ఓంశాంతి. నిజానికి ఈ పాట భక్తి మార్గానికి చెందినది. పూర్తి ప్రపంచములో ఏ పాటలు పాడుతున్నారో, శాస్త్రాలు చదువుతున్నారో, తీర్థ యాత్రలు చేస్తున్నారో, అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. జ్ఞాన మార్గమని దేనినంటారో, భక్తి మార్గమని దేనినంటారో పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు మొదలైనవన్నీ భక్తి మార్గములోనివి. అర్ధకల్పము భక్తి ఉంటుంది, తర్వాత అర్ధకల్పము జ్ఞాన ప్రాలబ్ధము నడుస్తుంది. భక్తి చేస్తూ-చేస్తూ క్రిందకు దిగాల్సిందే. 84 పునర్జన్మలు తీసుకుంటూ క్రిందకు దిగుతారు. తర్వాత ఒక్క జన్మలో మీది ఎక్కేకళ అవుతుంది. దీనిని జ్ఞాన మార్గమని అంటారు. ఒక్క సెకండులోనే జీవన్ముక్తి అని జ్ఞానానికి మహిమ ఉంది. రావణ రాజ్యము ద్వాపరము నుండి నడుస్తుంది, అది సమాప్తమై మళ్ళీ రామరాజ్యము స్థాపనవుతుంది. డ్రామాలో మీ 84 జన్మలు పూర్తి అయినప్పుడు ఎక్కేకళ ద్వారా అందరికీ మేలు జరుగుతుంది. శాస్త్రాలలో ఈ పదాలు అక్కడక్కడ ఉన్నాయి. ఎక్కేకళ ద్వారా అందరికీ మేలు జరుగుతుంది. అందరికీ సద్గతినిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే కదా. సన్యాసులు మొదలైనవారు అనేక రకాల వారున్నారు. అనేక మతమతాంతరాలున్నాయి. ఇప్పుడు కల్పము ఆయువు లక్షల సంవత్సరాలని శాస్త్రాలలో వ్రాసి ఉన్నారు. 10 వేల సంవత్సరాలని శంకరాచార్యుని మతము వెలువడింది.... ఎంత వ్యత్యాసమైపోతుంది. ఇన్ని వేలని ఇంకొకరు చెప్తారు. కలియుగములో అనేక మనుష్యులు, అనేక మతాలు, అనేక ధర్మాలున్నాయి. సత్యయుగంలో ఒకే మతముంటుంది. ఈ తండ్రి కూర్చొని పిల్లలైన మీకు సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము వినిపిస్తున్నారు. ఇది వినిపించేందుకు కూడా ఎంత సమయము పడుతుంది. వినిపిస్తూనే ఉంటారు. ముందే ఇదంతా ఎందుకు వినిపించలేదని అడగలేరు. స్కూల్లో చదువు నంబరువారుగా ఉంటుంది. చిన్న పిల్లల అవయవాలు చిన్నవిగా ఉంటాయి కనుక కొద్దిగానే నేర్పిస్తారు. తర్వాత పెద్దవారుగా అవుతూ-అవుతూ ఉంటే బుద్ధికి వేయబడిన తాళము తెరచుకుంటూ ఉంటుంది. చదువు ధారణ చేస్తూ ఉంటారు. చిన్న పిల్లల బుద్ధిలో ఏదీ ధారణ జరగదు. పెద్దవారైన తర్వాత బ్యారిస్టర్లు, జడ్జి మొదలైనవారిగా అవుతారు. ఇందులో కూడా అలాగే ఉంటుంది. కొందరి బుద్ధిలో ధారణ బాగా అవుతుంది. తండ్రి చెప్తున్నారు - నేను పతితుల నుండి పావనంగా చేసేందుకు వచ్చాను. అందువలన ఈ పతిత ప్రపంచముపై వైరాగ్యము కలగాలి. ఆత్మ పావనంగా అయితే పతిత ప్రపంచములో ఉండలేదు. పతిత ప్రపంచములో ఆత్మ కూడా పతితమే, మనుష్యులు కూడా పతితంగానే ఉంటారు. పావన ప్రపంచములో మనుష్యులు కూడా పావనమే, పతిత ప్రపంచములో మనుష్యులు కూడా పతితులుగానే ఉంటారు. ఇది ఉన్నదే రావణ రాజ్యము. యథా రాజా-రాణి తథా ప్రజా. ఈ జ్ఞానమంతా బుద్ధి ద్వారా అర్థము చేసుకునేది. ఈ సమయములో అందరికీ తండ్రితో విపరీత బుద్ధి ఉంది. పిల్లలైన మీరు తండ్రిని స్మృతి చేస్తారు. మీ లోపల తండ్రి పట్ల ప్రేమ ఉంది. ఆత్మలో తండ్రి పట్ల ప్రేమ ఉంది, గౌరవముంది ఎందుకంటే తండ్రిని తెలుసుకుంది. ఇక్కడ మీరు సన్ముఖములో ఉన్నారు. శివబాబా ద్వారా వింటున్నారు. వారు మానవ సృష్టికి బీజరూపులు, జ్ఞానసాగరులు, ప్రేమసాగరులు, ఆనంద సాగరులు. గీతా జ్ఞానదాత పరమపిత త్రిమూర్తి శివ పరమాత్మ ఉవాచ. త్రిమూర్తి అనే పదము తప్పకుండా వ్రాయాలి ఎందుకంటే త్రిమూర్తి యొక్క గాయనముంది కదా. బ్రహ్మా ద్వారా స్థాపన కనుక తప్పకుండా బ్రహ్మా ద్వారానే జ్ఞానము వినిపిస్తారు. కృష్ణుడు ఎప్పుడూ కూడా శివ భగవానువాచ అని చెప్పరు. ప్రేరణ ద్వారా ఏమీ జరగదు. కృష్ణుని తనువులో శివబాబా ప్రవేశము కూడా జరగదు. శివబాబా అయితే పరాయి దేశములో వస్తారు. కృష్ణుని దేశము సత్యయుగము కదా. కనుక ఇరువురి మహిమలు వేరు వేరుగా ఉన్నాయి. ఇదే ముఖ్యమైన విషయము.
సత్యయుగములో, గీతను ఎవ్వరూ చదవరు. భక్తి మార్గములో అయితే జన్మ-జన్మాంతరాలు చదువుతూ ఉంటారు. జ్ఞానమార్గములో అలా చదవరు. భక్తిమార్గములో జ్ఞాన విషయాలు ఉండవు. ఇప్పుడు రచయిత అయిన తండ్రియే రచన యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానమునిస్తారు. మనుష్యులు రచయితలుగా అవ్వలేరు. నేను రచయితను అని మనుష్యులు చెప్పలేరు. తండ్రి స్వయంగా చెప్తున్నారు - నేను మానవ సృష్టికి బీజరూపుడను. నేను జ్ఞాన సాగరుడను, ప్రేమ సాగరుడను, సర్వుల సద్గతిదాతను. కృష్ణుని మహిమ భిన్నమైనది. ఈ విధముగా ఇరువురికి గల పూర్తి వ్యత్యాసము వ్రాయాలి. గీతా జ్ఞానదాత శ్రీకృష్ణుడు కాదు అని చదివిన వెంటనే మనుష్యులు అర్థము చేసుకోవాలి. ఈ మాటను అంగీకరిస్తే మీరు విజయులుగా అవుతారు. మనుష్యులు కృష్ణుని కొరకు ఎంతగానో తపిస్తారు! ఎలా అయితే, మేము శివుని వద్దకు చేరుకోవాలని శివుని భక్తులు ప్రాణ త్యాగానికి కూడా వెనుకాడరో అలాగే వారు కృష్ణుని వద్దకు చేరుకోవాలని అనుకుంటారు, కాని కృష్ణుని వద్దకు చేరుకోలేరు. అయితే కృష్ణుని వద్ద బలి అయ్యే మాట ఉండదు. దేవీలకు బలి అవుతారు. దేవతలపై ఎప్పుడూ, ఎవ్వరూ బలి అవ్వరు. మీరందరూ దేవీలు కదా. మీరు శివబాబా వారిగా అయ్యారు కనుక శివబాబాపై కూడా బలి అవుతారు. శాస్త్రాలలో హింసాత్మక మాటలు వ్రాసేశారు. మీరు శివబాబా పిల్లలు. తనువు, మనసు, ధనాలను బలి చేస్తారు. ఇక వేరే ఏ మాటా లేదు. అందువలన శివునికి, దేవీలకు బలి ఇస్తారు. ఇప్పుడు ప్రభుత్వము వారు శివకాశిలో (కాశిలో ఉన్న కత్తుల బావిలో) బలి ఇవ్వడం రద్దు చేశారు. ఇప్పుడు ఆ కత్తులు కూడా లేవు. భక్తిమార్గములో ఏదైతే ఆత్మహత్య చేసుకుంటారో, అది తమపై తామే శత్రుత్వము కలిగించుకునే ఒక ప్రక్రియ. తమకు తాము మిత్రులుగా అయ్యేందుకు తండ్రి ఒకే ఒక ఉపాయమును తెలుపుతున్నారు - పావనంగా అయి తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోండి. ఒక్క తండ్రి శ్రీమతానుసారముగా నడుస్తూ ఉండడమే స్నేహము. భక్తి మార్గములో జీవాత్మ తనకు తానే శత్రువుగా అవుతుంది. మళ్ళీ తండ్రి వచ్చి జ్ఞానమునిచ్చినప్పుడు జీవాత్మ తనకు తానే మిత్రునిగా అవుతుంది. ఆత్మ పవిత్రమై, తండ్రి ద్వారా వారసత్వము తీసుకుంటుంది. సంగమయుగములో ప్రతి ఆత్మను తండ్రి వచ్చి మిత్రునిగా చేసుకుంటారు. ఆత్మ తనకు తాను మిత్రునిగా అవుతుంది. మేము తండ్రి శ్రీమతానుసారమే నడుస్తామని శ్రీమతము దొరికినప్పుడు భావిస్తుంది. అర్ధకల్పము మీ మతానుసారముగా నడుచుకున్నారు. ఇప్పుడు శ్రీమతానుసారముగా సద్గతిని పొందాలి. ఇందులో మీ మతము నడవదు. తండ్రి కేవలం తమ మతమునిస్తారు. మీరు దేవతలుగా అయ్యేందుకు వచ్చారు కదా. ఇక్కడ మంచి కర్మలు చేస్తే మరో జన్మలో కూడా అమరలోకములో మంచి ఫలము లభిస్తుంది. ఇది ఉన్నదే మృత్యులోకము. పిల్లలైన మీకు మాత్రమే ఈ రహస్యము నంబరువారుగా తెలుసు. కొందరి బుద్ధిలో బాగా ధారణవుతుంది. కొంతమంది ధారణ చేయకపోతే, టీచరు ఏం చేయగలరు? టీచరు ద్వారా కృప లేక ఆశీర్వాదాన్ని వేడుకుంటారా? టీచరు చదివించి తన ఇంటికి వెళ్లిపోతారు. స్కూల్లో మొదట భగవంతుడిని ప్రార్థిస్తారు, ఓ భగవంతుడా! మమ్మల్ని పాస్ చేయిస్తే, మేము నైవేద్యము అర్పిస్తాము. ఆశీర్వదించండి అని టీచరును ఎప్పుడూ అడగరు. ఈ సమయంలో పరమాత్మ మనకు తండ్రియే కాక టీచరు కూడా. తండ్రి ఆశీర్వాదము మనపై ఉండనే ఉంది. పిల్లలు వచ్చినప్పుడు వారికి ధనమునివ్వాలని తండ్రి కోరుకుంటారు. ఇది ఆశీర్వాదమే కదా. ఇది ఒక నియమము. తండ్రి ద్వారా పిల్లలకు వారసత్వము లభిస్తుంది. ఇప్పుడు తమోప్రధానంగా అవుతూ ఉంటారు. తండ్రిలాగానే పిల్లలు. రోజు రోజుకూ ప్రతి వస్తువు తమోప్రధానమవుతూ ఉంటుంది. తత్వాలు కూడా తమోప్రధానమవుతూ ఉంటాయి. ఇది దుఃఖధామము. ఇంకా 40 వేల సంవత్సరాలు ఆయువు ఉంటే ఏ గతి పడుతుంది? మానవుల బుద్ధి పూర్తిగా తమోప్రధానమైపోయింది.
ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలోకి తండ్రితో యోగాన్ని జోడించినందుకు ప్రకాశం వచ్చేసింది. తండ్రి చెప్తున్నారు, ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా లైట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. స్మృతి ద్వారా ఆత్మ పవిత్రంగా అవుతుంది. లైట్ ఎక్కువవుతూ ఉంటుంది. స్మృతే చేయకుంటే లైట్ లభించదు. స్మృతి ద్వారా లైట్ వృద్ధి చెందుతుంది. స్మృతి చేయకుండా ఏదైనా వికర్మ చేసినట్లయితే, లైట్ తగ్గిపోతుంది. మీరు సతోప్రధానంగా అయ్యేందుకు పురుషార్థము చేస్తారు. ఇవన్నీ బాగా అర్థము చేసుకునే విషయాలు. స్మృతి ద్వారానే మీ ఆత్మ పవిత్రంగా అవుతూ ఉంటుంది. ఈ రచయిత, రచనల జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు ఇవ్వలేరని మీరు వ్రాయవచ్చు కూడా. వారిది ప్రాలబ్ధము. 84వ చివరి జన్మలో కృష్ణుని ఆత్మ మళ్ళీ జ్ఞానము తీసుకుంటూ ఉందని, మళ్ళీ ఫస్టు నంబరులో వస్తుందని కూడా వ్రాయాలి. సత్యయుగ ఆరంభములో జనాభా 9 లక్షలు మాత్రమే ఉంటుంది. తర్వాత వృద్ధి జరుగుతుంది కదా. పూర్తి 84 జన్మలు తీసుకునే దాస దాసీలు కూడా చాలా మంది ఉంటారు కదా. 84 జన్మలనే లెక్కిస్తారు. ఎవరు పరీక్షలో బాగా పాస్ అవుతారో వారే మొట్టమొదట వస్తారు. ఎంత ఆలస్యంగా వెళ్తారో అంతగా ఇంటిని పాతదని అంటారు కదా. కొత్త ఇల్లు తయారైతే రోజురోజుకూ దాని ఆయువు తగ్గుతూ వస్తుంది. అక్కడైతే బంగారు మహళ్ళు తయారవుతాయి. అవి పాతవిగా అవ్వవు. బంగారం సదా మెరుస్తూనే ఉంటుంది. అయినా శుభ్రము చేయాల్సి వస్తుంది. నగలు కూడా మేలిమి బంగారముతో తయారుచేసినా, చివరికి మెరుపు తగ్గిపోతుంది. దానిని మళ్ళీ పాలిష్ చేయాలి. పిల్లలైన మీకు సదా సంతోషం ఉండాలి, మేము కొత్త ప్రపంచములోకి వెళ్తాము, ఈ నరకంలో ఇది అంతిమ జన్మ. ఈ కనులతో చూసేదంతా పాత ప్రపంచము, పాత శరీరము. ఇప్పుడు సత్యయుగ నూతన ప్రపంచములో నూతన శరీరాన్ని తీసుకోవాలి. పంచ తత్వాలు కూడా క్రొత్తవిగా ఉంటాయి. ఇలా విచార సాగర మథనము నడవాలి. ఇది చదువు కదా. చివరి వరకు మీ ఈ చదువు నడుస్తూనే ఉంటుంది. చదువు సమాప్తమైతే వినాశనమైపోతుంది. కావున స్వయాన్ని విద్యార్థిగా భావించి ఈ సంతోషంలో ఉండాలి - భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు. ఈ సంతోషం తక్కువైనదేమీ కాదు. కానీ, మాయ కూడా చెడు కర్మలు చేయిస్తుంది. 5-6 సంవత్సరాలు పవిత్రంగా ఉంటారు, తర్వాత మాయ క్రింద పడేస్తుంది. ఒక్కసారి పడిపోయిన తర్వాత ఆ స్థితి మళ్ళీ రాదు. మేము పడిపోయాము అని అసహ్యము కలుగుతుంది. పిల్లలైన మీరిప్పుడు అంతా గుర్తుంచుకోవాలి. ఈ జన్మలో ఏవైతే పాపాలు చేసారో, ప్రతి ఆత్మకు తన జీవితము గురించి అయితే తెలుసు కదా. కొందరు మందబుద్ధిగా, కొందరు విశాల బుద్ధిగా ఉంటారు. చిన్నతనపు చరిత్ర గుర్తు అయితే ఉంటుంది కదా. ఈ బాబా కూడా తమ చిన్ననాటి చరిత్రను వినిపిస్తారు కదా. బాబాకు ఆ ఇల్లు మొదలైనవి కూడా గుర్తున్నాయి. కాని ఇప్పుడు అక్కడ కూడా అన్నీ కొత్త ఇళ్ళు తయారై ఉంటాయి. 6 సంవత్సరాల నుండి తమ జీవిత కథ జ్ఞాపకముంటుంది. ఒకవేళ మర్చిపోతే మందబుద్ధి అని అంటారు. తండ్రి చెప్తున్నారు - మీ జీవిత కథను వ్రాయండి. జీవితానికి సంబంధించిన విషయము కదా. జీవితంలో ఎంత చమత్కారము జరిగిందో అర్థమౌతుంది. గాంధీ, నెహ్రూ మొదలైనవారి జీవిత కథలు ఎంత పెద్ద-పెద్ద వాల్యూమ్స్ గా తయారయ్యాయి. వాస్తవానికి మీ జీవితము చాలా అమూల్యమైనది. ఇది అద్భుతమైన జీవితము. ఇది అత్యంత విలువైన, అమూల్యమైన జీవితము. దీని విలువ కట్టలేము. ఈ సమయంలో మీరు మాత్రమే సర్వీసు చేస్తారు. ఈ లక్ష్మీనారాయణులు కొంచెం కూడా సర్వీసు చేయరు. ఇతరుల జీవితాన్ని కూడా ఈ విధంగా తయారుచేసేటటువంటి సేవ చేసే మీ జీవితము అత్యంత అమూల్యమైనది. ఎవరైతే బాగా సేవ చేస్తారో వారు మహిమా యోగ్యులుగా అవుతారు. వైష్ణవ దేవీ మందిరము కూడా ఉంది కదా. ఇప్పుడు మీరు సత్యమైన వైష్ణవులుగా అవుతారు. వైష్ణవులంటే పవిత్రులు. ఇప్పుడు మీ ఆహార-పానీయాలు కూడా వైష్ణవంగా (పవిత్రంగా) ఉన్నాయి. మొదటి నంబరు వికారము విషయంలో అయితే మీరు ఎలాగైనా వైష్ణవులే (పవిత్రులే). జగదంబ పిల్లలందరూ బ్రహ్మాకుమార్-కుమారీలే కదా. బ్రహ్మా మరియు సరస్వతి. మిగిలిన వారంతా వారి సంతానము. నెంబరువారు దేవీలు కూడా ఉన్నారు, వారి పూజ జరుగుతుంది. అయితే వారికి చూపించిన అనేక భుజాలు మొదలైనవన్నీ అనవసరమైనవి. మీరు చాలామందిని మీ సమానంగా చేస్తారు, అందుకు గుర్తుగా అన్ని భుజాలు ఇచ్చారు. బ్రహ్మాను కూడా 100 భుజాల కలవారిగా, వేయి భుజాలు కలవారిగా చూపిస్తారు. అవన్నీ భక్తిమార్గములోని విషయాలు. దైవీగుణాలను కూడా ధారణ చేయాలని మీకు తండ్రి చెప్తున్నారు. ఎవ్వరికీ దుఃఖమునివ్వకండి. ఎవరికైనా చెడు మార్గము చెప్పి సర్వనాశనము చేయకండి. తండ్రిని, వారిచ్చే వారసత్వమును స్మృతి చేయమనే ముఖ్యమైన విషయమొక్కటే తెలియజేయండి. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. గాయనము లేక పూజకు యోగ్యులుగా అయ్యేందుకు పక్కా వైష్ణవులుగా అవ్వాలి. ఆహార-పానీయాల శుద్ధతతో పాటు పవిత్రంగా ఉండాలి. ఈ అమూల్యమైన జీవితములో సర్వీసు చేసి అనేకమంది జీవితాలను శ్రేష్ఠంగా చేయాలి.
2. ఆత్మ ప్రకాశము పెరిగే విధముగా తండ్రితో యోగమును జోడించాలి. ఏదైనా వికర్మ చేసి మీ ప్రకాశాన్ని తగ్గించుకోకూడదు. మీకు మీరు మిత్రులుగా అవ్వాలి.