25-04-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - ప్రతి ఒక్కరి నాడిని చూసి, మొదట వారికి అల్ఫ్ (భగవంతుని) పై నిశ్చయం కలిగించండి, తర్వాత ముందుకెళ్లండి, భగవంతునిపై నిశ్చయము కలిగించకుండా జ్ఞానమివ్వడం సమయాన్ని వ్యర్థము చేసినట్లవుతుంది"

ప్రశ్న:-

ఏ ఒక్క ముఖ్యమైన పురుషార్థము స్కాలర్ షిప్ తీసుకునేందుకు అధికారులుగా చేస్తుంది?

జవాబు:-

అంతర్ముఖత. మీరు చాలా అంతర్ముఖులుగా ఉండాలి. తండ్రి అయితే కళ్యాణకారి. కళ్యాణము కొరకే సలహానిస్తారు. అంతర్ముఖులుగా ఉండే యోగీ పిల్లలు, ఎప్పుడూ దేహాభిమానములోకి వచ్చి అలగరు లేక గొడవపడరు. వారి నడవడిక చాలా రాయల్ గా, గౌరవయుక్తంగా ఉంటుంది. చాలా తక్కువగా మాట్లాడతారు, యజ్ఞ సేవలో అభిరుచి కలిగి ఉంటారు. వారు జ్ఞానమును ఎక్కవగా మాట్లాడరు, స్మృతిలో ఉండి సేవ చేస్తారు.

ఓంశాంతి. ప్రదర్శని సేవ గురించి వచ్చిన సమాచారాలను పరిశీలిస్తే, తండ్రి పరిచయమునిచ్చే ముఖ్య విషయమేదైతే ఉందో, దానిపై పూర్తి నిశ్చయము కలిగించకపోతే, మిగిలిన విషయాలేవైనా అర్థం చేయించినా, అవి ఎవరి బుద్ధిలోనైనా కూర్చోవడం కష్టము. వారు బాగుంది-బాగుంది అని అంటారు కాని వారికి తండ్రి పరిచయము లేదు. మొదట తండ్రి పరిచయముండాలి. తండ్రి మహావాక్యము - నన్ను స్మృతి చేయండి, పతితపావనుడను నేనే. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పతితుల నుండి పావనంగా అవుతారు. ఇదే ముఖ్యమైన విషయము. భగవంతుడు ఒక్కరే, వారే పతితపావనులు. వారు జ్ఞానసాగరులు, సుఖసాగరులు. వారే ఉన్నతాతి ఉన్నతమైనవారు. ఈ నిశ్చయము కలిగినప్పుడే, భక్తిమార్గములోని శాస్త్రాలు, వేదాలు మరియు గీతా భాగవతములన్నీ ఖండింపబడ్తాయి. భగవంతుడు స్వయంగా చెప్తున్నారు, వీటిని నేను వినిపించలేదు. నా జ్ఞానము శాస్త్రాలలో లేదు. అదంతా భక్తిమార్గపు జ్ఞానము. నేను జ్ఞానమునిచ్చి, సద్గతి చేసి వెళ్ళిపోతాను. తర్వాత ఈ జ్ఞానము ప్రాయఃలోపమైపోతుంది. జ్ఞాన ప్రాలబ్ధము పూర్తి అయిన తర్వాత మళ్ళీ భక్తి మార్గము ప్రారంభమవుతుంది. తండ్రిపై నిశ్చయము కలిగితే, భగవానువాచ - ఇవన్నీ భక్తిమార్గములోని శాస్త్రాలని వారికి అర్థమవుతుంది. జ్ఞానము మరియు భక్తి సగం-సగం నడుస్తుంది. భగవంతుడు వచ్చినప్పుడు వారి పరిచయమును ఇస్తారు - కల్పము 5 వేల సంవత్సరాలది, నేను బ్రహ్మా నోటి ద్వారా అర్థం చేయిస్తున్నాను అని నేను చెప్తున్నాను. కనుక భగవంతుడు ఎవరు అనే ముఖ్యమైన విషయాన్ని బుద్ధిలో కూర్చోబెట్టాలి, ఈ విషయము బుద్ధిలో కూర్చోనంతవరకు ఇతర విషయాలు అర్థం చేయించినా వారిపై ఏ ప్రభావమూ ఉండదు. శ్రమ అంతా ఈ విషయములోనే ఉంది. తండ్రి సమాధుల నుండి మేల్కొలపడానికి వస్తారు. శాస్త్రాలు మొదలైనవి చదవడం ద్వారా అయితే మేల్కోరు. పరమాత్మ జ్యోతిస్వరూపులు కనుక వారి పిల్లలు కూడా జ్యోతిస్వరూపులే. కాని పిల్లలైన మీ ఆత్మలు పతితమయ్యాయి, అందువలన జ్యోతి ఆరిపోయింది. తమోప్రధానం అయిపోయారు. మొట్టమొదట తండ్రి పరిచయము ఇవ్వకపోయినట్లయితే మీరు చేసే శ్రమ, మీరు వ్రాయించే అభిప్రాయాలు మొదలైనవాటి వలన ఏ ఉపయోగమూ ఉండదు, అందుకే సేవ జరగడం లేదు. నిశ్చయముంటే తప్పకుండా బ్రహ్మా ద్వారా జ్ఞానమిస్తున్నారని అర్థము చేసుకుంటారు. మనుష్యులు బ్రహ్మాను చూసి చాలా తికమకపడ్తారు ఎందుకంటే తండ్రి పరిచయము లేదు. భక్తిమార్గము గడచిపోయిందని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. కలియుగములో భక్తిమార్గముంది. ఇప్పుడు సంగమయుగములో జ్ఞానమార్గము ఉంది. మనము సంగమయుగములో ఉన్నాము, రాజయోగము నేర్చుకుంటున్నాము. కొత్త ప్రపంచము కొరకు దైవీగుణాలు ధారణ చేస్తాము. ఎవరైతే సంగమయుగములో లేరో, వారు రోజు-రోజుకూ తమోప్రధానంగా అవుతూ ఉంటారు. అటువైపు తమోప్రధానత పెరుగుతూ ఉంటుంది, ఇటువైపు మీ సంగమయుగము పూర్తి అవుతూ ఉంటుంది. ఇవి అర్థము చేసుకునే విషయాలు కదా. అర్థం చేయించేవారు కూడా నంబరువారుగా ఉన్నారు. బాబా ప్రతి రోజు పురుషార్థము చేయిస్తారు. నిశ్చయ బుద్ధి విజయంతి. పిల్లలలో ఎక్కువగా మాట్లాడే అలవాటు చాలా ఉంది. తండ్రిని స్మృతియే చేయరు. స్మృతి చేయడం చాలా కష్టము. తండ్రిని స్మృతి చేయడం వదిలి, తమ మాటలే ఎక్కువగా వినిపిస్తూ ఉంటారు. తండ్రిపై నిశ్చయము కలిగించకుండా ఇతర చిత్రాల వైపు అసలు తీసుకెళ్లరాదు. నిశ్చయము లేకుంటే కొంచెం కూడా అర్థము చేసుకోరు. అల్ఫ్(భగవంతుని) పై నిశ్చయము లేకుంటే మిగిలిన బే, తే, (రెండవ, మూడవ) విషయాలలోకి వెళ్ళడం సమయాన్ని వృధా చేయడమే అవుతుంది. ఎవరి నాడి ఎలా ఉందో తెలుసుకోరు, ప్రారంభోత్సవము చేసేవారికి కూడా మొదట తండ్రి పరిచయమునివ్వాలి. వీరు అత్యంత ఉన్నతమైన తండ్రి,జ్ఞానసాగరుడు. తండ్రి ఈ జ్ఞానాన్ని ఇప్పుడు మాత్రమే ఇస్తారు. సత్యయుగములో ఈ జ్ఞానము అవసరముండదు. తర్వాత భక్తి ప్రారంభమవుతుంది. తండ్రి చెప్తున్నారు, దుర్గతి అనగా నన్ను నిందించే సమయము పూర్తి అయినప్పుడు నేను వస్తాను. అర్ధకల్పము వారు నిందించాల్సిందే, ఎవరిని పూజిస్తారో, వారి కర్తవ్యము తెలియదు. పిల్లలైన మీరు కూర్చొని అర్థము చేయిస్తారు. కాని స్వయానికే తండ్రితో యోగము లేకుంటే, ఇతరులకు ఏం అర్థం చేయించగలరు? శివబాబా అని నోటితో అంటున్నా కానీ పిల్లలు యోగమే చేయకుంటే వికర్మలు కూడా వినాశనమవ్వవు, ధారణ కూడా జరగదు. ముఖ్యమైన విషయము, ఒక్క తండ్రిని స్మృతి చేయడం.

ఏ పిల్లలైతే జ్ఞానయుక్త ఆత్మలతో పాటు యోగులుగా అవ్వరో, వారిలో దేహాభిమాన అంశము తప్పకుండా ఉంటుంది. యోగము లేకుండా అర్థం చేయించడం వలన ఏ ఉపయోగము లేదు. దేహాభిమానములోకి వచ్చి ఎవరో ఒకరిని విసిగిస్తూ ఉంటారు. పిల్లలు భాషణ బాగా ఇవ్వగలిగితే మేము జ్ఞాని ఆత్మలమని భావిస్తారు. తండ్రి చెప్తున్నారు, జ్ఞాని ఆత్మలే కాని యోగము తక్కువగా ఉంది, యోగము చేసేందుకు చాలా తక్కువగా పురుషార్థము చేస్తున్నారు. తండ్రి చార్టు పెట్టమని ఎంతగా అర్థం చేయిస్తారు. ముఖ్యమైనది యోగమే. జ్ఞానాన్ని అర్థం చేయించే అభిరుచి పిల్లలలో చాలా ఉంది కాని యోగము లేదు. యోగము లేకుండా వికర్మలు వినాశనమవ్వవు. మరి ఏ పదవిని పొందుతారు! యోగములో చాలా మంది పిల్లలు ఫెయిల్ అవుతున్నారు. మేము వంద శాతము ఉన్నామని భావిస్తారు. కాని రెండు శాతము మాత్రమే ఉన్నారని బాబా చెప్తున్నారు. బాబా స్వయంగా చెప్తున్నారు, భోజనము చేసే సమయములో స్మృతిలో ఉంటాను, తర్వాత మర్చిపోతాను. స్నానము చేసేటప్పుడు కూడా బాబాను స్మృతి చేస్తాను. నేను వారి కుమారుడనే, అయినా స్మృతి చేయడం మర్చిపోతుంటాను. ఈ బ్రహ్మా నంబరువన్ లో వచ్చేవారు కదా, తప్పకుండా జ్ఞానయోగాలు చాలా బాగుంటాయని అనుకుంటారు. అయినా బాబా చెప్తున్నారు, యోగములో చాలా శ్రమ ఉంది. ప్రయత్నించి చూడండి, తర్వాత అనుభవాన్ని వినిపించండి. టైలరు దుస్తులు కుడుతున్నారనుకోండి, బాబా స్మృతిలో ఉన్నానా అని పరిశీలించుకోవాలి. చాలా మధురమైన ప్రియుడు. వారిని ఎంతగా స్మృతి చేస్తామో అంత మన వికర్మలు వినాశనమవుతాయి, మనము సతోప్రధానంగా అవుతాము. నేను ఎంత సమయము స్మృతి చేస్తున్నాను అని స్వయాన్ని చూసుకోవాలి. బాబాకు ఫలితము తెలపాలి. స్మృతిలో ఉంటేనే కళ్యాణము జరుగుతుంది. అంతేగాని ఎక్కువ సేపు జ్ఞానము అర్థం చేయించడం వలన కళ్యాణము జరగదు. ఏమీ అర్థము చేసుకోరు. అల్ఫ్ (భగవంతుడు) లేకుండా పని ఎలా జరుగుతుంది? ఒక అల్ఫ్ గురించే తెలియకుంటే, అంతా బిందు, బిందు (సున్నా-సున్నా)అన్నట్లు ఉంటుంది. అల్ఫ్ తోపాటు సున్నా పెడితే లాభముంటుంది. యోగము లేకపోతే రోజంతా సమయాన్ని వ్యర్థము చేస్తూ ఉంటారు. ఇలాంటివారు ఏ పదవి పొందుతారు అని తండ్రికి జాలి కలుగుతుంది. అదృష్టంలో లేకుంటే తండ్రి మాత్రము ఏం చేస్తారు? తండ్రి అయితే పదే పదే అర్థం చేయిస్తూ ఉంటారు, దైవీగుణాలు బాగా ధారణ చేయండి, తండ్రి స్మృతిలో ఉండండి. స్మృతి చాలా అవసరము. స్మృతి పట్ల ప్రేమ ఉన్నప్పుడే, శ్రీమతముపై నడవగలరు. ప్రజలైతే అనేకమంది తయారవ్వాలి. మీరు ఈ లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకే ఇక్కడకు వచ్చారు, ఇందులో శ్రమ ఉంది. స్వర్గములోకైతే వస్తారు కానీ శిక్షలు అనుభవించి చివర్లో వచ్చి చిన్న పదవి పొందుతారు. పిల్లలందరి గురించి బాబాకు తెలుసు కదా. యోగములో కచ్చాగా ఉండే పిల్లలు దేహాభిమానములోకి వచ్చి అలుగుతూ, కొట్లాడుతూ ఉంటారు. ఎవరైతే పక్కా యోగులుగా ఉంటారో వారి నడవడిక చాలా రాయల్ గా, గౌరవప్రదంగా ఉంటుంది, చాలా తక్కువగా మాట్లాడ్తారు. యజ్ఞ సేవలో కూడా అభిరుచిని కలిగి ఉంటారు. యజ్ఞ సేవలో ఎముకలు అరిగిపోయినా లెక్కచేయరు. ఇటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు. కాని బాబా చెప్తున్నారు, స్మృతిలో ఎక్కువగా ఉంటే తండ్రిపై ప్రేమ ఉంటుంది, సంతోషంగా ఉంటారు.

తండ్రి చెప్తున్నారు, నేను భారతఖండములోనే వస్తాను. నేను వచ్చి భారతదేశాన్నే ఉన్నతంగా చేస్తాను. సత్యయుగంలో మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు, సద్గతిలో ఉండేవారు. తర్వాత మీకు దుర్గతిని కలిగించిందెవరు? (రావణుడు) ఎప్పుడు ప్రారంభమయింది? (ద్వాపరము నుండి) ఒక సెకండులో అర్ధకల్పానికి సద్గతి పొందుతారు, 21 జన్మల వారసత్వాన్ని పొందుతారు. కనుక ఎవరైనా గొప్ప వ్యక్తులు వస్తే మొట్టమొదట వారికి తండ్రి పరిచయమునివ్వండి. తండ్రి చెప్తున్నారు, పిల్లలూ, ఈ జ్ఞానము ద్వారానే మీకు సద్గతి కలుగుతుంది. ఈ డ్రామా సెకండు-సెకండు నడుస్తూ ఉందని పిల్లలైన మీకు తెలుసు. ఇది బుద్ధిలో జ్ఞాపకమున్నా మీరు బాగా స్థిరంగా ఉంటారు. ఇక్కడ కూర్చొని ఉన్నా ఈ సృష్టిచక్రము పేను వలె ఎలా తిరుగుతూ ఉంటుందని మీ బుద్ధిలో ఉండాలి. సెకండు-సెకండు టిక్-టిక్ అని జరుగుతూ ఉంటుంది. డ్రామానుసారంగానే పాత్ర అంతా నడుస్తూ ఉంది. ఒక సెకండు గతిస్తే అది సమాప్తమైపోతుంది. రోల్ అవుతూ ఉంటుంది. చాలా మెల్ల-మెల్లగా తిరుగుతూ ఉంటుంది. ఇది అనంతమైన డ్రామా. వృద్ధులు మొదలైనవారి బుద్ధిలో ఈ విషయాలు కూర్చోవు. జ్ఞానము కూడా కూర్చోదు. యోగము కూడా ఉండదు. అయినా వారు కూడా పిల్లలే కదా. అయితే సేవ చేసేవారికి ఉన్నత పదవి లభిస్తుంది, మిగిలినవారికి చిన్న పదవి లభిస్తుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇది అనంతమైన డ్రామా, చక్రము తిరుగుతూ ఉంటుంది. రికార్డు తిరుగుతూ ఉన్నట్లు తిరుగుతూ ఉంటుంది. మన ఆత్మలో కూడా ఇలాంటి రికార్డు నింపబడి ఉంది. చిన్న ఆత్మలో ఇంత పెద్ద పాత్ర నిండి ఉంది, దీనినే ప్రాకృతికము అని అంటారు. కంటికేమీ కనిపించదు. ఇది అర్థము చేసుకునే విషయము. మంద బుద్ధిగలవారు అర్థము చేసుకోలేరు. నేను ఇతని ద్వారా చెప్తూ ఉంటాను, సమయం గడుస్తూ వెళ్తుంది. మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత ఇది రిపీట్ అవుతుంది. ఇటువంటి జ్ఞానము ఇతరులెవ్వరి వద్దా లేదు. ఎవరైతే మహారథులుగా ఉంటారో, వారు క్షణ-క్షణము ఈ విషయాలపై శ్రద్ధ ఉంచి అర్థం చేయిస్తూ ఉంటారు. కనుక బాబా చెప్తున్నారు, మొట్టమొదట తండ్రి స్మృతిలో ఉండేందుకు కొంగుకు ముడి వేసుకోండి. నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. ఆత్మ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. దేహ సంబంధాలన్నీ వదిలేయాలి. సాధ్యమైనంత ఎక్కువగా తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఇది గుప్త పురుషార్థము. బాబా సలహా ఇస్తున్నారు, పరిచయము కూడా బాబాదే ఇవ్వండి. స్మృతి తక్కువగా చేస్తే పరిచయము కూడా తక్కువగా ఇస్తారు. మొదట బాబా పరిచయము బుద్ధిలో కూర్చోవాలి. పరిచయమిచ్చిన తర్వాత, వారే మా తండ్రి అని వ్రాయమని చెప్పండి. దేహ సహితముగా అన్నీ వదిలి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే మీరు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు. ముక్తిధామము, జీవన్ముక్తిధామములలో దుఃఖము, బాధలు ఉండనే ఉండవు. రోజు-రోజుకు మంచి-మంచి విషయాలు అర్థం చేయించడం జరుగుతాయి. పరస్పరములో కూడా ఈ విషయాలే మాట్లాడండి. అర్హులుగా కూడా కావాలి కదా. బ్రాహ్మణులుగా అయి తండ్రి ఇచ్చిన ఆత్మిక సేవ చేయకుంటే ఎందుకు పనికొస్తారు? చదువును మంచి రీతిగా ధారణ చేయాలి కదా. ఒక అక్షరము కూడా ధారణ కాని వారు చాలా మంది ఉన్నారని బాబాకు తెలుసు. తండ్రిని యథార్థ రీతిలో స్మృతి చేయరు. రాజా-రాణుల పదవిని పొందేందుకు చాలా శ్రమ చేయాలి. ఎవరు శ్రమ చేస్తారో వారే ఉన్నత పదవిని పొందుతారు. శ్రమ చేస్తేనే రాజ్యములోకి వెళ్ళగలరు. నంబరువన్ గా అయ్యే వారికే స్కాలర్ షిప్ లభిస్తుంది. ఈ లక్ష్మీనారాయణులు స్కాలర్ షిప్ తీసుకున్నవారు. తర్వాత నంబరువారుగా ఉన్నారు. ఇది చాలా పెద్ద పరీక్ష కదా. ఎవరైతే స్కాలర్ షిప్ తీసుకున్నారో, వారి మాలే తయారయింది. 8 రత్నాలు కదా. 8, తర్వాత 100, ఆ తర్వాత 16000. కనుక మాలలో కూర్చబడేందుకు ఎంత పురుషార్థము చేయాలి! అంతర్ముఖులుగా ఉండేందుకు పురుషార్థము చేయడం వలన స్కాలర్ షిప్ తీసుకునేందుకు అధికారులుగా అవుతారు. మీరు చాలా అంతర్ముఖులుగా ఉండాలి. తండ్రి అయితే కళ్యాణకారులు. కనుక వారు కళ్యాణము కొరకే సలహానిస్తారు. మొత్తం ప్రపంచమంతటికీ కళ్యాణము జరగాలి. కాని నంబరువారుగా ఉన్నారు. మీరిక్కడ తండ్రి వద్దకు చదువుకునేందుకు వచ్చారు. మీలో కూడా చదువుపై శ్రద్ధనుంచే వారే మంచి విద్యార్థులు. కొంతమంది అస్సలు శ్రద్ధ పెట్టరు. అదృష్టములో ఏముంటే అది లభిస్తుందని అనుకునేవారు కూడా చాలా మంది ఉన్నారు. వారికి చదువు యొక్క లక్ష్యమే ఉండదు. కనుక పిల్లలు స్మృతి చార్టునుంచాలి. మనమిప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. జ్ఞానమిక్కడే వదలి వెళ్తాము. జ్ఞానపాత్ర పూర్తయిపోతుంది. ఆత్మ ఎంత చిన్నది, కాని అందులో ఎంత పెద్ద పాత్ర ఉంది, ఇది అద్భుతము కదా. ఇదంతా అవినాశి డ్రామా. మీరు అంతర్ముఖులుగా అయి మీతో మీరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మీకు చాలా సంతోషము కలుగుతుంది - ఆత్మ ఎప్పుడూ వినాశనము కాదు అని ఇటువంటి విషయాలను తండ్రి వచ్చి వినిపిస్తున్నారు. డ్రామాలో ఒక్కొక్క మనిషికి, ఒక్కొక్క వస్తువుకు పాత్ర ఫిక్స్ అయ్యి ఉంది. దీనిని అంత్యము లేనిది అని కూడా అనరు. అంతమయితే ఉంది కానీ ఇది అనాది. ఎన్ని వస్తువులున్నాయి! దీనిని ప్రాకృతికము అని అనాలి. ఈశ్వరుని రచన అని కూడా అనకూడదు. నాకు కూడా ఇందులో పాత్ర ఉందని వారు చెప్తున్నారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. యోగములో చాలా శ్రమ ఉంది, కర్మ చేస్తున్నప్పుడు ఎంత సమయము తండ్రి స్మృతి ఉంటుందో ప్రయత్నించి చూడాలి. స్మృతిలో ఉండడంలోనే కళ్యాణముంది. మధురమైన ప్రియతముడిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి, స్మృతి చార్టునుంచాలి.

2. సూక్ష్మ బుద్ధితో ఈ డ్రామా రహస్యాన్ని అర్థము చేసుకోవాలి. ఇది చాలా-చాలా కళ్యాణకారి డ్రామా. మనము ఏం మాట్లాడుతున్నామో లేక చేస్తున్నామో అది మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది, దీనిని యథార్థంగా అర్థము చేసుకొని సంతోషంగా ఉండాలి.

వరదానము:-

పరస్పరము స్నేహాన్ని ఇచ్చి పుచ్చుకొనుట ద్వారా అందరినీ సహయోగులుగా చేసుకునే సఫలతామూర్త భవ

ఇప్పుడు జ్ఞానము ఇచ్చి పుచ్చుకునే స్టేజ్ దాటారు. ఇప్పుడు స్నేహాన్ని ఇచ్చి పుచ్చుకోండి. ఎవరు మీ ముందుకు వచ్చినా, సంబంధములోకి వచ్చినా స్నేహము ఇవ్వాలి, తీసుకోవాలి - దీనినే అందరి స్నేహీలని, లవ్లీగా ఉన్నారని అంటారు. అజ్ఞానులకు జ్ఞాన దానము చేయాలి. కాని బ్రాహ్మణ పరివారంలో ఈ దానంలో మహాదానులుగా అవ్వండి. సంకల్పంలో కూడా స్నేహము తప్ప మరేదీ ఉత్పన్నమవ్వకూడదు. ఎప్పుడైతే అందరి పట్ల స్నేహము ఏర్పడుతుందో, స్నేహానికి ప్రతిఫలము సహయోగము, సహయోగానికి ఫలితము సఫలత ప్రాప్తిస్తుంది.

స్లోగన్:-

ఒక్క సెకండులో వ్యర్థ సంకల్పాలకు ఫుల్ స్టాప్ పెట్టండి - ఇదే తీవ్ర పురుషార్థము.