ఓంశాంతి. ఇది ఎవరన్నారు? అనంతమైన తండ్రి, ఓ ఆత్మలారా! అని అన్నారు. ప్రాణి అనగా ఆత్మ. ఆత్మ వెళ్లిపోతే ప్రాణము పోయినట్లే అని అంటారు కదా. ఇప్పుడు తండ్రి మీ సన్ముఖంలో కూర్చొని అర్థం చేయిస్తున్నారు - ఓ ఆత్మలారా! గుర్తు తెచ్చుకోండి, కేవలం ఈ ఒక్క జన్మనే చూడకండి, కానీ మీరు తమోప్రధానమైనప్పటి నుండి మెట్లు క్రిందికి దిగుతూ పతితమైపోయారు. కనుక తప్పకుండా పాపము చేసి ఉంటారు. ఇది అర్థము చేసుకునే విషయము. ఎన్ని జన్మ-జన్మాంతరాల పాపము తలపై ఉందో ఎలా తెలియాలి? నా యోగమెంత ఉంది? ఎంతసేపు చేస్తున్నాను? అని స్వయాన్ని పరిశీలించుకోండి. తండ్రితో యోగమెంత బాగుంటుందో అంత వికర్మలు వినాశనమవుతాయి. బాబా చెప్తున్నారు - నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయని గ్యారంటి ఉంది. తండ్రితో నాకు ఎంత యోగము ఉంది అని ప్రతి ఒక్కరూ మనసులో చూసుకోండి. మనము ఎంతగా యోగము చేస్తామో, ఎంతగా పవిత్రంగా అవుతామో అంతగా పాపము తొలుగుతూ ఉంటుంది, యోగము పెరుగుతూ వెళ్తుంది. పవిత్రులుగా అవ్వకుంటే యోగము కూడా కుదరదు. రోజంతటిలో 15 నిముషాలు కూడా స్మృతిలో ఉండని వారు చాలామంది ఉన్నారు. నా మనసు శివబాబాపై ఉందా? లేక దేహధారులపై ఉందా? కర్మ సంబంధీకులు మొదలైన వారిపై ఉందా? అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. మాయ తుఫానులు వచ్చేది పిల్లలకే కదా? మీ స్థితి ఎలా ఉందో స్వయం మీరు కూడా తెలుసుకోవచ్చు. శివబాబాపై నా మనసు లగ్నమవుతోందా? లేక ఏదైనా దేహధారులపై ఉందా? కర్మ సంబంధీకులు మొదలైన వారితో ఉన్నట్లయితే నా వికర్మలు చాలా ఉన్నాయి, మాయ గోతులోకి తోసేస్తుంది అని భావించాలి. నేను పాసవుతానా లేదా? బాగా చదువుకుంటున్నానా? లేదా? అని విద్యార్థులు తెలుసుకోగలరు. నంబరువారుగా ఉంటారు కదా. ఆత్మలు తమ కళ్యాణము తామే చేసుకోవాలి. తండ్రి సూచననిస్తున్నారు - మీరు పుణ్యాత్మలుగా అయి ఉన్నత పదవిని పొందాలనుకుంటే అందులో మొదట పవిత్రత ముఖ్యమైనది. ఇక్కడకు పవిత్రంగా వచ్చాము, మళ్లీ పవిత్రమయ్యే వెళ్లాలి. పతితులెప్పుడూ ఉన్నత పదవిని పొందలేరు. సదా మీ మనసులో ప్రశ్నించుకోండి - నేనెంత సమయము తండ్రిని స్మృతి చేస్తున్నాను, నేనేం చేస్తున్నాను? ఇది చాలా అవసరము. వెనుక కూర్చునే విద్యార్థుల మనసు తింటూ ఉంటుంది. ఉన్నత పదవి పొందేందుకు పురుషార్థము చేస్తారు. కానీ నడవడిక కూడా ఉండాలి కదా. తండ్రిని స్మృతి చేసి తలపై ఉన్న పాప భారాన్ని దించుకోవాలి. స్మృతి ద్వారా తప్ప పాప భారాన్ని దించుకోలేము. కనుక తండ్రితో ఎంత సేపు యోగముండాలి! అత్యంత ఉన్నతమైన తండ్రి వచ్చి "నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి" అని చెప్తున్నారు. సమయం సమీపానికి వస్తూ ఉంది. శరీరముపై ఏ నమ్మకమూ లేదు. అకస్మాత్తుగా రకరకాల ప్రమాదాలు జరిగిపోతాయి. ఇది అకాలమృత్యువుల ఫుల్ సీజన్. కనుక ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకొని స్వ-కళ్యాణము చేసుకోవాలి. పూర్తి రోజులో ఈ రెండు ఖాతాలు పరిశీలించుకోవాలి - యోగము, నడవడిక. మొత్తం రోజంతటిలో పాపాలేమైనా చేశానా? మొదట మనసులో, వాచాలో వస్తారు... తర్వాత కర్మణాలోకి వస్తారు. ఇప్పుడు పిల్లలకు మేము మంచి కర్మలే చేయాలి అని సరియైన బుద్ధి లభించింది. ఎవ్వరినీ మోసగించలేదు కదా? అసత్యము చెప్పలేదు కదా? డిస్ సర్వీసు చేయలేదు కదా? అని పరిశీలించుకోవాలి. ఎవరి నామ రూపాలలోనైనా చిక్కుకుంటే యజ్ఞ మాత-పితలను నిందింపజేస్తారు.
తండ్రి చెప్తున్నారు - ఎవ్వరికీ దుఃఖమునివ్వకండి. ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండండి. మేము స్మృతిలో ఉండలేకపోతే మా గతి ఏమవుతుంది అనే విషయంలో చాలా గొప్ప చింత ఉండాలి. ఈ సమయంలో అజాగ్రత్తగా ఉంటే చివర్లో చాలా పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. చిన్న పదవి పొందేవారు చిన్న పదవినే పొందుతారని కూడా అర్థము చేసుకుంటారు. మనము ఏమి చేయాలో అది బుద్ధితో గ్రహించగలము. అందరికీ తండ్రిని స్మృతి చేయమనే మంత్రమునివ్వండి. పిల్లలకు లక్ష్యము లభించింది. ఈ విషయాలు ప్రపంచములోని వారికి అర్థమవ్వవు. మొట్టమొదట ముఖ్యమైన విషయము - తండ్రిని స్మృతి చేయడం. రచయిత-రచనల జ్ఞానమైతే లభించింది. ప్రతి రోజూ ఏవో కొన్ని కొత్త కొత్త పాయింట్లు అర్థము చేయించేందుకు ఇస్తూనే ఉంటారు. విరాటరూప చిత్రము పై కూడా మీరు అర్థం చేయించవచ్చు. ఎలా వర్ణములలోకి వస్తారో తెలియజేయడానికి ఈ చిత్రమును మెట్ల వరుస చిత్రం ప్రక్కన ఉంచాలి. ఎవరికైనా ఎలా అర్థం చేయించాలి అనే చింతన రోజంతా నడుస్తూ ఉండాలి. సేవ చేస్తే కూడా తండ్రి స్మృతి ఉంటుంది. తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. స్వకళ్యాణము కూడా చేసుకోవాలి. మీపై 63 జన్మల పాపముందని తండ్రి అర్థం చేయించారు. పాపాలు చేస్తూ చేస్తూ సతోప్రధానము నుండి తమోప్రధానముగా అయిపోయారు. ఇప్పుడు నా వారుగా అయ్యి మళ్లీ పాప కర్మలు చేయకండి. అసత్యము చెప్పడం, ఇంటిలో గొడవలు సృష్టించడం, చెప్పుడు మాటలు విశ్వసించడం - మొదలైన కుటిల మార్గపు పనులు చాలా నష్టపరుస్తాయి. తండ్రితో యోగమునే తెంచి వేస్తాయి. కనుక ఎంత పాపము చేసినట్లు! ప్రభుత్వములో కూడా ధూర్తులుంటారు. ప్రభుత్వ విషయాలు ఎవరైనా శత్రువులకు వినిపించి చాలా నష్టము కలుగజేస్తారు. కనుక వారికి చాలా కఠిన శిక్షలు లభిస్తాయి. కనుక పిల్లల నోటి నుండి సదా జ్ఞాన రత్నాలే వెలువడాలి. తప్పుడు సమాచారాలు ఒకరితో ఒకరు మాట్లాడుకోరాదు. జ్ఞాన రత్నాలే మాట్లాడుకోవాలి. నీవు తండ్రితో యోగమెలా చేస్తావు? ఇతరులకు ఎలా అర్థం చేయిస్తావు? అను విషయాలే మాట్లాడుకుంటూ ఉండాలి. రోజంతా ఇవే ఆలోచనలు ఉండాలి. చిత్రాల ముందుకెళ్లి కూర్చుండిపోవాలి. మీ బుద్ధిలో జ్ఞానముంది కదా. భక్తిమార్గములో అనేక రకాల చిత్రాలను పూజిస్తూ ఉంటారు. వాటిని గురించి కొంచెం కూడా తెలియదు. అంధ విశ్వాసము, విగ్రహ పూజ - ఈ విషయాలలో భారతదేశము ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు మీరు ఈ విషయాలను అర్థము చేయించేందుకు ఎంత శ్రమ చేస్తారు! ప్రదర్శినీలో ఎంతమంది మనుష్యులు వస్తారు! రకరకాల మనుష్యులుంటారు. ఈ ప్రదర్శిని చూడదగింది, అర్థము చేసుకోదగింది అని కొంతమంది భావిస్తారు. చూస్తారు కానీ సెంటర్లకు ఎప్పుడూ వెళ్లరు. రోజురోజుకు ప్రపంచ పరిస్థితులు కూడా పాడవుతూ వస్తాయి. చాలా గొడవలు జరుగుతున్నాయి. విదేశాలలో ఏమేం జరుగుతున్నాయో చెప్పలేము. అనేకమంది మనుష్యులు మరణిస్తారు. తమోప్రధాన ప్రపంచము కదా. భలే బాంబులు తయారు చేయకూడదని అంటారు. కానీ వారు మీ వద్ద చాలా ఉన్నాయి కదా మేమెందుకు తయారు చేయకూడదని అంటారు. మేము తయారు చేయకుంటే మీ బానిసలుగా ఉండవలసి వస్తుందని అంటారు. ఏ ఏ ఆలోచనలు వెలువడతాయో అవన్నీ వినాశనము కొరకే. వినాశనమైతే తప్పక జరిగే తీరుతుంది. శంకరుడు ప్రేరేపిస్తారని అంటారు. కానీ ఇందులో ప్రేరణ మొదలైన విషయాలు లేనే లేవు. మనకు డ్రామాపై నిశ్చయముంది. మాయ చాలా తీవ్రంగా ఉంది. నా పిల్లలను కూడా వికారాలలోకి తోసేస్తుంది. దేహముపై ప్రీతి ఉంచుకోకండి, నామ రూపాలలో చిక్కుకోకండి అని తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తారు. అయితే మాయ కూడా ఎంత తమోప్రధానంగా ఉందంటే దేహములో చిక్కుకునేలా చేస్తుంది. ముక్కు పట్టుకొని ఊపిరాడకుండా చేసేస్తుంది. పట్టుకున్నట్లు తెలియనే తెలియదు. శ్రీమతమును అనుసరించమని తండ్రి ఎంతగా అర్థం చేయించినా అనుసరించరు. రావణుని మతము వెంటనే బుద్ధిలోకి వచ్చేస్తుంది. రావణుడు జైలు నుండి వదలడు.
తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి. ఇంత మాత్రము చేస్తే చాలు, చేరుకున్నట్లే. అర్ధకల్పము నుండి బాధపడుతున్న రోగము నుండి మనము ముక్తులైపోతాము. అక్కడ నిరోగీ శరీరముంటుంది. ఇక్కడ శరీరానికి అనేక రోగాలున్నాయి. ఇది రౌరవ నరకము కదా. భలే వారు గరుడ పురాణము చదువుతారు. కానీ చదివేవారికి గానీ, వినేవారికి గానీ ఏ మాత్రము అర్థము కాదు. బాబా స్వయంగా చెప్తారు - ఇంతకు ముందు నాకు భక్తి నషా చాలా ఉండేది. భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారని విని సంతోషంగా భక్తి చేస్తూ ఉండేవాడిని. పతితులైనందుకు ఓ పతిత పావనా! రండి అని పిలుస్తారు. భక్తి చేయడం మంచిదే. అయితే మళ్లీ భగవంతుడిని ఎందుకు పిలుస్తారు? భగవంతుడు వచ్చి భక్తికి ఫలితాన్ని ఇస్తారని భావిస్తారు. ఏ ఫలమును ఇస్తారో అది ఎవ్వరికీ తెలియదు. గీతను చదివేవారికే అర్థం చేయించమని తండ్రి చెప్తున్నారు. మన ధర్మానికి చెందినవారు వారే. గీతలో ముఖ్యమైన మొదటి విషయము భగవానువాచ. అయితే గీతా భగవానుడు ఎవరు? భగవంతుని పరిచయము కావాలి కదా. ఆత్మ అంటే ఏమిటో, పరమాత్మ అంటే ఎవరో మీకు తెలిసిపోయింది. మనుష్యులు జ్ఞాన విషయాలు విని ఎంతో భయపడ్డారు. వారికి భక్తి ఎంతో బాగుంటుంది. జ్ఞానమంటే 3 మైళ్ళ దూరము పరుగెడతారు. అరే! పావనంగా అవ్వడం మంచిది కదా. ఇప్పుడు పావన ప్రపంచ స్థాపన, పతిత ప్రపంచ వినాశనము జరుగుతుంది. అయితే ఎంత చెప్పినా అసలు వినరు. తండ్రి ఆదేశము - చెడు వినకు, చెడు చూడకు... అయితే మాయ బాబా మాటలు వినకు అని చెప్తుంది. శివబాబా జ్ఞానము వినవద్దని మాయ ఆదేశిస్తుంది. మాయ ఎంత జోరుగా చెంపదెబ్బ వేస్తుందంటే ఇక జ్ఞానము బుద్ధిలో నిలవదు. తండ్రిని స్మృతే చేయలేరు. బంధు-మిత్రులు, దేహధారులు గుర్తుకొస్తారు. బాబా ఆజ్ఞను పాటించరు. తండ్రి, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని చెప్తారు. అయితే తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి మాకు ఫలానా వారు గుర్తుకు వస్తున్నారని అంటారు. అలా దేహధారులు గుర్తుకొస్తే క్రింద పడిపోతారు. ఈ విషయాలపై అసహ్యము కలగాలి. ఇది పూర్తిగా ఛీ-ఛీ ప్రపంచము. మన కొరకు నూతన స్వర్గము స్థాపన అవుతూ ఉంది. పిల్లలైన మీకు తండ్రి పరిచయము, సృష్టిచక్ర పరిచయము లభించింది కనుక ఆ చదువులోనే నిమగ్నమైపోవాలి. తండ్రి చెప్తున్నారు - మిమ్ములను మీరు పరిశీలించుకోండి. నారదుని ఉదాహరణ కూడా ఉంది కదా. ఇప్పుడు తండ్రి కూడా చెప్తున్నారు - నేను తండ్రిని స్మృతి చేస్తున్నానా? అని స్వయాన్ని పరిశీలించుకోండి. స్మృతి ద్వారానే పాపాలు భస్మమైపోతాయి. ఎటువంటి పరిస్థితులలోనైనా శివబాబానే స్మృతి చేయాలి. ఇతరులెవ్వరిపైనా ప్రీతి ఉంచరాదు. చివరి సమయములో శివబాబా స్మృతిలోనే తనువు నుండి ప్రాణము వెళ్లిపోవాలి. శివబాబా స్మృతి ఉండాలి, స్వదర్శన చక్ర జ్ఞానము బుద్ధిలో ఉండాలి. స్వదర్శన చక్రధారులెవ్వరో కూడా ఎవ్వరికీ తెలియదు. బ్రాహ్మణులకు కూడా ఈ జ్ఞానము ఇచ్చింది ఎవరు? బ్రాహ్మణులను స్వదర్శన చక్రధారులుగా చేసేది ఎవరు? బిందు రూపుడైన పరమపిత పరమాత్మ. అయితే వారు కూడా చక్రధారియేనా? అవును. మొదట వారే స్వదర్శన చక్రధారులు. లేకుంటే బ్రాహ్మణులైన మనల్ని ఎవరు తయారుచేస్తారు? మొత్తం రచనను గురించిన ఆదిమధ్యాంతాల జ్ఞానమంతా వారిలో ఉంది. మీ ఆత్మ కూడా అలా తయారవుతుంది. వారు కూడా ఆత్మనే. భక్తిమార్గంలో విష్ణువును చక్రధారిగా చేసేశారు. మనము పరమాత్ముడిని త్రికాలదర్శి, త్రిమూర్తి, త్రినేత్రి అని అంటాము. వారు మనల్ని స్వదర్శన చక్రధారులుగా చేస్తారు. వారు కూడా తప్పకుండా మానవ శరీరములోనే వచ్చి వినిపిస్తారు. రచనను గురించిన ఆది-మధ్య-అంత్యముల జ్ఞానము వినిపించగలిగేది రచయితనే కదా. రచయిత గురించే ఎవ్వరికీ తెలియకపోతే రచనను గురించిన జ్ఞానము ఎక్కడి నుండి లభిస్తుంది. శివబాబాయే స్వదర్శన చక్రధారులని, జ్ఞానసాగరులని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మనము 84 జన్మల చక్రములోకి ఎలా వస్తామో వారికి తెలుసు. వారు పునర్జన్మ తీసుకోరు. వారిలో జ్ఞానముంది. ఆ జ్ఞానాన్ని మనకు వినిపిస్తారు కనుక మొదట స్వదర్శన చక్రధారి శివబాబాయే. వారే మనల్ని స్వదర్శన చక్రధారులుగా చేస్తారు. వారు పతితపావనులు కనుక మనల్ని పావనంగా చేస్తారు. రచయిత కూడా వారే. తండ్రికి పిల్లల జీవితమంతా తెలుసు కదా. శివబాబా బ్రహ్మా ద్వారా స్థాపన చేయిస్తారు. చేసేవారు చేయించేవారు కదా. మీరు కూడా నేర్చుకొని నేర్పించండి. తండ్రి మనలను చదివించి ఇతరులను కూడా చదివించమని చెప్తారు కనుక మిమ్ములను శివబాబాయే స్వదర్శన చక్రధారులుగా చేస్తారు. నా వద్ద సృష్టి చక్ర జ్ఞానముంది, అందుకే నేను మీకు వినిపిస్తానని అంటున్నారు. కనుక 84 జన్మలు ఎలా తీసుకుంటారో ఆ కథ అంతా మీ బుద్ధిలో ఉండాలి. ఇది మీ బుద్ధిలో ఉన్నా చక్రవర్తి రాజులుగా అవ్వగలరు. ఇది జ్ఞానము. అయితే పాపాలు యోగము ద్వారానే తొలగిపోతాయి. రోజంతటి చార్టును పెట్టండి. స్మృతే చేయకుంటే చార్టు కూడా ఏమి పెడతారు! రోజంతటిలో ఏమేం చేశారో మీకు గుర్తుంటుంది కదా. ఎన్ని శాస్త్రాలు చదివారో, ఎంత పుణ్యము చేశారో అనే లెక్క అంతా వ్రాసే మనుష్యులు కూడా ఉంటారు. అయితే ఎంత సమయము స్మృతి చేశారు, ఎంత సంతోషంగా తండ్రి పరిచయమిచ్చారు? అని మీరు చెప్తారు.
తండ్రి ద్వారా ఏ పాయింట్లు లభించాయో వాటిని క్షణక్షణము మథనము చేయండి. లభించిన జ్ఞానాన్ని మీ బుద్ధిలో గుర్తుంచుకోండి. ప్రతిరోజు మురళి చదవండి. అది కూడా చాలా మంచిది. మురళీలోని పాయింట్లను మాటిమాటికి మథనము చేయండి. ఇక్కడ ఉన్నవారి కంటే విదేశాలలో ఉన్నవారు ఎక్కువగా స్మృతి చేస్తారు. చాలామంది బంధనములో ఉన్నారు. వారు బాబాను కూడా ఎప్పుడూ చూడలేదు. అయితే ఎంత స్మృతి చేస్తారంటే వారికి సదా నషా ఎక్కి ఉంటుంది. ఇంటిలో ఉండగానే సాక్షాత్కారమవుతుంది లేక వింటూ వింటూ అనాయాసంగా నిశ్చయం ఏర్పడిపోతుంది.
కనుక తండ్రి చెప్తున్నారు - మేము ఎంత ఉన్నత పదవిని పొందుతాము, మా నడవడిక ఎలా ఉంది? అని లోలోపల చెక్ చేసుకుంటూ ఉండండి. ఆహార పానీయాల విషయాలలో ఎలాంటి లోభము, అత్యాశ లేదు కదా. ఏ అలవాటు ఉండకూడదు. ముఖ్యమైనది అవ్యభిచారి స్మృతిలో ఉండడం. నేను ఎవరిని స్మృతి చేస్తున్నాను? ఎంత సమయము ఇతరులను స్మృతి చేస్తున్నాను? అని ప్రశ్నించుకోండి. జ్ఞానము కూడా ధారణ చేయాలి? పాపాలు కూడా కట్ అవ్వాలి. కొంతమంది ఎలాంటి పాపాలు చేశారంటే చెప్పలేము. భగవంతుడు ఇది చెయ్యండి అని చెప్తారు కానీ మేము పరవశమై ఉన్నాము అనగా మాయకు వశమై ఉన్నాము అని అంటారు. అచ్ఛా, మాయకు వశమైయ్యే ఉండండి. మీరు అయితే శ్రీమతముపై నడవాలి లేదా మీ సొంత మతముపై. ఈ స్థితిలో మేము ఎంతవరకు పాస్ అవుతాము? ఏ పదవి పొందుతాము? అని పరిశీలించుకోవాలి. 21 జన్మల నష్టం కలుగుతుంది. కర్మాతీత స్థితిని చేరుకున్నప్పుడు దేహాభిమానమనే పేరే ఉండదు. అందుకే దేహీ అభిమానులుగా అవ్వండని చెప్పడం జరుగుతుంది. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్నిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. యజ్ఞపితను నిందింపజేసే ఏ కర్తవ్యాన్ని చేయరాదు. తండ్రి ద్వారా లభించిన రైటియస్ బుద్ధి ద్వారా మంచి కర్మలు చేయాలి. ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు.
2. పరస్పరము తప్పుడు సమాచారముల గురించి అడగకూడదు. పరస్పరము జ్ఞాన విషయాలే మాట్లాడుకోవాలి. అసత్యము, శైతానీ మాటలు, ఇంటిలో గొడవలు సృష్టించే విషయాలు - ఇవన్నీ వదిలి నోటి ద్వారా సదా జ్ఞాన రత్నాలే వినిపించాలి. చెడు మాటలు వినరాదు, వినిపించరాదు.