29-04-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - మీ ఈ బ్రాహ్మణ కులము చాలా అసాధారణమైనది. బ్రాహ్మణులైన మీరే జ్ఞాన సంపన్నులు. మీకు జ్ఞానము, విజ్ఞానము మరియు అజ్ఞానముల గురించి తెలుసు"

ప్రశ్న:-

ఏ సహజ పురుషార్థముతో పిల్లలైన మీ మనసు అన్ని విషయాల నుండి తొలగుతూ ఉంటుంది?

జవాబు:-

కేవలం ఆత్మిక కర్తవ్యములో తత్పరులవ్వండి. ఎంతెంతగా ఆత్మిక సేవ చేస్తూ ఉంటారో, అంతగా ఇతర విషయాల నుండి స్వతహాగా మనసు తొలగుతూ ఉంటుంది. రాజ్యాన్ని తీసుకునే పురుషార్థములో లగ్నమైపోతారు. కానీ ఆత్మిక సేవతో పాటు మీరు రచించిన రచనను కూడా సంభాళించాలి.

గీతము:-

ఎవరైతే ప్రియునితో కలిసి ఉంటారో... (జో పియా కే సాథ్ హై...)

ఓం శాంతి. ప్రియుడు అని తండ్రిని అంటారు. ఇప్పుడు తండ్రి ముందు పిల్లలు కూర్చుని ఉన్నారు. మేము ఏ సాధు-సన్యాసులు మొదలైనవారి ఎదుట కూర్చోలేదని పిల్లలకు తెలుసు. ఆ తండ్రి జ్ఞానసాగరులు, జ్ఞానము ద్వారానే సద్గతి కలుగుతుంది. జ్ఞానము, విజ్ఞానము, అజ్ఞానము అని అంటారు. విజ్ఞానము అనగా దేహీ-అభిమానులుగా అవ్వడం, స్మృతి యాత్రలో ఉండడం. జ్ఞానమనగా సృష్టి చక్రమును తెలుసుకోవడం. జ్ఞానము, విజ్ఞానము, అజ్ఞానం యొక్క అర్థము మనుష్యులకు అసలు తెలియదు. ఇప్పుడు మీరు సంగమయుగ బ్రాహ్మణులు. మీ ఈ బ్రాహ్మణ కులము సాటిలేనిది, దీని గురించి ఇతరులెవ్వరికీ తెలియదు. బ్రాహ్మణులు సంగమయుగములో ఉంటారనే విషయము శాస్త్రాలలో లేనే లేదు. ప్రజాపిత బ్రహ్మా ఉండి వెళ్ళారని, వారిని ఆదిదేవుడని అంటారని కూడా తెలుసు. ఆదిదేవీ జగదంబ అనగా ఎవరో కూడా ప్రపంచానికి తెలియదు. తప్పకుండా బ్రహ్మా ముఖవంశావళికి చెందినవారే అయి ఉంటారు. వారు బ్రహ్మాకు పత్ని కాదు. దత్తత చేసుకుంటారు కదా. పిల్లలైన మిమ్మల్ని కూడా దత్తత చేసుకుంటారు. బ్రాహ్మణులను దేవతలని అనరు. ఇక్కడ బ్రహ్మా మందిరముంది, వారు కూడా మనిషే కదా. బ్రహ్మాతో పాటు సరస్వతి కూడా ఉన్నారు. దేవీల మందిరాలు కూడా ఉన్నాయి. అందరూ ఇక్కడ ఉండే మనుష్యులే కదా. అయితే ఒక్కరి మందిరము నిర్మించబడింది. ప్రజాపితకు అయితే అనేకమంది ప్రజలు ఉంటారు కదా. ఇప్పుడు తయారవుతూ ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మా కులము వృద్ధి చెందుతూ ఉంది. అందరూ దత్తత తీసుకోబడ్డ ధర్మ సంతానమే. ఇప్పుడు మిమ్మల్ని అనంతమైన తండ్రి ధర్మ సంతానంగా చేసుకున్నారు. బ్రహ్మా కూడా అనంతమైన తండ్రి కుమారుడే. ఇతనికి కూడా వారసత్వము వారి ద్వారానే లభిస్తుంది. మనవడు, మనవరాళ్ళు అయిన మీకు కూడా వారసత్వము వారి నుండే లభిస్తుంది. జ్ఞానము ఎవరి వద్దా లేనే లేదు ఎందుకంటే జ్ఞానసాగరులు ఒక్కరే. ఆ తండ్రి ఎంతవరకు రారో అంతవరకు ఎవ్వరికీ సద్గతి జరగదు. మీరిప్పుడు సద్గతి కొరకు భక్తి నుండి జ్ఞానములోకి వచ్చారు. సత్యయుగాన్ని సద్గతి అని అంటారు. కలియుగాన్ని దుర్గతి అని అంటారు ఎందుకంటే ఇది రావణ రాజ్యము. సద్గతిని రామరాజ్యమని కూడా అంటారు. సూర్యవంశీయులని కూడా అంటారు. యథార్థ పేరు సూర్యవంశీయులు, చంద్రవంశీయులు. మేమే సూర్యవంశీయులుగా ఉండేవారిమి, మళ్ళీ 84 జన్మలు తీసుకున్నామని మీకు తెలుసు. ఈ జ్ఞానము ఏ శాస్త్రాలలోనూ లేదు ఎందుకంటే శాస్త్రాలు భక్తి మార్గములోనివి. అవన్నీ వినాశనమైపోతాయి. ఇక్కడి నుండి ఆత్మలు ఏ ఏ సంస్కారాలు తీసుకెళ్తారో అక్కడ వాటితో అన్నీ తయారుచేస్తారు. మీలో కూడా రాజ్యాధికారపు సంస్కారము నింపబడుతుంది. మీరు రాజ్య పాలన చేస్తారు. విజ్ఞానవేత్తలు ఆ రాజ్యములోకి వచ్చి, వారు ఏ నైపుణ్యము నేర్చుకున్నారో ఆ పనినే చేస్తారు. సూర్యవంశ, చంద్రవంశ రాజ్యములోకి తప్పకుండా వెళ్తారు. వారిలో కేవలం సైన్సు జ్ఞానము మాత్రమే ఉంటుంది. వారు ఆ సంస్కారాన్ని తీసుకెళ్తారు. అది కూడా సంస్కారమే. వారు కూడా పురుషార్థము చేస్తారు. వారి వద్ద ఆ విద్య ఉంటుంది. మీ వద్ద ఏ ఇతర విద్య లేదు. మీరు తండ్రి నుండి రాజ్యాధికారమును తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు చేసేవారిలో ఆ సంస్కారాలు ఉంటాయి కదా. ఎంత గందరగోళంగా ఉంటుంది. కాని ఎంతవరకు వానప్రస్థ స్థితి రాదో, అంతవరకు గృహస్థ వ్యవహారాలు కూడా సంభాళిస్తూ ఉండాలి. లేకపోతే పిల్లలను ఎవరు సంభాళిస్తారు. అందరూ వచ్చి ఇక్కడ ఎలా ఉంటారు? ఈ సేవలో పూర్తిగా నిమగ్నమవుతే, అప్పుడు దాని నుండు విడుదల అవ్వవచ్చు అని అంటారు. మీ రచనను కూడా తప్పకుండా సంభాళించాల్సి ఉంటుంది. ఎవరైనా మంచి రీతిగా ఆత్మిక సేవలో నిమగ్నమవుతే అందరి నుండి స్వతహాగానే వారి మనసు తొలగిపోతుంది. ఈ ఆత్మిక సేవకు ఎంత సమయం ఇవ్వగలిగితే అంత మంచిదని భావిస్తారు. పతితుల నుండి పావనంగా అయ్యే దారి తెలిపేందుకు తండ్రి వచ్చారు, కనుక పిల్లలు కూడా ఈ సేవ చేయాలి. ప్రతి ఒక్కరి లెక్కాచారాన్ని చూడటం జరుగుతంది. అనంతమైన తండ్రి కేవలం పతితుల నుండి పావనంగా అయ్యేందుకు మతమునిస్తారు, వారు పావనంగా అయ్యే మార్గమునే తెలుపుతారు. అయితే పాలన, పోషణ చేయడం, సలహాలు ఇవ్వడం ఇవన్నీ ఇతని కర్తవ్యాలు. శివబాబా చెప్తున్నారు, వ్యాపార, ఉద్యోగ విషయాలేవీ నన్ను అడగరాదు. పతితుల నుండి పావనంగా చేసేందుకు రండి అని మీరు నన్ను పిలిచారు, కనుక నేను ఇతని ద్వారా మిమ్మల్ని పావనంగా చేస్తున్నాను. ఇతను కూడా తండ్రే. ఇతని మతమును అనుసరించాల్సి ఉంటుంది. వారిది ఆత్మిక మతము. ఇతనిది భౌతిక మతము. ఇతనిపై కూడా ఎంత బాధ్యత ఉంటుంది. ఈ బ్రహ్మా కూడా శివబాబా ఒక్కరినే స్మృతి చేయాలన్నది తండ్రి ఆజ్ఞ అని చెప్తారు. తండ్రి మతమును అనుసరించండి. అయితే పిల్లలు ఏదైనా అడగాలనుకుంటే, ఉద్యోగ-వ్యాపారాదులలో ఎలా నడుచుకోవాలో అడగవలసి వస్తే, ఆ విషయాలను ఈ సాకార బాబా చాలా బాగా అర్థం చేయించగలరు, వీరు అనుభవి, నేను ఇలా-ఇలా చేస్తుంటాను అని వీరు చెప్తూ ఉంటారు. ఇతనిని చూసి అందరూ నేర్చుకోవాలి. ఇతను నేర్పిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇతను అందరికంటే ముందు ఉన్నారు. తుఫానులన్నీ మొదట ఇతని వద్దకే వస్తాయి కనుక అందరికంటే బలశాలి ఇతనే. అందుకే ఇతను ఉన్నతమైన పదవిని కూడా పొందుతారు. మాయ బలశాలిగా అయ్యి యుద్ధము చేస్తుంది. ఇతను వెంటనే ఒక్క క్షణములో అన్నీ వదిలేశారు. ఇతనికి ఆ పాత్ర ఉన్నది. బాబా ఇతనితో అలా చేయించారు. చేసేవారు చేయించేవారు వారే కదా. సాక్షాత్కారమైన వెంటనే సంతోషంగా సర్వస్వమూ వదిలేశారు. ఇప్పుడు మేము విశ్వానికి యజమానులుగా అవుతాము. విలువలేని ఈ వస్తువులను మేము ఏం చేసుకుంటాము? వినాశన సాక్షాత్కారము కూడా చేయించారు. ఈ పాత ప్రపంచము వినాశనమవుతుందని అర్థము చేసుకున్నారు. రాజ్య పదవి మళ్ళీ లభిస్తుందని తెలుసుకున్న వెంటనే అన్నీ వదిలేశారు. ఇప్పుడు తండ్రి మతమును అనుసరించాలి. తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేయండి. డ్రామానుసారముగా భట్టీ తయారవ్వవలసి ఉన్నది. ఇంతమంది ఎందుకు పారిపోయి వచ్చారో మనుష్యులకు అర్థం కాదు. ఇతనేమీ సాధు సన్యాసి కాదు. ఇతను చాలా సాధారణ వ్యక్తి. ఇతను ఎవ్వరినీ బలవంతంగా తీసుకుపోలేదు. కృష్ణునికి ఏ చరిత్రా లేదు. మనుష్యమాత్రులకు ఏ మహిమా లేదు. మహిమ అంతా ఒక్క తండ్రిదే. అంతే. ఆ తండ్రే వచ్చి అందరికీ సుఖమునిస్తారు. మీతో మాట్లాడుతారు. మీరు ఇక్కడ ఎవరి వద్దకు వచ్చారు? మీ బుద్ధి అక్కడకు కూడా వెళ్తుంది, ఇక్కడకు కూడా వస్తుంది. ఎందుకంటే అక్కడ నివసించే శివబాబా ఇప్పుడు ఇతనిలో వచ్చారని తెలుసు. తండ్రి నుండి మనకు స్వర్గ వారసత్వము లభించనున్నది. కలియుగము తర్వాత స్వర్గము తప్పకుండా వస్తుంది. కృష్ణుడు కూడా తండ్రి నుండి వారసత్వము తీసుకొని వెళ్ళి రాజ్య పాలన చేస్తారు. ఇందులో చరిత్ర మాటే లేదు. రాజు వద్ద రాకుమారుడు జన్మిస్తాడు, పాఠశాలకు వెళ్ళి చదువుకొని పెద్దవాడైన తర్వాత సింహాసనాన్ని తీసుకుంటాడు, అంతే. ఇందులో మహిమ లేక చరిత్ర యొక్క మాటేదీ లేదు. ఉన్నతాతి ఉన్నతమైనవారు ఒక్క తండ్రి మాత్రమే. మహిమ కూడా వారిదే జరుగుతుంది! ఇతను కూడా వారి పరిచయమునే ఇస్తారు. శివబాబా, నేను చెప్తున్నానని చెప్తే మనుష్యులు ఇతను చెప్తున్నట్లు భావిస్తారు. ఈ విషయాలు పిల్లలైన మీరు అర్థము చేసుకుంటారు. మనుష్యులను ఎప్పుడూ భగవంతుడని అనరు. వారు ఒక్క నిరాకారుడే. పరంధామములో ఉంటారు. మీ బుద్ధి పైకి కూడా వెళ్తుంది, మళ్ళీ క్రిందకు కూడా వస్తుంది.

బాబా దూరదేశము నుండి పరాయి దేశములోకి వచ్చి మనల్ని చదివించి వెళ్ళిపోతారు. నేను ఒక్క సెకెండులో వస్తానని, నాకు సమయము పట్టదని వారే స్వయంగా చెప్తున్నారు. ఆత్మ కూడా ఒక్క సెకెండులో ఒక శరీరాన్ని వదిలి మరో శరీరములోకి వెళ్తుంది. ఆత్మను ఎవ్వరూ చూడలేరు. అది చాలా తీక్షణమైనది. సెకెండులో జీవన్ముక్తి అనే మహిమ కూడా ఉంది. రావణ రాజ్యాన్ని జీవన బంధన రాజ్యమని అంటారు. పుత్రుడు జన్మిస్తూనే తండ్రి వారసత్వం లభిస్తుంది. మీరు కూడా తండ్రిని గుర్తించారు, స్వర్గానికి అధికారులుగా అయ్యారు. అయితే అందులో పదవులు, పురుషార్థానుసారముగా నంబరువారుగా ఉంటాయి. తండ్రి చాలా బాగా అర్థము చేయిస్తూ ఉంటారు. ఇరువురు తండ్రులున్నారు - ఒకరేమో లౌకిక తండ్రి, మరొకరేమో పారలౌకిక తండ్రి. దుఃఖములో అందరూ స్మృతి చేస్తారు, సుఖములో ఎవ్వరూ స్మృతి చేయరు అని పాడుతూ ఉంటారు. భారతీయులమైన మనము సుఖములో ఉన్నప్పుడు స్మృతి చేయలేదని మనకు తెలుసు. మళ్ళీ మనము 84 జన్మలు తీసుకున్నాము. ఆత్మలో మలినము ఏర్పడేకొద్దీ డిగ్రీ తగ్గిపోతూ వస్తుంది. 16 కళా సంపూర్ణులుగా ఉంటారు, తర్వాత రెండు కళలు తగ్గిపోతాయి. తక్కువ మార్కులతో పాస్ అయినందుకు రాముని చేతిలో బాణము చూపించారు. అంతేకాని ధనస్సును విరుచుట మొదలైనవేవీ లేవు. బాణము గుర్తుగా ఇవ్వబడింది. ఇవన్నీ భక్తిమార్గములోని విషయాలు. భక్తిలో మనుష్యులు ఎంతగా భ్రమిస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు జ్ఞానము లభించింది. కనుక భ్రమించడం సమాప్తమైపోతుంది.

"ఓ శివబాబా!" అని అనడం, ఇది ఆర్తనాదం యొక్క పిలుపు. మీరు ఇలా పిలువరాదు. తండ్రిని స్మృతి చేయాలి. మొరపెట్టుకుంటే అది భక్తిలోని అంశమైపోతుంది. ఓ భగవంతుడా అని పిలవడం కూడా భక్తి యొక్క అలవాటు. ఓ భగవంతుడా అని స్మృతి చేయమని బాబా చెప్పలేదు. అంతర్ముఖులుగా అయి నన్ను స్మృతి చేయండి. స్మరణ కూడా చేయకూడదు. స్మరణ కూడా భక్తి మార్గములోని పదమే. మీకు తండ్రి పరిచయము లభించింది. ఇప్పుడు తండ్రి శ్రీమతముపై నడవండి. ఎలా అయితే లౌకిక పిల్లలు తమ దేహధారి తండ్రిని స్మృతి చేస్తారో, అలా మీరు నన్ను స్మృతి చేయండి. స్వయం దేహాభిమానములో ఉండడం వలన దేహధారి తండ్రినే స్మృతి చేస్తారు. పారలౌకిక తండ్రి అయితే దేహీ అభిమాని. ఇతనిలో వచ్చినా వారు దేహాభిమానులుగా అవ్వరు. మీకు జ్ఞానమిచ్చేందుకు నేను ఇది అప్పుగా తీసుకున్నానని చెప్తున్నారు. నేను జ్ఞానసాగరుడను కానీ జ్ఞానమెలా ఇవ్వాలి? మీరు గర్భములో ప్రవేశిస్తారు, నేను గర్భములో ప్రవేశించను. నా గతి, మతము భిన్నమైనవి. తండ్రి ఇతనిలో వస్తారు. ఇది ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మా ద్వారా స్థాపన అని అంటారు కూడా. అయితే బ్రహ్మా ద్వారా స్థాపన ఎలా చేస్తారు? ప్రేరణ ఏమైనా ఇస్తారా? నేను సాధారణ శరీరములో వస్తానని తండ్రి చెప్తున్నారు. అతనికి బ్రహ్మా అని పేరు పెడ్తాను ఎందుకంటే సన్యసిస్తారు కదా.

ఇప్పుడే బ్రాహ్మణుల మాల తయారవ్వలేదని పిల్లలైన మీకు తెలుసు ఎందుకంటే వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడైతే బ్రాహ్మణులు ఫైనల్ గా తయారవుతారో అప్పుడు రుద్రమాల తయారవుతుంది. తర్వాత విష్ణుమాలలోకి వెళ్తారు. మాలలో వచ్చేందుకు స్మృతియాత్ర చేయాలి. మనమే మొదట సతోప్రధానంగా ఉండేవారమని తర్వాత సతో, రజో, తమోలోకి వస్తామని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. హమ్ సో కు కూడా అర్థముంది కదా. ఓం యొక్క అర్థము వేరు. ఓం అనగా ఆత్మ. ఆ ఆత్మనే - నేనే దేవత, క్షత్రియ... అని చెప్తుంది. అయితే వారు హమ్ సో కు అర్థము ఆత్మనే పరమాత్మ అని చెప్తారు. ఓం అనే పదానికి, హమ్ సో అనే పదానికి మీరు చెప్పే అర్థాలు పూర్తిగా వేరు. మనము ఆత్మలము, వివిధ వర్ణాలలోకి వస్తాము. మొదట దేవతలు, క్షత్రియులుగా అవుతాము. అంతేకాని ఆత్మనే పరమాత్మ కాదు. పూర్తి జ్ఞానము లేనందుకు అర్థమును తికమక చేసేశారు. అహమ్ బ్రహ్మస్మి అని అనడం కూడా తప్పే. తండ్రి చెప్తున్నారు, నేను రచనకు యజమానిగా అవ్వను. ఈ రచనకు యజమానులు మీరే. విశ్వానికి కూడా మీరే యజమానులుగా అవుతారు. బ్రహ్మము అనేది ఒక తత్వము. ఆత్మలైన మీరు ఈ రచనకు యజమానులుగా అవుతారు. ఇప్పుడు తండ్రి మీకు అన్ని వేద శాస్త్రాల యథార్థ అర్థాన్ని కూర్చుని వినిపిస్తున్నారు. ఇప్పుడిక చదువుకుంటూ ఉండాలి. తండ్రి మీకు కొత్త కొత్త విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. భక్తి ఏం చెప్తుందో, జ్ఞానము ఏం చెప్తుందో వివరిస్తారు. భక్తి మార్గములో మందిరాలు కట్టించారు, జప-తపాలు చేశారు, ఇలా ధనమును నాశనము చేశారు. మీ మందిరాలను చాలా మంది లూటీ చేశారు, ఇది కూడా డ్రామాలోని పాత్ర. మళ్ళీ వారి నుండే తిరిగి లభిస్తుంది. ఇప్పుడు ఎంత ఇస్తున్నారో చూడండి. రోజురోజుకూ పెంచుతూ ఉంటారు. వీరు కూడా తీసుకుంటూ ఉంటారు. వారెంత తీసుకున్నారో, అదంతా పూర్తిగా ఇచ్చేస్తారు. మీ ధనము ఏదైతే తిన్నారో, అది అలా జీర్ణించుకోలేరు. భారతదేశము అవినాశి ఖండము కదా. తండ్రి జన్మ స్థానము. తండ్రి ఇక్కడే వస్తారు. తండ్రి జన్మించిన దేశము నుండే తీసుకుపోతే తిరిగి ఇవ్వవలసి వస్తుంది. సమయానికి ఎలా లభిస్తుందో చూడండి. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. వినాశనము ఎప్పుడు వస్తుందో వారికి మాత్రము తెలియదు. ప్రభుత్వము వారు కూడా ఈ విషయాలు అంగీకరించరు. డ్రామాలో రచింపబడి ఉంది, అప్పు తీసుకుంటూనే ఉంటారు, అనగా తిరిగి వస్తుంది. మన రాజధాని నుండి చాలా ధనము తీసుకెళ్ళారని మీకు తెలుసు. అది మళ్ళీ ఇస్తున్నారు. మీకు ఏ విషయానికీ చింత లేదు. కేవలం తండ్రిని స్మృతి చేయాలనే చింత మాత్రమే ఉంటుంది. స్మృతి ద్వారానే పాపాలు భస్మమవుతాయి. జ్ఞానమైతే చాలా సులభము. ఇప్పుడు ఎవరు ఎంత పురుషార్థము చేయాలో చేయండి. శ్రీమతము లభిస్తూనే ఉంటుంది. అవినాశి సర్జన్ తో ప్రతి విషయములో సలహా తీసుకోవలసి వస్తుంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎంత సమయము లభిస్తే అంత సమయము ఈ ఆత్మిక వ్యాపారము చేస్తూ ఉండాలి. ఆత్మిక వ్యాపారము చేసే సంస్కారాన్ని అలవరచుకోవాలి. పతితులను పావనంగా చేసే సేవ చేయాలి.

2. అంతర్ముఖులుగా అయి తండ్రిని స్మృతి చేయాలి. నోటి నుండి ఓ భగవంతుడా అనే పదము రాకూడదు. ఎలాగైతే తండ్రికి అహంకారము లేదో, అలా మీరు కూడా నిరహంకారులుగా అవ్వాలి.

వరదానము:-

సంఘటిత రూపంలో ఏకరస స్థితిని అభ్యాసము చేయడం ద్వారా విజయ ఢంకాను మోగించే ఎవర్రెడీ భవ.

ఎప్పుడైతే అందరి యొక్క అన్ని సంకల్పాలు ఒకే సంకల్పంలో ఇమిడిపోతాయో అప్పుడు విశ్వంలో విజయ ఢంకా మోగుతుంది. సంఘటిత రూపంలో ఒక్క సెకండులో ఎప్పుడైతే అందరూ ఏకరస స్థితిలో స్థితులవుతారో అప్పుడు ఎవర్రెడీ అని అంటారు. ఒక్క సెకండులో ఏక మతము, ఏకరస స్థితి మరియు ఒకే సంకల్పంలో స్థితి అయ్యేందుకు గుర్తుగా వ్రేలిని చూపించారు. ఈ వేలుతో కలియుగ పర్వతము ఎత్తబడుతుంది. అందువలన సంఘటిత రూపంలో ఏకరస స్థితిని తయారుచేసుకునే అభ్యాసము చేయండి. అప్పుడే విశ్వములో శక్తి సైన్యము ప్రసిద్ధి చెందుతుంది.

స్లోగన్:-

శ్రేష్ఠ పురుషార్థములో అలసట రావడం - ఇది కూడా సోమరితనానికి గుర్తు.