02-04-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - ఆత్మలైన మీతో తండ్రి ఆత్మిక సంభాషణ చేస్తారు. 21 జన్మలకు మీ జీవితాన్ని భీమా(ఇన్ష్యూర్) చేసుకునేందుకు మీరు తండ్రి వద్దకు వచ్చారు. మీరు అమరులుగా అయ్యే విధంగా మీ జీవితము ఇన్ష్యూర్ చేయబడుతుంది"

ప్రశ్న:-

మనుష్యులు కూడా తమ జీవితాన్ని ఇన్ష్యూర్ చేస్తారు మరియు పిల్లలైన మీరు కూడా ఇన్ష్యూర్ చేస్తారు, రెండిటికి గల వ్యత్యాసము ఏమిటి?

జవాబు:-

తాము చనిపోయిన తర్వాత తమ పరివారానికి ధనము లభించాలని మనుష్యులు తమ జీవితాన్ని ఇన్ష్యూర్ చేస్తారు. పిల్లలైన మీరు 21 జన్మలు మరణమే రాకూడదని, అమరులైపోవాలని ఇన్ష్యూర్ చేస్తారు. సత్యయుగములో ఎలాంటి ఇన్ష్యూరెన్స్ కంపెనీలు ఉండవు. ఇప్పుడు మీరు మీ జీవితాన్ని ఇన్ష్యూర్ చేసేస్తారు, ఆ తర్వాత ఇక మరణమే ఉండదు, ఈ సంతోషము ఉండాలి.

గీతము:-

ఈరోజు ఉదయమే ఎవరు వచ్చారు... (యహ్ కౌన్ ఆయా ఆజ్ సవేరే...)

ఓంశాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు, తండ్రి ఇప్పుడు మనకు 21 జన్మలకే కాదు, 40-50 జన్మలకు ఇన్ష్యూర్ చేస్తున్నారని మీకు తెలుసు. మనుష్యులు మరణిస్తే వారి పరివారానికి ధనము లభించాలని వారు ఇన్ష్యూర్ చేస్తారు. కానీ మీరు 21 జన్మలు మరణమే లేకుండా ఉండేందుకు ఇన్ష్యూర్ చేస్తారు. అమరులుగా చేస్తారు కదా. మీరు అమరులుగా ఉండేవారు. మూలవతనము కూడా అమరలోకమే. అక్కడ జనన-మరణాలు ఉండవు. అది ఆత్మల నివాసస్థానము. ఇప్పుడు ఈ ఆత్మిక సంభాషణ తండ్రి తమ పిల్లలతో చేస్తారు. ఇతరులెవ్వరితోనూ చేయరు. ఏ ఆత్మలైతే స్వయాన్ని తెలుసుకున్నారో వారితోనే మాట్లాడుతారు. మిగిలిన వారెవ్వరూ తండ్రి భాషను అర్థము చేసుకోలేరు. ప్రదర్శనీకి ఎంతోమంది వస్తారు, వారేమైనా మీ భాషను అర్థము చేసుకుంటారా! చాలా కష్టము మీద కొద్దిగా మాత్రమే అర్థము చేసుకుంటారు. మీకు కూడా అర్థం చేయిస్తూ చేయిస్తూ ఎన్ని సంవత్సరాలు గడచిపోయాయి, అయినా చాలా కొద్దిమంది మాత్రమే అర్థము చేసుకున్నారు. ఒక్క సెకెండులో అర్థము చేసుకునే విషయాలు ఇవి. ఆత్మలైన మనము ఎవరైతే పావనంగా ఉండేవారమో, మనమే పతితంగా అయ్యాము. మళ్లీ మనమిప్పుడు పావనంగా అవ్వాలి. అందుకొరకు మధురమైన తండ్రిని స్మృతి చేయాలి. వారి కంటే మధురమైన వస్తువు ఏదీ లేదు. వారిని స్మృతి చేయడంలోనే మాయ యొక్క విఘ్నాలు వస్తూ ఉంటాయి. బాబా మనలను అమరులుగా చేసేందుకు వచ్చారని కూడా మీకు తెలుసు. పురుషార్థము చేసి అమరులుగా అయి అమరపురికి అధికారులుగా అవ్వాలి. అందరూ అమరులుగా అయితే అవుతారు. సత్యయుగాన్ని అమరలోకమని అంటారు. ఇది మృత్యులోకము. ఇది అమరకథ. అమరకథను శంకరుడు ఒక్క పార్వతికే వినిపించారని కాదు. అవన్నీ భక్తి మార్గములోని విషయాలు. పిల్లలైన మీరిప్పుడు కేవలం నా ఒక్కరి ద్వారానే వినండి. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. జ్ఞానము ఇవ్వగలిగింది నేను మాత్రమే. డ్రామా ప్లాను అనుసారంగా మొత్తం ప్రపంచమంతా తమోప్రధానమైపోయింది. అమరపురిలో రాజ్యము చేయడము – దీనినే అమర పదవి అని అంటారు. అక్కడ ఇన్ష్యూరెన్స్ కంపెనీలు మొదలైనవి ఉండవు. ఇప్పుడు మీ జీవితాన్ని ఇన్ష్యూర్ చేస్తున్నారు. మీరు ఎప్పుడూ మరణించరు. మీ బుద్ధిలో ఈ సంతోషము ఉండాలి. మేము అమరపురికి యజమానులుగా అవుతాము. కనుక అమరపురిని స్మృతి చేయవలసి వస్తుంది. అక్కడకు వయా మూలవతనము వెళ్లవలసి వస్తుంది. ఇది కూడా మన్మనాభవ అవుతుంది. మూలవతనము మన్మనాభవ, అమరపురి మధ్యాజీ భవ. ప్రతి విషయములో రెండు పదాలే వస్తాయి. మీకు అర్థమయ్యేందుకు అనేక విధాలుగా తెలియజేస్తున్నారు, అప్పుడు బుద్ధిలో కూర్చుంటుంది. ఇందులోనే అన్నింటికంటే ఎక్కువ కష్టముంది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. ఆత్మలైన మనము ఈ జన్మ తీసుకున్నాము. 84 జన్మలలో భిన్న-భిన్న నామ-రూప-దేశ-కాలాలలో తిరుగుతూ వచ్చాము. సత్యయుగములో ఇన్ని జన్మలు, త్రేతాలో ఇన్ని జన్మలు... ఇది కూడా చాలామంది పిల్లలు మర్చిపోతారు. ముఖ్యమైన విషయము - స్వయాన్ని ఆత్మగా భావించి మధురమైన తండ్రిని స్మృతి చేయడం. లేస్తూ కూర్చుంటూ ఇది బుద్ధిలో ఉంటే చాలా సంతోషముంటుంది. బాబా మళ్లీ వచ్చి ఉన్నారు. మనము ఎవరినైతే అర్థకల్పము నుండి, మీరు రండి, వచ్చి పావనంగా చేయండి అని స్మృతి చేస్తూ వచ్చామో ఆ తండ్రి వచ్చి ఉన్నారు. మూలవతనములో మరియు అమరపురి అయిన సత్యయుగంలో పావనంగా ఉంటారు. భక్తిలో మనుష్యులు ముక్తిలోకి లేక కృష్ణపురికి వెళ్లేందుకు పురుషార్థము చేస్తారు. ముక్తి అనండి, నిర్వాణధామం అనండి ఒక్కటే. అయితే సరియైన పదము వానప్రస్థము. వానప్రస్థులు పట్టణాలలోనే ఉంటారు. సన్యాసులైతే ఇళ్ళు-వాకిళ్ళు వదిలి అడవులకు వెళ్లిపోతారు. ఈ రోజుల్లోని వానప్రస్థులలో ఎలాంటి శక్తి లేదు. సన్యాసులైతే బ్రహ్మతత్వమునే భగవంతుడని అంటారు. బ్రహ్మలోకము అని అనరు. పునర్జన్మలు అయితే ఎవ్వరికీ ఆగవు అని ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు. అందరూ ఎవరి పాత్రను వారు అభినయిస్తారు. ఆవాగమనము(వచ్చుట - పోవుట) నుండి ఎప్పుడూ విడుదల అవ్వరు. ఈ సమయంలో కోట్ల కొలది మనుష్యులు ఉన్నారు. ఇంకా వస్తూ ఉంటారు, పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. తర్వాత మొదటి అంతస్థు ఖాళీ అవుతుంది. మూలవతనము మొదటి అంతస్థు. సూక్ష్మవతనము రెండవ అంతస్థు. ఇది మూడవ అంతస్థు లేక దీనిని గ్రౌండ్ ఫ్లోర్ అని కూడా అనవచ్చు. మరో అంతస్థు ఏదీ లేదు. వారు నక్షత్రాలలో కూడా ప్రపంచముందని భావిస్తారు. అలా అక్కడ ఏ ప్రపంచమూ లేదు. మొదటి అంతస్థులో ఆత్మలుంటాయి. మనుష్యులు ఉండేందుకు ఈ ప్రపంచముంది.

మీరు అనంతమైన వైరాగ్యము కలిగిన పిల్లలు. మీరు ఈ పాత ప్రపంచములో ఉంటూ కూడా ఈ కనులతో అన్నీ చూస్తున్నా చూడనట్లుండాలి. ఇది ముఖ్యమైన పురుషార్థము. ఎందుకంటే ఇవన్నీ సమాప్తమైపోతాయి. అలాగని అసలు ఈ ప్రపంచమే లేదని కాదు, తయారై ఉంది. కానీ దానిపై వైరాగ్యము కలుగుతుంది అనగా పూర్తి పాత ప్రపంచముపై వైరాగ్యము. భక్తి, జ్ఞానము, వైరాగ్యము. భక్తి తర్వాత జ్ఞానము, జ్ఞానము లభించిన తర్వాత భక్తిపై వైరాగ్యము కలుగుతుంది. బుద్ధి ద్వారా ఇది పాత ప్రపంచమని భావిస్తారు. ఇది మన అంతిమ జన్మ. ఇప్పుడు అందరూ తిరిగి వెళ్లాలి. చిన్న పిల్లలకు కూడా శివబాబా స్మృతిని ఇప్పించాలి, చెడు ఆహారపానీయాలు మొదలైన అలవాట్లు చేయించకూడదు. బాల్యములో ఏ అలవాటు చేయిస్తే అదే అలవాటుగా అయిపోతుంది. ఈ రోజులలో సాంగత్య దోషము చాలా చెడ్డగా ఉంది. మంచి సాంగత్యము తీరానికి చేరుస్తుంది, చెడు సాంగత్యము ముంచేస్తుంది. ఇది విషయ సాగరము, వేశ్యాలయము. సత్యమైనవారు ఒక్క పరమపిత పరమాత్మ మాత్రమే. భగవంతుడు ఒక్కరే అని అంటారు. వారు వచ్చి సత్యమైన విషయాలు అర్థం చేయిస్తారు. తండ్రి తెలియజేస్తున్నారు - ఓ ఆత్మిక పిల్లలూ! నేను మీ తండ్రిని, మీతో ఆత్మిక సంభాషణ చేస్తున్నాను. మీరు నన్ను పిలిచారు కదా. వారే జ్ఞానసాగరుడు, పతితపావనుడు. నూతన సృష్టిని రచించువారు. పాత సృష్టిని వినాశనము చేయిస్తారు. ఈ త్రిమూర్తి చాలా ప్రసిద్ధమైనది. అత్యంత ఉన్నతమైనవారు శివుడు. తర్వాత సూక్ష్మవతనములో బ్రహ్మా-విష్ణు-శంకరులు ఉంటారు. వారు కూడా సాక్షాత్కారములో కనిపిస్తారు ఎందుకంటే వారు పవిత్రులు కదా. వారిని చైతన్యములో ఈ కనులతో చూడలేరు. చాలా నౌధా(నవవిధములైన) భక్తి చేస్తే చూడగలరు. ఎవరైనా హనుమంతుని భక్తులుగా ఉంటే, వారికి హనుమంతుని సాక్షాత్కారము అవుతుంది. పరమాత్మ అఖండ జ్యోతి స్వరూపుడని శివుని భక్తులకు అసత్యము చెప్పారు. నేను చాలా చిన్న బిందువునని తండ్రి చెప్తున్నారు. అర్జునునికి అఖండ జ్యోతిస్వరూపము చూపించారని, అతనేమో నేను సహించలేనని చెప్పినట్లు వారు చెప్తారు. వారికి సాక్షాత్కారమైనట్లు గీతలో వ్రాయబడి ఉంది. అఖండ జ్యోతి సాక్షాత్కారము అయ్యిందని మనుష్యులు భావిస్తారు. ఇవన్నీ హృదయమును సంతోషపరచుకునే భక్తి మార్గములోని విషయాలని తండ్రి చెప్తున్నారు. నేను అఖండ జ్యోతి స్వరూపుడనని నేను ఎప్పుడూ చెప్పను. ఆత్మలైన మీరు ఎలాగైతే బిందు స్వరూపులో, నేను కూడా అలాగే ఉన్నాను. మీరు ఎలాగైతే డ్రామా బంధనములో ఉన్నారో అలాగే నేను కూడా డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నాను. ఆత్మలందరికీ ఎవరి పాత్రలు వారికి లభించి ఉన్నాయి. అందరూ పునర్జన్మలు తప్పకుండా తీసుకోవలసిందే. అందరూ నంబరువారుగా రావలసిందే. మొదటి నంబర్ కలవారు మళ్లీ క్రిందకు వెళ్తారు. తండ్రి ఎన్ని విషయాలు మనకు అర్థం చేయిస్తారు. సృష్టి చక్రము తిరుగుతూనే ఉంటుందని అర్థం చేయించారు. ఎలాగైతే పగలు తర్వాత రాత్రి వస్తుందో అలా కలియుగము తర్వాత సత్యయుగము, త్రేతా యుగము,... తర్వాత సంగమయుగము వస్తుంది. సంగమ యుగములోనే తండ్రి పరివర్తన చేస్తారు. ఎవరైతే సతోప్రధానంగా ఉండేవారో, వారే ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారు. వారు మళ్లీ సతోప్రధానంగా అవుతారు. ఓ పతితపావనా! రండి అని పిలుస్తారు కూడా. ఇప్పుడు తండ్రి మన్మనాభవ అని చెప్తున్నారు. నేను ఆత్మను, నేను తండ్రిని స్మృతి చేయాలి. దీని యథార్థమైన అర్థమును కొంతమంది మాత్రమే కష్టంగా అర్థము చేసుకుంటారు. మన ఆత్మల తండ్రి ఎంతో మధురమైనవారు. మధురమైనది ఆత్మనే కదా. శరీరమేమో నశిస్తుంది, మళ్లీ ఆ ఆత్మను పిలుస్తారు. ప్రేమ ఆత్మతోనే ఉంటుంది కదా. సంస్కారము ఉండేది ఆత్మలోనే. ఆత్మనే చదువుతుంది, వింటుంది. దేహమైతే సమాప్తమైపోతుంది. నేను ఆత్మను అమరుడిని. మరి మీరు నా కోసం ఎందుకు ఏడుస్తారు? ఏడ్వడం దేహాభిమానము కదా. మీకు దేహముపై ప్రేమ ఉంది కానీ ఆత్మపై ప్రేమ ఉండాలి. ప్రేమ అవినాశి వస్తువుపై ఉంచాలి. వినాశి వస్తువులపై ప్రేమ ఉన్నందుకే కొట్లాడుకుంటూ, గొడవపడుతూ ఉంటారు. సత్యయుగములో దేహీ అభిమానులుగా ఉంటారు. కనుక సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. అక్కడ ఏడవడం, బాధపడటం ఏదీ ఉండదు.

పిల్లలైన మీరు ఆత్మాభిమాని స్థితిని తయారు చేసుకునేందుకు చాలా అభ్యాసము చేయాలి - నేను ఆత్మను, నా సోదర ఆత్మకు తండ్రి సందేశాన్ని వినిపిస్తున్నాను... నా సోదరుడు అతని అవయువాల ద్వారా వింటున్నాడు... ఇటువంటి స్థితిని తయారు చేసుకోండి. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే, వికర్మలు వినాశనమవుతూ ఉంటాయి. స్వయాన్ని కూడా ఆత్మగా భావించండి. వారిని కూడా ఆత్మగా భావించండి. అప్పుడు అలవాటు పక్కా అయిపోతుంది. ఇది గుప్తమైన శ్రమ ఉంది. అంతర్ముఖులుగా అయి ఈ స్థితిని పక్కా చేసుకోవాలి. ఎంత సమయము లభిస్తే అంత సమయము ఇందులో వినియోగించండి. 8 గంటలు ఉద్యోగ వ్యాపారాదులు చేసుకోండి. నిద్ర కూడా చేయండి. మిగతా సమయాన్ని ఇందులో పెట్టండి. 8 గంటల వరకు చేరుకోవాలి. అప్పుడు మీకు చాలా సంతోషం ఉంటుంది. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయని పతితపావనుడైన తండ్రి చెప్తున్నారు. మీకు జ్ఞానమిప్పుడు ఈ సంగమ యుగములోనే లభిస్తుంది. మహిమ అంతా ఈ సంగమ యుగముదే ఎందుకంటే ఈ సంగమ యుగములోనే తండ్రి కూర్చుని మీకు జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. ఇందులో స్థూలమైన విషయమేదీ లేదు. మీరిప్పుడు వ్రాసేదంతా సమాప్తమైపోతుంది. వ్రాసుకున్నందుకు పాయింట్లు గుర్తుంటాయి. ఎవరి బుద్ధి అయినా తీక్షణంగా ఉంటే వారికి బుద్ధిలో స్మృతి ఉంటుంది. నంబరువారుగా ఉన్నారు కదా. ముఖ్యమైన విషయము - తండ్రిని స్మృతి చేయాలి మరియు సృష్టిచక్రమును స్మృతి చేయాలి. ఏ వికర్మలూ చేయకూడదు. గృహస్థ వ్యవహారములో కూడా ఉండాలి. తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. చెడు ఆలోచనలున్న కొంతమంది పిల్లలు అనుకుంటారు – నాకు ఫలానా ఆమె చాలా నచ్చింది, ఈమెను నేను గంధర్వ వివాహము చేసుకోవాలి అని భావిస్తారు. కానీ బంధు-మిత్రులు మొదలైనవారు చాలా విసిగిస్తున్నప్పుడు వారిని రక్షించేందుకు ఈ గంధర్వ వివాహము చేయిస్తారు. అలాగని అందరూ మేము గంధర్వ వివాహము చేసుకుంటామని అనకూడదు. వారు ఎప్పుడూ పవిత్రంగా ఉండలేరు. మొదటి రోజే వెళ్లి మురికి కాలువలో పడ్తారు. నామ రూపాలవైపు మనసు కలుగుతుంది. ఇది చాలా చెడ్డ విషయము. గంధర్వ వివాహము చేసుకోవడం పిన్నమ్మ ఇల్లు(సహజము) కాదు. ఒకరిపై ఒకరు మనసు పడితే గంధర్వ వివాహము చేయమని అంటారు. ఇందులో బంధువులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పిల్లలు పనికిరారని భావించాలి. ఎవరిపై మనసు పడ్డారో వారి నుండి దూరము చేసేయాలి లేదంటే మాట్లాడుకుంటూనే ఉంటారు. ఈ సభలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రాను రాను చాలా నియమానుసారముగా సభ జరుగుతుంది. ఇటువంటి అపవిత్ర ఆలోచనలుండే వారిని రానివ్వరు.

ఏ పిల్లలైతే ఆత్మిక సేవలో తత్పరులై ఉంటారో, ఎవరు యోగములో ఉండి సేవ చేస్తారో, వారే సత్యయుగ రాజధానిని స్థాపన చేయడంలో సహయోగులుగా అవుతారు. సేవాధారి పిల్లలకు తండ్రి ఆదేశము - విశ్రాంతి తగదు. ఎవరైతే చాలా ఎక్కువగా సేవ చేస్తారో వారు తప్పకుండా రాజు-రాణిగా అవుతారు. ఎవరెవరైతే శ్రమ చేస్తారో, తమ సమానంగా చేస్తారో, వారిలో శక్తి కూడా ఉంటుంది. డ్రామానుసారముగా స్థాపన జరిగే తీరాలి. పాయింట్లన్నీ బాగా ధారణ చేసిన తర్వాత సేవలో నిమగ్నమవ్వాలి. విశ్రాంతి తీసుకోవడం కూడా తగదు. సేవనే సేవ, అప్పుడే ఉన్నత పదవి పొందుతారు. మేఘాలు వచ్చి రిఫ్రెష్ అయి సేవ కొరకు వెళ్లిపోవాలి. మీరు చాలా సేవ చేస్తారు. మనుష్యులు వెంటనే అర్థము చేసుకునేలా రకరకాల చిత్రాలు వెలువడ్తాయి. ఈ చిత్రాలు మొదలైనవి కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి. వీటిని కూడా మన బ్రాహ్మణ కులానికి చెందినవారు బాగా అర్థము చేసుకుంటారు. తెలియజేసేవారు కూడా బాగుంటే, కొంత అర్థము చేసుకుంటారు. మంచిరీతిగా ధారణ చేసేవారిని, తండ్రిని స్మృతి చేసేవారిని, వారి ముఖము ద్వారానే తెలుసుకోవచ్చు. బాబా, మీ నుండి పూర్తి వారసత్వము తీసుకుంటాము అంటూ వారిలో ఆనంద ఢంకాలు మ్రోగుతూ ఉంటాయి. వారికి సేవ చేసేందుకు చాలా ఆసక్తి ఉంటుంది. రిఫ్రెష్ అయ్యి, ఇక సేవ చేసేందుకు పరుగెత్తుతారు. సేవ చేసేందుకు ప్రతి సేవాకేంద్రము నుండి చాలా మంది తయారవ్వాలి. మీ సేవ చాలా వ్యాపిస్తూ ఉంటుంది. చాలామంది మీతో కలుస్తూ వెళ్తారు. చివరికి ఒక రోజు సన్యాసులు కూడా వచ్చేస్తారు. ఇప్పుడైతే వారిదే రాజ్యము. వారి పాదాలపై పడ్తారు, పూజలు చేస్తారు. ఇది భూత పూజ అని తండ్రి చెప్తున్నారు. నాకైతే కాళ్ళే లేవు. కనుక పూజ కూడా చేయనివ్వను, నేను ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నాను. కనుక వీరిని భాగ్యశాలి రథమని అంటారు.

ఈ సమయంలో పిల్లలైన మీరు చాలా సౌభాగ్యశాలురు ఎందుకంటే మీరిక్కడ ఈశ్వరీయ సంతానంగా ఉన్నారు. ఆత్మలు, పరమాత్మ చాలా కాలము వేరుగా ఉన్నారనే గాయనము కూడా ఉంది. కనుక చాలాకాలము నుండి వేరుగా ఉన్నవారే వస్తారు. నేను వచ్చి వారినే చదివిస్తాను. చదివించేది కృష్ణుడని అనేందుకు వీలు లేదు. కృష్ణుడు పూర్తిగా 84 జన్మలు తీసుకుంటారు. ఇది అతని అంతిమ జన్మ. అందుకే ఇతని పేరు శ్యామసుందరుడని అంటారు. శివుడంటే ఎవరో ఎవ్వరికీ తెలియదు. ఈ విషయాలు తండ్రే స్వయంగా వచ్చి అర్థం చేయిస్తారు. నేను పరమాత్మను. పరంధామ నివాసిని. మీరు కూడా అక్కడే ఉండేవారు. నేను సుప్రీంను, పతితపావనుడను. ఇప్పుడు మీరు ఈశ్వరీయ బుద్ధిగలవారిగా అయ్యారు. ఈశ్వరుని బుద్ధిలో ఏ జ్ఞానముందో అది మీకు వినిపిస్తున్నారు. సత్యయుగములో భక్తి అనే మాటే ఉండదు. ఈ జ్ఞానము మీకిప్పుడే లభిస్తూ ఉంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అంతర్ముఖులుగా అయి మీ స్థితిని తయారు చేసుకోవాలి. నేను ఆత్మను, నా సోదరాత్మకు తండ్రి సందేశమిస్తున్నాను... అని అభ్యాసము చేయాలి. ఇలా ఆత్మాభిమానిగా అయ్యే గుప్త శ్రమ చేయాలి.

2. ఆత్మిక సేవ చేసేందుకు ఆసక్తి ఉండాలి. తమ సమానంగా చేసేందుకు శ్రమ చేయాలి. సాంగత్య దోషము చాలా చెడ్డది, దాని నుండి స్వయాన్ని కాపాడుకోవాలి. చెడు ఆహార పానీయాలను సేవించే అలవాటు చేసుకోకూడదు.

వరదానము:-

ఈశ్వరీయ సేవాధారిని అనే స్మృతి ద్వారా సహజ స్మృతిని అనుభవం చేసే సహజయోగీ భవ

ఈశ్వరీయ సేవాధారులు అనగా ఖుదా, ఆ తండ్రి ఏ సేవ ఇచ్చారో, ఆ సేవలో సదా తత్పరులై ఉండేవారు. మాకు స్వయం భగవంతుడు ఈ సేవ ఇచ్చారనే నషా సదా ఉండాలి. కార్యము చేస్తూ, ఎవరైతే కార్యమునిచ్చారో వారిని ఎప్పుడూ మర్చిపోవడం జరగదు. కనుక కర్మణా సేవలో కూడా తండ్రి ఆదేశానుసారము చేస్తున్నామనే స్మృతి ఉంటే సహజ స్మృతిని అనుభవం చేస్తూ సహజయోగులుగా అవుతారు.

స్లోగన్:-

సదా ఈశ్వరీయ విద్యార్థి జీవితమనే స్మృతి ఉంటే మాయ సమీపానికి రాలేదు.