17-04-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం
"మధురమైన పిల్లలూ - తండ్రి జ్ఞానసాగరులు, వారిని జానీ జానన్హార్ (సర్వం తెలిసినవారు) అని అనడం అసత్య మహిమ, తండ్రి మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేసేందుకే వస్తారు” ప్రశ్న:- తండ్రితో పాటు అందరికంటే అధిక మహిమ ఇంకెవరికి ఉంది? ఎందుకు? జవాబు:- 1. తండ్రితో పాటు భారతదేశానికి కూడా చాలా మహిమ ఉంది. భారతదేశమే అవినాశి ఖండము. భారతదేశమే స్వర్గంగా అవుతుంది. తండ్రి భారతవాసులనే ధనవంతులుగా, సుఖవంతులుగా, పవిత్రంగా చేశారు. 2. గీతకు కూడా అపారమైన మహిమ ఉంది. సర్వ శాస్త్రాల శిరోమణి గీత. 3. చైతన్య జ్ఞానగంగలైన మీకు కూడా చాలా మహిమ ఉంది. మీరు డైరెక్ట్ జ్ఞానసాగరుని నుండి వెలువడ్డారు. ఓంశాంతి. క్రొత్త పిల్లలు మరియు పాత పిల్లలందరూ ఓంశాంతి యొక్క అర్థమును తెలుసుకున్నారు. ఆత్మలమైన మనమంతా పరమాత్ముని పిల్లలమని కూడా మీరు తెలుసుకున్నారు. పరమాత్మ ఉన్నతాతి ఉన్నతమైన మరియు అత్యంత ప్రియమైన, అందరి ప్రియుడు. పిల్లలకు జ్ఞానము మరియు భక్తి యొక్క రహస్యాలైతే అర్థము చేయించారు. జ్ఞానమనగా పగలు - సత్య, త్రేతా యుగాలు. భక్తి అనగా రాత్రి - ద్వాపర, కలియుగాలు. ఇదంతా భారతదేశ విషయమే. మొట్టమొదట భారతవాసులైన మీరే వస్తారు. 84 జన్మల చక్రము కూడా భారతవాసులైన మీకు మాత్రమే. ఒక్క భారతదేశము మాత్రమే అవినాశి ఖండము. భారతఖండమే స్వర్గముగా అవుతుంది. ఇతర ఖండమేదీ స్వర్గంగా అవ్వదు. కొత్త ప్రపంచమైన సత్యయుగములో భారతదేశము మాత్రమే ఉంటుందని పిల్లలకు అర్థము చేయించబడింది. భారతదేశమే స్వర్గమని పిలవబడుతుంది, భారతవాసులే మళ్ళీ 84 జన్మలు తీసుకొని నరకవాసులుగా అవుతారు. వారే తిరిగి స్వర్గవాసులుగా అవుతారు. ఈ సమయంలో అందరూ నరకవాసులుగా ఉన్నారు. మిగిలిన అన్ని ఖండాలు వినాశనమైనా భారతదేశము మాత్రము మిగులుతుంది. భారతఖండము యొక్క మహిమ అపారమైనది. భారతదేశములోనే తండ్రి వచ్చి మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇది గీత యొక్క పురుషోత్తమ సంగమయుగము. భారతదేశమే మళ్ళీ పురుషోత్తమంగా అవుతుంది. ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మమూ లేదు, రాజ్యమూ లేదు. అందువలన ఆ యుగము కూడా లేదు. సర్వశక్తివంతుడని ఒక్క భగవంతుడిని మాత్రమే అంటారని పిల్లలైన మీకు తెలుసు. భారతవాసులు వారిని అంతర్యామి అని, చాలా తప్పు చేశారు, అందరి ఆంతరికము వారికి తెలుసని అంటారు. తండ్రి అంటున్నారు - నాకు ఎవరి ఆంతరికమూ తెలియదు. పతితులను పావనంగా చేయడమే నా కర్తవ్యము. శివబాబా, మీరు అంతర్యామి అని చాలామంది అంటారు. బాబా అంటున్నారు - నేను అలా లేను. నాకు ఎవరి హృదయము గురించి తెలియదు. నేను వచ్చి కేవలం పతితులను పావనంగా చేస్తాను. నన్ను పతిత ప్రపంచములోనే పిలుస్తారు, ఎప్పుడైతే పురాతన ప్రపంచాన్ని కొత్తదిగా చేయవలసి వస్తుందో, అప్పుడు ఒక్కసారి మాత్రమే వస్తాను. ఈ ప్రపంచము కొత్తది నుండి పాతదిగా, పాతది నుండి కొత్తదిగా ఎప్పుడవుతుందో మనుష్యులకు తెలియదు. ప్రతి వస్తువు క్రొత్త నుండి పాతదిగా, సతో, రజో, తమోలలోకి తప్పక వస్తుంది. మనుష్యులు కూడా ఇలాగే అవుతారు. బాల్యావస్థలో సతోప్రధానంగా ఉంటారు, ఆ తర్వాత యువతగా అవుతారు, ఆ తర్వాత వృద్ధులుగా అవుతారు అనగా రజో, తమోలోకి వస్తారు. వృద్ధ శరీరము అయిన తర్వాత దానిని వదిలి మళ్ళీ బాలునిగా అవుతారు. కొత్త ప్రపంచములో భారతదేశము ఎంతో ఉన్నతంగా ఉండేదని పిల్లలకు తెలుసు. భారతదేశ మహిమ అపారమైనది. ఇంత సుఖవంతమైన, ధనవంతమైన, పవిత్రమైన ఖండము మరొకటి లేనే లేదు. దీనిని మళ్ళీ సతోప్రధానంగా చేసేందుకు తండ్రి వచ్చారు. సతోప్రధాన ప్రపంచము స్థాపనవుతూ ఉంది. త్రిమూర్తులైన బ్రహ్మా, విష్ణువు, శంకరులను ఎవరు సృష్టించారు? అత్యంత ఉన్నతమైన శివుడు. త్రిమూర్తి బ్రహ్మా అని అంటారు కూడా. అర్థమైతే తెలియదు. వాస్తవానికి త్రిమూర్తి శివ అని అనాలి. బ్రహ్మాను కాదు. దేవ దేవ మహాదేవుడని మహిమ చేస్తారు. శంకరుడిని ఉన్నతంగా ఉంచితే, త్రిమూర్తి శంకరుడు అని అనాలి కదా. మరి త్రిమూర్తి బ్రహ్మా అని ఎందుకంటారు? శివుడు రచయిత. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులను స్థాపన చేస్తారని మహిమ కూడా చేస్తారు. భక్తిమార్గములో నాలెడ్జ్ ఫుల్ తండ్రిని సర్వజ్ఞుడని అంటారు, కాని ఈ మహిమ అర్థ సహితంగా లేదు. తండ్రి ద్వారా మనకు వారసత్వము లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. వారే స్వయంగా బ్రాహ్మణులైన మనల్ని చదివిస్తారు ఎందుకంటే వారు తండ్రి కూడా అయ్యారు, సుప్రీమ్ టీచరు కూడా అయ్యారు, ప్రపంచ చరిత్ర-భూగోళాల చక్రము ఎలా తిరుగుతుందనే విషయాలు కూడా అర్థము చేయిస్తారు. వారే జ్ఞానసాగరులు. కాని సర్వమూ తెలిసినవారని అనడం పొరపాటు. నేను వచ్చి కేవలం పతితులను పావనంగా మాత్రము చేస్తాను. 21 జన్మల రాజ్య భాగ్యమునిస్తాను. భక్తి మార్గములో అల్పకాలిక సుఖముంటుంది. దీనిని గురించి సన్యాసులకు, హఠయోగులకు తెలియనే తెలియదు. వారు బ్రహ్మతత్వమును స్మృతి చేస్తారు. బ్రహ్మతత్వము భగవంతుడు కాదు. ఒక్క నిరాకార శివుడే భగవంతుడు, వారు సర్వాత్మల తండ్రి. ఆత్మలమైన మనము నివసించే స్థానము బ్రహ్మాండము, స్వీట్ హోమ్. అక్కడ నుండి ఆత్మలమైన మనము పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వస్తాము. ఒక శరీరాన్ని వదిలి రెండవ, మూడవ శరీరము తీసుకుంటానని ఆత్మ అంటుంది. 84 జన్మలు కూడా భారతవాసులకు మాత్రమే. ఎవరైతే ఎక్కువ భక్తి చేశారో వారే మళ్ళీ జ్ఞానము కూడా తీసుకుంటారు. తండ్రి చెప్తున్నారు - భలే గృహస్థ వ్యవహారములో ఉండండి కాని శ్రీమతమును అనుసరించండి. ఆత్మలైన మీరందరూ ప్రియుడైన ఒక్క పరమాత్ముని ప్రేయసులు. మీరు భక్తి మార్గము నుండి నన్ను స్మృతి చేస్తూ వచ్చారు. ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది. ఇది దుఃఖధామము. నిజానికి ఆత్మలమైన మనము శాంతిధామ నివాసులము. అక్కడ నుండి మనము సుఖధామానికి వచ్చాము, తర్వాత 84 జన్మలు తీసుకున్నాము. "హమ్ సో, సో హమ్” అర్థమును కూడా అర్థం చేయించారు. వారు ఆత్మనే పరమాత్మ, పరమాత్మనే ఆత్మ అని అంటారు. కాని దేవతలుగా ఉన్న మనమే క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యామని తండ్రి అర్థము చేయించారు. దేవతలుగా అయ్యేందుకు మనమే ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము. హమ్ సో, సో హమ్ యథార్థమైన అర్థము ఇదే. వారి అర్థము పూర్తిగా తప్పు. సత్యయుగములో ఒకే దేవీ దేవతా ధర్మము, అద్వైత ధర్మము ఉండేది. తర్వాత ఇతర ధర్మాలు వచ్చినందుకు ద్వైత ధర్మము ఏర్పడింది. ద్వాపరయుగము నుండి ఆసురీ రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. సత్యయుగములో రావణ రాజ్యమే లేదు. కనుక 5 వికారాలు కూడా ఉండవు. వారు సంపూర్ణ నిర్వికారులు. సీతా-రాములను కూడా 14 కళా సంపూర్ణులని అంటారు. రాముని చేతికి బాణమెందుకిచ్చారో కూడా ఏ మనుష్యులకూ తెలియదు. అక్కడ హింస యొక్క విషయమే ఉండదు. మీరు ఈశ్వరీయ విద్యార్థులు. కావున వీరు తండ్రి కూడా, మీరు విద్యార్థులైనందుకు టీచరు కూడా. అంతేకాక పిల్లలైన మీకు సద్గతినిచ్చి స్వర్గానికి తీసుకెళ్తారు. కనుక తండ్రి, టీచరు, గురువు ముగ్గురూ కూడా ఒక్కరే అయ్యారు. వారికి మీరు పిల్లలుగా అయ్యారు కనుక మీకెంత సంతోషముండాలి! మనుష్యులకు కొంచెము కూడా తెలియదు. ఎందుకంటే ఇది రావణ రాజ్యము కదా. ప్రతి సంవత్సరము రావణుడిని కాలుస్తూ ఉంటారు. అయితే రావణుడంటే ఎవరో ఎవ్వరికీ తెలియదు. ఈ రావణుడు భారతదేశానికి చాలా గొప్ప శత్రువని పిల్లలైన మీకు తెలుసు. ఈ జ్ఞానము, జ్ఞానసాగరులైన తండ్రి నుండి పిల్లలైన మీకు మాత్రమే లభిస్తుంది. ఆ తండ్రి జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు. జ్ఞాన సాగరుని నుండి మేఘాలైన మీరు జ్ఞానాన్ని నింపుకొని అక్కడకు వెళ్ళి వర్షిస్తారు. మీరు జ్ఞాన గంగలు, మహిమ మీదే! ఇప్పుడు నేను మిమ్మల్ని పావనంగా చేసేందుకు వచ్చాను. ఈ ఒక్క జన్మ పవిత్రంగా అవ్వండి. నన్ను స్మృతి చేస్తే మీరు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు. పతితపావనుడను నేనే. స్మృతిని సాధ్యమైనంత పెంచండి. నోటితో శివబాబా అని కూడా అనకూడదు. ప్రేయసి తన ప్రియుడిని ఒక్కసారి చూస్తే ఆమె బుద్ధిలో అతని స్మృతి మెదులుతూ ఉన్నట్లుగా ప్రేయసులైన మీరు ప్రియుడినైన నన్ను స్మృతి చేయండి. భక్తిమార్గములో ఎవరు ఏ దేవతను స్మృతి చేస్తారో, పూజిస్తారో, ఆ దేవత సాక్షాత్కారమవుతుంది. అది అల్పకాలికమైనది. భక్తి చేస్తూ క్రిందకి దిగుతూ వచ్చారు. ఇప్పుడు మృత్యువు మీ ముందే నిలబడి ఉంది. అయ్యో-అయ్యో అని ఆర్తనాదాలు చేసిన తర్వాత జయ-జయ ధ్వనులు వినిపిస్తాయి. రక్తపు నదులు భారతదేశములోనే ప్రవహిస్తాయి. గృహయుద్ధాల యొక్క లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి, తమోప్రధానమైపోయారు. మీరిప్పుడు సతోప్రధానంగా అవుతున్నారు. కల్పక్రితము ఎవరైతే దేవతలుగా అయ్యారో, వారే మళ్ళీ వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. భక్తి తక్కువగా చేసి ఉంటే జ్ఞానము కూడా తక్కువగానే తీసుకుంటారు. ప్రజలలో కూడా నంబరువారుగా పదవులు పొందుతారు. మంచి పురుషార్థులు శ్రీమతమును అనుసరించి మంచి పదవి పొందుతారు. మ్యానర్స్ కూడా బాగుండాలి. దైవీగుణాలు కూడా ధారణ చెయ్యాలి. అవి 21 జన్మలు కొనసాగుతాయి. ఇప్పుడు అందరివీ ఆసురీ గుణాలే. ఇది ఆసురీ ప్రపంచము, పతిత ప్రపంచము కదా. పిల్లలైన మీకు చరిత్ర-భూగోళాలు కూడా అర్థము చేయించబడ్డాయి. ఇప్పుడు స్మృతి చేసే శ్రమ చేస్తే మీరు సత్యమైన బంగారంగా అవుతారు. సత్యయుగము, గోల్డన్ ఏజ్, సత్యమైన బంగారంగా ఉంటుంది, తర్వాత త్రేతాయుగములో వెండి యొక్క మిశ్రమ లోహం కలుస్తుంది. కళలు తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక్క కళ కూడా లేదు, ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి వస్తుందో అప్పుడు తండ్రి వస్తారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. ఈ రావణరాజ్యములో అందరూ తెలివిహీనులుగా అయ్యారు, ఈ అనంతమైన నాటకములో పాత్రధారులుగా ఉంటున్నా డ్రామా ఆదిమధ్యాంతాల గురించి తెలియదు. మీరు పాత్రధారులు కదా! మనమిక్కడకు పాత్ర అభినయించేందుకు వచ్చామని మీకు తెలుసు. పాత్రధారులైనా, డ్రామా గురించి తెలియదు. అందుకే కదా అనంతమైన తండ్రి, మీరెంత తెలివిహీనులుగా అయ్యారని అంటున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని వివేకవంతులుగా, వజ్ర సమానంగా తయారుచేస్తాను. మళ్ళీ రావణుడు వచ్చి గవ్వ సమానంగా చేస్తాడు. నేనే వచ్చి అందరినీ తోడుగా తీసుకెళ్తాను. మళ్ళీ తర్వాత ఈ పతిత ప్రపంచము కూడా వినాశనమైపోతుంది. దోమలవలె అందరినీ తీసుకెళ్తాను. మీ లక్ష్యము ఉద్దేశ్యం ఎదురుగా నిలబడి ఉంది. మీరు ఇలా తయారవ్వాలి. అప్పుడే మీరు స్వర్గవాసులుగా అవుతారు. బి.కె.లు అయిన మీరు అలా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. మనుష్యుల బుద్ధి తమోప్రధానంగా ఉన్నందుకు అర్థము చేసుకోలేరు. ఇంత మంది బి.కె.లు ఉన్నప్పుడు ప్రజాపిత బ్రహ్మా కూడా తప్పకుండా ఉంటారు. బ్రాహ్మణులది పిలుక స్థానం, బ్రాహ్మణులే మళ్ళీ దేవతలు...... చిత్రాలలో బ్రాహ్మణులను, శివబాబాను మాయం చేసేశారు. బ్రాహ్మణులైన మీరిప్పుడు భారతదేశాన్ని స్వర్గముగా చేస్తున్నారు. అచ్ఛా. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. ఉన్నత పదవి పొందేందుకు శ్రీమతమును అనుసరించి మంచి మ్యానర్స్ ధారణ చేయాలి. 2. సత్యమైన ప్రేయసులుగా అయి ఒక్క ప్రియుడినే స్మృతి చేయాలి. వీలైనంత ఎక్కువగా స్మృతి చేసే అభ్యాసాన్ని పెంచుకుంటూ ఉండాలి. వరదానము:- స్థూల దేశము మరియు స్థూల శరీర స్మృతికి అతీతంగా సూక్ష్మ దేశ వేషధారి భవ ఎలాగైతే ఈనాటి ప్రపంచంలో ఎటువంటి కర్తవ్యముంటుందో అటువంటి వేషాన్ని ధారణ చేస్తారో, అలా మీరు కూడా ఏ సమయంలో ఎటువంటి కర్మ చేయాలనుకుంటారో అటువంటి వేషాన్ని ధారణ చేయండి. ఇప్పుడిప్పుడే సాకారి, ఇప్పుడిప్పుడే ఆకారి. ఇటువంటి బహురూపిగా అయినట్లయితే సర్వ స్వరూపాల సుఖాలను అనుభవం చేయగలరు. ఇది నా స్వరూపమే. ఇతరుల వస్త్రాలు ఫిట్ అయినా, అవ్వకపోయినా మీ వస్త్రాలు సహజంగానే ధారణ చేయగలరు. కనుక ఈ వరదానాన్ని ప్రాక్టికల్ గా అభ్యాసము చేస్తే అవ్యక్త మిలనము యొక్క విచిత్ర అనుభవాన్ని చేయగలరు. స్లోగన్:- అందరినీ ఆదరించేవారే ఆదర్శంగా అవ్వగలరు. గౌరవిస్తే గౌరవం లభిస్తుంది. మాతేశ్వరి గారి మహావాక్యాలు 1. "మనుష్యాత్మలు తమ పూర్తి సంపాదన అనుసారముగా భవిష్య ప్రాలబ్ధము అనుభవిస్తారు” చాలామంది మనుష్యులు మా పూర్వజన్మల మంచి సంపాదన వలన ఇప్పుడీ జ్ఞానము ప్రాప్తి అయిందని భావిస్తారు. కాని అటువంటి విషయమే లేదు. పూర్వ జన్మ యొక్క మంచి ఫలమని మనకు తెలుసు. కల్పము యొక్క చక్రము తిరుగుతూ ఉంటుంది. సతో, రజో, తమో..... మారుతూ ఉంటుంది. కాని డ్రామానుసారముగా పురుషార్థముతో ప్రాలబ్ధము తయారయ్యే అవకాశముంది. అందువల్లనే అక్కడ సత్యయుగంలో కొంతమంది రాజులు-రాణులు, కొంతమంది దాసీలు, కొంతమంది ప్రజా పదవి పొందుతారు. ఇది పురుషార్థము యొక్క సిద్ధి. అక్కడ ద్వైతము, ఈర్ష్య ఉండదు. అక్కడ ప్రజలు కూడా సుఖంగా ఉంటారు. రాజా-రాణి తమ ప్రజలను, తల్లిదండ్రులు తమ పిల్లలను సంభాళించినట్లు సంభాళిస్తారు. అక్కడ పేదవారు, ధనవంతులు అందరూ సంతుష్టంగా ఉంటారు. ఈ ఒక్క జన్మలోని పురుషార్థము ద్వారా 21 తరాల వరకు సుఖాన్ని అనుభవిస్తారు. ఇది అవినాశి సంపాదన. ఈ అవినాశి సంపాదనలో అవినాశి జ్ఞానము ద్వారా అవినాశి పదవి లభిస్తుంది. ఇప్పుడు మనము సత్యయుగ ప్రపంచములోకి వెళ్తున్నాము. ఈ ప్రాక్టికల్ ఆట నడుస్తూ ఉంది. ఇక్కడ ఏ మాయా-మంత్రం యొక్క విషయమేమీ లేదు. 2. "గురువుల మతము, శాస్త్రాల మతము - పరమాత్ముని మతము కాదు” పరమాత్మ చెప్తున్నారు - పిల్లలూ, ఈ గురువుల మతము, శాస్త్రల మతము, ఏవీ నా మతము కాదు. వీరు కేవలం నా పేరుతో వారి మతమునిస్తున్నారు. కాని నా మతము నాకు మాత్రమే తెలుసు. నన్ను కలుసుకునే మార్గము నేనే వచ్చి చెప్తాను. అంతకుముందు నా అడ్రస్ ఎవ్వరికీ తెలియదు. గీతలో భలే భగవానువాచ అని ఉంది కానీ ఆ గీత కూడా మనుష్యులే తయారుచేశారు. భగవంతుడైతే జ్ఞానసాగరుడు. భగవంతుడు ఏ మహావాక్యాలు వినిపించారో వాటి జ్ఞాపకార్థము, తర్వాత ఈ గీత తయారయింది. ఈ విద్వాంసులు, పండితులు, ఆచార్యులు, పరమాత్మ సంస్కృతంలో ఈ మహావాక్యాలు ఉచ్చరించారని, వాటిని నేర్చుకోకుండా పరమాత్మ లభించరని అంటారు. ఈ మాటలతో ఇంకా విరుద్ధమైన కర్మ కాండలలో చిక్కుకునేటట్లు చేస్తారు. ఒకవేళ వేదశాస్త్రాలు చదివి మెట్లు ఎక్కినట్లయితే మళ్ళీ అన్ని మెట్లు క్రిందికి దిగాల్సి వస్తుంది. అనగా వాటన్నిటిని మర్చిపోయి ఒక్క పరమాత్మతో బుద్ధియోగాన్ని జోడించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ కర్మకాండలు, వేదాలు, శాస్త్రాలు చదవడంతో నన్ను పొందలేరు అని పరమాత్మ నేరుగా చెప్తున్నారు. ధృవుడు, ప్రహ్లాదుడు, మీరాబాయి శాస్త్రాలేమైనా చదివారా? ఇక్కడ, చదివినవి కూడా మర్చిపోవాల్సి వస్తుంది. ఉదాహరణకు అర్జునుడు కూడా చదివినదంతా మర్చిపోవాల్సి వచ్చింది కదా. భగవంతుడు నేరుగా చెప్పిన మహావాక్యాలు - శ్వాస శ్వాసలో నన్ను స్మృతి చేస్తే చాలు, ఇందులో ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఈ జ్ఞానము లేనంత వరకు భక్తిమార్గము కొనసాగుతుంది. కాని జ్ఞాన దీపము వెలిగితే కర్మకాండలు వదిలిపోతాయి. ఎందుకంటే కర్మకాండలు చేస్తూ చేస్తూ శరీరము వదిలేస్తే ఏం లాభము? ప్రాలబ్ధము తయారవ్వలేదు. కర్మబంధనాల లెక్కాచారము నుండి ముక్తి లభించలేదు. అబద్ధాలు చెప్పకుండా ఉండడం, దొంగతనము చేయకుండా ఉండడం, ఎవ్వరికీ దుఃఖమివ్వకుండా ఉండడం..... ఇవి మంచి కర్మలని మనుష్యులు భావిస్తారు. కాని ఇక్కడ కర్మబంధనాల నుండి సదా కొరకు విడుదల అవ్వాలి, వికర్మల వేర్లను తీసివేయాలి. ఇప్పుడు ఎటువంటి బీజము వేయాలంటే దాని నుండి మంచి కర్మల వృక్షము వెలువడాలి. అందుకు మనుష్యులు జీవిత కార్యాన్ని తెలుసుకొని శ్రేష్ఠ కర్మలు చేయాలి. అచ్ఛా. ఓంశాంతి.
|
|