్ప జ్ఞానమని అంటారు.
ఏ పిల్లలైతే బాగా ధారణ చేస్తారో, వారికి చాలా సంతోషముంటుంది. ఎప్పుడూ ఆవలింతలు రావు. ఎవరికైనా అర్థము కాకుంటే, ఆవలిస్తూ ఉంటారు. ఇక్కడైతే ఎప్పుడూ మీకు ఆవలింతలు రాకూడదు. సంపాదించుకునే సమయములో ఎప్పుడూ ఆవలింతలు రావు. కొనుగోలుదారులు లేకుంటే వ్యాపారము చల్లగా ఉంటే, ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా ఆవలింతలు వస్తే ధారణ జరగదు. కొంతమందికి కొంచెము కూడా అర్థము కాదు. ఎందుకంటే వారు దేహాభిమానములో ఉంటారు. దేహీ అభిమానులుగా అయి కూర్చోలేరు. ఏవో ఒక బయట విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి. పాయింట్లు మొదలైనవి కూడా నోట్ చేసుకోలేరు. చురుకైన బుద్ధిగలవారు మంచి పాయింట్లను వెంటనే నోట్ చేసుకుంటారు. విద్యార్థుల నడవడిక కూడా టీచరుకు కనిపిస్తుంది. తెలివిగల టీచరు దృష్టి అన్ని వైపులా తిరుగుతూ ఉంటుంది. అప్పుడే చదువుకు సర్టిఫికెట్ ఇవ్వగలరు. మ్యానర్స్ యొక్క సర్టిఫికెట్ కూడా ఇస్తారు. ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యారో అది కూడా తెలుపుతారు. ఇక్కడ భలే హాజరవుతారు కానీ వారికి కొంచెము కూడా అర్థము కాదు. ధారణ ఏమీ జరగదు. కొందరు మా బుద్ధి చాలా మందముగా ఉంది, ధారణ జరగదు అని అంటారు. బాబా ఏమి చేస్తారు, ఇది మీ కర్మల లెక్కాచారము. అందరికీ తండ్రి ఒకే పురుషార్థము చేయిస్తారు. మీ అదృష్టములో లేకపోతే బాబా ఏం చేస్తారు? పాఠశాలలో కూడా కొంతమంది పాస్ అవుతారు. కొంతమంది ఫెయిల్ అవుతారు. ఇది అనంతమైన చదువు. దీనిని అనంతమైన తండ్రి చదివిస్తున్నారు. ఇతర ధర్మాల వారికి గీత అనే మాట అర్థము కాదు. వారి దేశమును చూసి వారికి అర్థము చేయించవలసి వస్తుంది. మొట్టమొదట ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి పరిచయమును ఇవ్వవలసి ఉంటుంది. వారు లిబరేటర్, గైడ్ గా ఎలా అవుతారో చెప్పాలి. స్వర్గములో ఈ వికారాలు ఉండవు. ఇప్పుడు దీనిని సైతాన్ రాజ్యమని అంటారు. పాత ప్రపంచము కదా. దీనిని గోల్డెన్ ఏజ్ అని అనరు. ఒకప్పుడు నూతన ప్రపంచంగా ఉండేది. ఇప్పుడదే పాతదైపోయింది. సేవ చేయాలనే ఆసక్తి ఉన్న పిల్లలు పాయింట్లు నోట్ చేసుకోవాలి. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. చదువులో చాలా చాలా సంపాదన ఉంది కావున చాలా సంతోషంగా సంపాదించాలి. చదువుకునే సమయములో ఎప్పుడూ ఆవలింతలు మొదలైనవి రాకూడదు, బుద్ధియోగము ఇటు-అటు భ్రమించకూడదు. పాయింట్లు నోట్ చేసుకొని ధారణ చేస్తూ ఉండండి.
2. పవిత్రంగా అయి తండ్రి హృదయపూర్వక ప్రేమను పొందేందుకు అధికారులుగా అవ్వాలి. సేవలో చాలా చురుకుగా ఉండాలి. మంచి సంపాదన చేయాలి, చేయించాలి.