09-04-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - ఇది మీకు అత్యంత విలువైన సమయము, ఈ సమయంలో మీరు తండ్రికి పూర్తి సహాయకులుగా అవ్వండి, సహాయకులైన పిల్లలే ఉన్నతమైన పదవిని పొందుతారు"

ప్రశ్న:-

సేవాధారులైన పిల్లలు ఎటువంటి సాకులు చెప్పరు?

జవాబు:-

సేవాధారి పిల్లలు - బాబా! ఇక్కడ వేడిగా ఉంది, ఇక్కడ చలిగా ఉంది, అందువలన మేము సేవ చేయలేకపోతున్నామని ఎప్పుడూ చెప్పరు. కొద్దిగా చలి వేసినా, ఎండ ఎక్కువగా ఉన్నా సుకుమారంగా, నాజూకుగా అవ్వకూడదు. మేము సహించలేమని అనకూడదు. ఈ దుఃఖధామములో సుఖ దుఃఖాలు, వేడి-చలి, నింద-స్తుతి అన్నీ సహించాలి. సాకులు చెప్పకూడదు.

గీతము:-

ఓర్పు వహించు మానవా!... ( ధీరజ్ ధర్ మనువా!...)

ఓంశాంతి. సుఖము, దుఃఖము అని వేటినంటారో పిల్లలకు తెలుసు. ఈ జీవితంలో సుఖమెప్పుడు లభిస్తుందో, దుఃఖమెప్పుడు లభిస్తుందో, బ్రాహ్మణులైన మీకు మాత్రమే నెంబరువారు పురుషార్థానుసారంగా తెలుసు. ఇది దుఃఖమయమైన ప్రపంచము. ఇందులో ఇంకా కొంత సమయము సుఖము-దుఃఖము, నింద-స్తుతి అన్నీ సహనము చెయ్యవలసి ఉంటుంది. వీటన్నింటినీ దాటేయాలి. ఎవరికైనా కొంచెం వేడిగా అనిపిస్తే మాకు చల్లదనం కావాలి అని అంటారు. ఇప్పుడు ఎండలో లేక చలిలో కూడా పిల్లలు సర్వీసు అయితే చేయాలి కదా! ఈ సమయంలో కొద్దో గొప్పో దుఃఖము కలిగినా అదేమీ కొత్త విషయము కాదు. ఈ ప్రపంచమే దుఃఖధామము. ఇప్పుడు పిల్లలైన మీరు సుఖధామములోకి వెళ్ళేందుకు పూర్తిగా పురుషార్థము చేయాలి. ఇది మీకు అత్యంత విలువైన సమయము. ఇందులో సాకులు చెప్పకూడదు. బాబా సేవాధారి పిల్లలకు చెప్తున్నారు - సర్వీసు చేయడం తెలియనివారు దేనికీ పనికి రారు. కేవలం భారతదేశములోనే కాదు, పూర్తి విశ్వమునే సుఖధామంగా చేసేందుకు తండ్రి వచ్చారు. కనుక బ్రాహ్మణ పిల్లలే తండ్రికి సహాయకులుగా అవ్వాలి. తండ్రి వచ్చి ఉన్నారంటే వారి మతం అనుసారముగా నడవాలి కదా! భారతదేశము ఏదైతే స్వర్గంగా ఉండేదో అది ఇప్పుడు నరకంగా ఉంది, దానిని మళ్ళీ స్వర్గంగా చేయాలి. ఇది కూడా మీకు ఇప్పుడే తెలిసింది. సత్యయుగంలో ఈ పవిత్ర రాజుల రాజ్యముండేది. అక్కడ చాలా సుఖంగా ఉండేవారు. వారే మళ్ళీ అపవిత్ర రాజులుగా అయ్యారు. ఈశ్వరార్థము దాన-పుణ్యాలు చేయడం ద్వారా వారికి కూడా శక్తి లభిస్తుంది. ఇప్పుడు ఉన్నదే ప్రజా రాజ్యము. కానీ వీరెవ్వరూ భారతదేశానికి సేవ చేయలేరు. భారతదేశానికి లేక ప్రపంచమంతటికి ఒక్క అనంతమైన తండ్రి మాత్రమే సేవ చేయగలరు. ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు - మధురమైన పిల్లలూ, ఇప్పుడు నాకు సహాయకులుగా అవ్వండి. ఎంత ప్రేమగా అర్థము చేయిస్తున్నారో, దేహీ-అభిమాని పిల్లలు అర్థము చేసుకుంటారు. దేహాభిమానులు ఏ సహయోగం చేయగలరు? ఎందుకంటే వారు మాయ సంకెళ్ళలో చిక్కుకొని ఉన్నారు. ఇప్పుడు తండ్రి ఆదేశిస్తున్నారు - అందరినీ మాయ బంధనాల నుండి, గురువుల బంధనాల నుండి విడిపించండి. ఇదే మీ వ్యాపారము. తండ్రి చెప్తున్నారు - నాకు ఎవరైతే మంచి సహాయకులుగా అవుతారో, వారే పదవిని కూడా పొందుతారు. తండ్రియే స్వయంగా సన్ముఖములో చెప్తున్నారు - నేను సాధారణంగా ఉన్న కారణంగా నేను ఎవరో, ఎలా ఉన్నానో పూర్తిగా తెలుసుకోరు. తండ్రి మనల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారని కూడా తెలియదు. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి యజమానులుగా ఉండేవారని కూడా ఎవ్వరికీ తెలియదు. వీరు రాజ్యమును పొంది తర్వాత ఎలా పోగొట్టుకున్నారో ఇప్పుడు మీకు తెలుసు. మనుష్యులది పూర్తిగా తుచ్ఛమైన బుద్ధిగా ఉంది. అందరి బుద్ధికి వేయబడిన తాళము తెరిచేందుకు, రాతి బుద్ధి నుండి పారస బుద్ధిగా చేసేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. ఇప్పుడు నాకు సహాయకులుగా అవ్వమని తండ్రి చెప్తున్నారు. మనుష్యులు ఖుదాయి ఖిద్మత్గార్ (ఈశ్వరీయ సేవాధారి) అని అంటారే కానీ సహాయకులుగా అవ్వరు. ఖుదా వచ్చి ఎవరినైతే పవిత్రంగా చేస్తారో వారికే - ఇప్పుడు ఇతరులను తమ సమానంగా చెయ్యమని, శ్రీమతమును అనుసరించండి అని చెప్తారు. పావన స్వర్గవారసులుగా చేసేందుకే తండ్రి వచ్చారు.

బ్రాహ్మణ పిల్లలైన మీకు ఇది మృత్యులోకమని తెలుసు. కూర్చుని కూర్చునే అకస్మాత్తుగా మృత్యువు జరుగుతూ ఉన్నప్పుడు మొదటే, మనమెందుకు శ్రమ చేసి తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని పొంది, భవిష్య జీవితాన్ని తయారు చేసుకోకూడదు? మనుష్యులు వానప్రస్థ అవస్థను పొందినప్పుడు ఇప్పుడిక భక్తి చేయడంలో నిమగ్నమవ్వాలని భావిస్తారు. వానప్రస్థ అవస్థ రానంతవరకు పూర్తిగా ధనము మొదలైనవి సంపాదిస్తూనే ఉంటారు. ఇప్పుడు మీ అందరిదీ వానప్రస్థ అవస్థ. మరి తండ్రికి సహాయకులుగా ఎందుకు అవ్వకూడదు! మేము తండ్రికి సహాయకులుగా అవుతున్నామా? అని హృదయాన్ని ప్రశ్నించుకోండి. సేవాధారి పిల్లలు ప్రసిద్ధింగ ఉన్నారు. చాలా శ్రమ చేస్తారు. యోగములో ఉంటే సర్వీస్ చేయగలరు. స్మృతి శక్తి ద్వారానే ప్రపంచమంతటినీ పవిత్రంగా చేయాలి. మొత్తం విశ్వాన్ని పావనంగా చేసేందుకు మీరు నిమిత్తంగా ఉన్నారు. మీ కొరకు పవిత్ర ప్రపంచము కూడా కావాలి. కనుక పతిత ప్రపంచ వినాశనము తప్పకుండా జరగాల్సిందే. ఇప్పుడు అందరికీ దేహాభిమానాన్ని వదిలేయమని చెప్తూ ఉండండి. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి, వారే పతితపావనులు. అందరూ వారినే స్మృతి చేస్తారు. సాధువులు, సత్పురుషులు మొదలైన వారందరూ వేలుతో పరమాత్మ ఒక్కరే అని, వారే అందరికీ సుఖమిస్తారని పైకి సూచిస్తారు. ఈశ్వరుడు లేక పరమాత్మ అని అంటారే గానీ, వారిని గురించి ఎవ్వరికీ తెలియదు. కొందరు గణేశుడిని, కొందరు హనుమంతుడిని, కొందరు తమ గురువులను స్మృతి చేస్తూ ఉంటారు. ఇప్పుడదంతా భక్తిమార్గమని మీకు తెలుసు. భక్తిమార్గము కూడా అర్ధ కల్పము నడవాలి. గొప్ప గొప్ప ఋషులు, మునులు కూడా నేతి-నేతి (మాకు తెలియదు) అని చెప్తూ వచ్చారు. రచయిత-రచనల గురించి మాకు తెలియదు. వారు త్రికాలదర్శులేమీ కాదని తండ్రి చెప్తున్నారు. బీజరూపులు, జ్ఞానసాగరులు ఒక్క తండ్రి మాత్రమే. వారు భారతదేశములోనే వస్తారు. శివజయంతిని గీతా జయంతిగా జరుపుకుంటారు, కృష్ణుడిని స్మృతి చేస్తారు. శివుని గురించి తెలియదు. పతితపావనుడు, జ్ఞానసాగరుడు నేనే అని శివబాబా చెప్తున్నారు. కానీ కృష్ణుని గురించి ఇలా చెప్పరు. గీతా భగవంతుడెవరు అనే చిత్రము చాలా మంచి చిత్రము. పిల్లల కళ్యాణార్థమే తండ్రి ఈ చిత్రాలు మొదలైనవి తయారు చేయించారు. అందులో శివబాబా మహిమను పూర్తిగా వ్రాయాలి. ఆధారమంతా దీని పైనే ఉంది. పై నుంచి ఎవరైతే వస్తారో వారంతా పవిత్రమైనవారే. పవిత్రంగా అవ్వకుండా ఎవ్వరూ వెళ్ళలేరు. ముఖ్యమైన విషయము పవిత్రంగా అవ్వడమే. అది పవిత్రధామము. ఆత్మలందరూ అక్కడే నివసిస్తారు. ఇక్కడ మీరు పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ పతితులుగా అయ్యారు. అందరికంటే ఎక్కువ పావనమైన వారెవరైతే ఉండేవారో వారే మళ్ళీ పతితంగా అయ్యారు. దేవీ దేవతా ధర్మము యొక్క నామ రూపాలే మాయమైపోయాయి. దేవతా ధర్మానికి బదులుగా హిందూ ధర్మమని పేరు పెట్టేశారు. స్వర్గ రాజ్యాన్ని మీరే తీసుకుంటారు. మళ్ళీ పోగొట్టుకుంటారు. ఇది ఓటమి-గెలుపుల ఆట. మాయతో ఓడిపోవడమే ఓటమి. మాయపై గెలుపే గెలుపు. మనుష్యులు రావణుని పెద్ద చిత్రాన్ని ఎంతో ఖర్చు చేసి తయారుచేస్తారు. మళ్ళీ ఒక్క రోజులోనే కాల్చేస్తారు. రావణుడు శత్రువు కదా! ఇది బొమ్మలాట వంటిది. శివబాబా చిత్రాన్నికూడా తయారుచేసి పూజించి మళ్ళీ విరిపేస్తారు. అలాగే దేవీల చిత్రాలు కూడా తయారుచేసి ముంచేస్తారు. ఏ మాత్రము అర్థము చేసుకోలేరు. ఇప్పుడు పిల్లలైన మీరు అనంతమైన చరిత్ర-భూగోళాలు తెలుసుకున్నారు. ఈ ప్రపంచ చక్రము ఎలా తిరుగుతుందో మీకు తెలుసు. సత్య-త్రేతా యుగాల గురించి ఎవ్వరికీ తెలియదు. దేవతల చిత్రాలను కూడా నిందించే విధంగా తయారుచేశారు.

తండ్రి అర్థము చేయిస్తున్నారు - మధురమైన పిల్లలూ, విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు తండ్రి మీకు ఏ పత్యమునైతే తెలియజేశారో ఆ పత్యములో ఉండండి. స్మృతిలో ఉండి భోజనము తయారుచేయండి. స్మృతిలో ఉండి తినండి. తండ్రియే స్వయంగా చెప్తున్నారు - నన్ను స్మృతి చేసినట్లయితే మళ్ళీ విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇప్పుడు తండ్రి కూడా మళ్ళీ వచ్చి ఉన్నారు. మీరిప్పుడు పూర్తి విశ్వానికి అధికారులుగా అవ్వాలి. అందుకొరకు ఫాలో ఫాదర్-మదర్. కేవలం ఫాదర్ ఒక్కరే ఉండరు. సన్యాసులు మనమందరము తండ్రులమే అని చెప్తారు. ఆత్మయే పరమాత్మ అని అంటారు కానీ అది తప్పు. ఇక్కడ తల్లి-తండ్రి ఇద్దరూ పురుషార్థము చేస్తున్నారు. తల్లిదండ్రులను ఫాలో చేయండి అనే మాట కూడా ఇక్కడికి చెందినదే. ఎవరైతే విశ్వానికి యజమానులుగా, పవిత్రులుగా ఉండేవారో వారిప్పుడు అపవిత్రంగా ఉన్నారు. మళ్ళీ పవిత్రంగా అవుతున్నారు. మనము కూడా వారి శ్రీమతముపై నడిచి ఈ పదవిని పొందుతాము. వారు ఇతని ద్వారా డైరెక్షన్ ఇస్తున్నారు, దానిపై నడుచుకోవాలి. ఫాలో చేయకుండా కేవలం బాబా-బాబా అంటూ నోరు తీపి చేసుకుంటారు. ఫాలో చేసేవారిని సుపుత్రులని అంటారు కదా! మమ్మా-బాబాలను ఫాలో చేయడం వలన మనము రాజ్యములోకి వెళ్తాము. ఇది అర్థము చేసుకోవలసిన విషయము. తండ్రి కేవలము - నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని చెప్తారు. 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ అపవిత్రంగా ఎలా అయ్యారో, ఇతరులు ఎవరికైనా ఇది అర్థం చేయించండి. ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా తయారవ్వాలి. ఎంత స్మృతి చేస్తారో అంత పవిత్రంగా అవుతూ ఉంటారు. ఎక్కువ స్మృతి చేసేవారే క్రొత్త ప్రపంచములో మొట్టమొదట వస్తారు. ఇతరులను కూడా మీ సమానంగా తయారుచేయాలి. ప్రదర్శినీలో అర్థము చేయించేందుకు మమ్మా-బాబాలు వెళ్ళరు. బయట నుండి ఎవరైనా గొప్ప మనుష్యులు వస్తే, ఎవరు వచ్చారో చూసేందుకు చాలా మంది వెళ్తారు. వీరు గుప్తంగా ఉన్నారు. తండ్రి అంటున్నారు - నేను ఈ బ్రహ్మా తనువు ద్వారా మాట్లాడ్తాను, ఈ బిడ్డకు నేను బాధ్యుడను. మీరు సదా శివబాబాయే మాట్లాడున్నారని, వారే చదివిస్తున్నారని భావించండి. మీరు శివబాబాను చూడాలే కానీ వీరిని చూడకూడదు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి అయిన పరమాత్మను స్మృతి చేయండి. మనము ఆత్మలము, పాత్ర అంతా ఆత్మలోనే నిండి ఉంది. ఈ జ్ఞానము బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. కేవలం ప్రాపంచిక విషయాలే బుద్ధిలో ఉంటే వారేమీ అర్థము తెలుసుకోలేదని, పూర్తి హీనంగా ఉన్నారని భావించండి. కాని అలాంటి వారికి కూడా కళ్యాణము చెయ్యాల్సిందే. వారు స్వర్గములోనికైతే వెళ్తారు. కానీ ఉన్నతమైన పదవిని పొందలేరు. శిక్షలు పొంది వెళ్తారు. ఉన్నతమైన పదవిని ఎలా పొందాలో తండ్రి అర్థం చేయించారు - ఒకటి స్వదర్శన చక్రధారులుగా అయి ఇతరులను తయారుచేయండి, పక్కా యోగిగా అయి ఇతరులను కూడా తయారుచేయండి. తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి. కానీ మీరు మర్చిపోతున్నామని అంటారు. అలా అనేందుకు సిగ్గువేయడం లేదా! చాలామంది సత్యము చెప్పరు. చాలామంది మర్చిపోతారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఎవరు వచ్చినా వారికి తండ్రి పరిచయమునివ్వండి. ఇప్పుడు 84 జన్మల చక్రము పూర్తి అవుతుంది. తిరిగి ఇంటికి వెళ్లాలి. రాముడు పోయాడు, రావణుడు పోయాడు... దీని అర్థము చాలా సులభము. తప్పకుండా రాముని పరివారము, రావణుని పరివారము ఇరువురూ ఉన్న సంగమయుగమే అయి ఉంటుంది. అంతా వినాశనమైపోతుంది, కొంతమంది మాత్రమే మిగిలి ఉంటారని కూడా మీకు తెలుసు. మీకు రాజ్యము ఎలా లభిస్తుందో అది కూడా ఇక కొంత కాలము గడిస్తే, మీకే అర్థమవుతుంది. ముందే అన్నీ చెప్పరు కదా. అలా చెప్తే అది ఆట ఎలా అవుతుంది? మీరు సాక్షిగా ఉండి చూస్తూ ఉండాలి. సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. 84 జన్మల చక్రమును గురించి ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు.

ఇప్పుడు మనము తిరిగి వెళ్తున్నామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. రావణుని రాజ్యము నుండి శెలవు లభిస్తుంది. మళ్ళీ మన రాజధానిలోనికి వస్తాము. ఇక కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది కదా. అనేకసార్లు ఈ చక్రములో తిరిగారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - ఏ కర్మ బంధనములో చిక్కుకున్నారో, దానిని మర్చిపోండి. గృహస్థ వ్యవహారములో ఉంటూ మర్చిపోతూ వెళ్ళండి. ఇప్పుడు నాటకము పూర్తి అవుతుంది. మన ఇంటికి వెళ్లాలి. ఈ మహాభారత యుద్ధము తర్వాతనే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. అందుకే తండ్రి అంటున్నారు - గేట్ వే టు హెవెన్ అనే పేరు చాలా బాగుంది. యుద్ధాలు ఎప్పటి నుండో జరుగుతూనే ఉన్నాయి అని కొందరంటారు. అప్పుడు వారికి చెప్పండి - మిస్సైల్స్ యుద్ధము ఎప్పుడు జరిగింది? మిస్సైల్స్ తో జరిగే ఈ యుద్ధము అంతిమ యుద్ధము. 5 వేల సంవత్సరాల క్రితము యుద్ధము జరిగినప్పుడు కూడా ఈ యజ్ఞము రచింపబడింది. ఈ పురాతన ప్రపంచము ఇప్పుడు వినాశనమవుతుంది. నూతన రాజధాని స్థాపనవుతూ ఉంది.

మీరు రాజ్య పదవి తీసుకునేందుకు ఈ ఆత్మిక చదువును చదువుతున్నారు. మీది ఆత్మిక వ్యాపారము. భౌతిక చదువులు పనికి రావు. శాస్త్రాలు కూడా పనికి రావు. కనుక ఈ వ్యాపారములో ఎందుకు నిమగ్నమవ్వకూడదు? తండ్రి మనలను విశ్వానికి యజమానులుగా చేస్తారు. ఏ చదువులో నిమగ్నమవ్వాలో ఆలోచించండి. వారు కొన్ని డిగ్రీల కొరకు చదువుతారు. కానీ మీరు రాజ్యము కొరకు చదువుతున్నారు. రాత్రి, పగలుకు ఉన్నంత తేడా ఉంది కదా. ఆ చదువు ద్వారా శనగలైనా లభిస్తాయో లేదో తెలియదు. ఎవరైనా శరీరము వదిలేస్తే వారికి ఆ శెనగలు కూడా పోతాయి. కానీ ఈ సంపాదన మీ తోడుగా వస్తుంది. మృత్యువు తలపై నిలబడి ఉంది. దానికి ముందే మనము పూర్తి సంపాదనను జమ చేసుకోవాలి. ఈ సంపాదన చేసుకుంటూ, చేసుకుంటూ ఈ ప్రపంచమే వినాశనమయ్యేది ఉంది. మీ చదువు పూర్తి అయినప్పుడే వినాశనము జరుగుతుంది. మానవమాత్రులందరి పిడికిలిలో శనగలున్నాయి. వాటిని కోతుల వలె వదలకుండా పట్టుకొని కూర్చొని ఉన్నారు. కానీ మీరిప్పుడు రత్నాలు తీసుకుంటున్నారు. ఈ శెనగలపై మమకారము వదిలేయండి. బాగా అర్థము చేసుకున్నప్పుడే శెనగల పిడికిలి వదిలేస్తారు. ఇదంతా బూడిద అవ్వవలసిందే. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఆత్మిక చదువును చదవాలి, ఇతరులతో కూడా చదివించాలి. అవినాశి జ్ఞాన రత్నాలతో మీ పిడికిలి నింపుకోవాలి. శెనగల వెనుక సమయము పోగొట్టుకోరాదు.

2. ఇప్పుడు నాటకము పూర్తి అవుతుంది. అందువలన స్వయాన్ని కర్మ బంధనాల నుండి ముక్తులుగా చేసుకోవాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి, ఇతరులను కూడా తయారుచేయాలి. తల్లిదండ్రులను అనుసరించి, రాజ్య పదవికి అధికారులుగా అవ్వాలి.

వరదానము:-

హద్దులోని అన్ని కోరికలను త్యాగం చేసే సత్యమైన తపస్వీమూర్త్ భవ

హద్దు కోరికలను త్యాగము చేసి సత్యాతి-సత్యమైన తపస్వీ మూర్తులుగా అవ్వండి. తపస్వీ మూర్తి అనగా హద్దు కోరికల అవిద్యా రూపము. ఎవరైతే తీసుకునే సంకల్పము చేస్తారో, వారు అల్ప కాలము కొరకు తీసుకుంటారు కానీ సదాకాలము కొరకు పోగొట్టుకుంటారు. తపస్వీలుగా అవ్వడంలో విశేషంగా ఈ అల్పకాలిక కోరికలే విఘ్న రూపంగా అవుతాయి. అందువలన ఇప్పుడు తపస్వీ మూర్తులుగా అయ్యే ఋజువునివ్వండి అనగా హద్దు గౌరవ ప్రతిష్ఠలు తీసుకోవాలనే కోరికను త్యాగము చేసి విధాతలుగా అవ్వండి. విధాతల సంస్కారము ఎమర్జ్ అయినప్పుడు ఇతర అన్ని సంస్కారాలు స్వతహాగా అణిగిపోతాయి.

స్లోగన్:-

కర్మ ఫలము కావాలనే సూక్ష్మ కోరిక పెట్టుకోవడం కూడా ఫలాన్ని పరిపక్వం అవ్వకముందే తిన్నట్లవుతుంది.