21-04-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం
"మధురమైన పిల్లలూ - మీరిప్పుడు పురుషోత్తములుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు, దేవతలు పురుషోత్తములు, ఎందుకంటే వారు పావనులు, మీరు పావనంగా అవుతున్నారు”
ప్రశ్న:-
అనంతమైన తండ్రి, పిల్లలకు ఎందుకు శరణు(ఆశ్రయమును) ఇచ్చారు?
జవాబు:-
ఎందుకంటే వారి పిల్లలమైన మనమందరమూ చెత్త కుండిలో పడి ఉన్నాము. తండ్రి మనల్ని చెత్త కుండి నుండి బయటకు తీసి, పుష్పాలుగా చేస్తున్నారు. ఆసురీ గుణాలున్న వారిని దైవీ గుణాలు కలవారిగా తయారుచేస్తున్నారు. డ్రామా అనుసారంగా తండ్రి వచ్చి మనల్ని చెత్త నుండి బయటకు తీసి దత్తత తీసుకొని తమవారిగా చేసుకున్నారు.
గీతము:-
ఈరోజు ఉదయము ఉదయమే ఎవరొచ్చారు..... (యహ్ కౌన్ ఆయా ఆజ్ సవేరే సవేరే....)
ఓంశాంతి. రాత్రిని పగలుగా చేసేందుకు తండ్రి రావలసి వచ్చింది. తండ్రి వచ్చి ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. మొదట మనము శూద్రులుగా, శూద్ర బుద్ధి కలవారిగా ఉండేవారము. వర్ణాల చిత్రము కూడా అర్థము చేయించేందుకు చాలా బాగుంది. మనము ఈ వర్ణాలలో ఎలా తిరుగుతూ ఉంటామో పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు పరమపిత పరమాత్మ మనల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేశారు. కల్ప-కల్పము, కల్పము యొక్క సంగమయుగములో మనము బ్రాహ్మణులుగా అవుతాము. బ్రాహ్మణులను పురుషోత్తములని అనరు. పురుషోత్తములని దేవతలను అంటారు. బ్రాహ్మణులు ఇక్కడ పురుషోత్తములుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తారు. పతితుల నుండి పావనంగా అయ్యేందుకే తండ్రిని పిలుస్తారు. కనుక మేము ఎంతవరకు పావనంగా అయ్యామని స్వయాన్ని ప్రశ్నించుకోండి. విద్యార్థులు కూడా చదువు కొరకు విచార సాగర మథనము చేస్తారు కదా. ఈ చదువు ద్వారా మేము ఇలా తయారవుతామని వారు భావిస్తారు. ఇప్పుడు దేవతలుగా అయ్యేందుకు మనము బ్రాహ్మణులుగా అయ్యామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మీరు ఈశ్వరీయ సంతానంగా అయినందుకు మీ జీవితము చాలా అమూల్యమైనది. ఈశ్వరుడు మీకు రాజయోగము నేర్పిస్తున్నారు, పతితుల నుండి పావనంగా చేస్తున్నారు. పావన దేవతలుగా అవుతారు. వర్ణాల చిత్రముపై అర్థం చేయించడం చాలా మంచిది. సన్యాసులు మొదలైనవారు ఈ విషయాలను అంగీకరించరు. అయితే 84 జన్మల లెక్కను అర్థము చేసుకోగలరు. సన్యాస ధర్మానికి చెందిన మేము 84 జన్మలు తీసుకోలేమని కూడా అర్థము చేసుకోగలరు. మేము 84 జన్మలు తీసుకోలేమని ఇస్లామీలు, బౌద్ధులు మొదలైనవారు కూడా అర్థము చేసుకుంటారు. అయితే పునర్జన్మలు తీసుకుంటారు, కానీ తక్కువ పునర్జన్మలు. మీరు అర్థం చేయిస్తే వెంటనే అర్థము చేసుకుంటారు. అర్థము చేయించేందుకు కూడా యుక్తి కావాలి. పిల్లలైన మీరిక్కడ సన్ముఖములో కూర్చుని ఉన్నారు. కనుక బాబా మీ బుద్ధిని రిఫ్రెష్ చేస్తారు. ఇతర పిల్లలు కూడా ఇక్కడకు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు కదా. మిమ్మల్ని అయితే బాబా ప్రతి రోజూ ఇది ధారణ చేయమని రిఫ్రెష్ చేస్తారు. బుద్ధిలో ఇవే ఆలోచనలు నడుస్తూ ఉండాలి – మేము 84 జన్మలు ఎలా తీసుకున్నాము, శూద్రుల నుండి బ్రాహ్మణులుగా ఎలా అయ్యాము? బ్రహ్మా సంతానము బ్రాహ్మణులు. ఇప్పుడీ బ్రహ్మా ఎక్కడ నుండి వచ్చారు? నేను ఇతనికి బ్రహ్మా అని పేరు పెట్టానని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఈ బ్రహ్మాకుమార-కుమారీలందరూ ఒక కుటుంబంగా అయ్యారు. కనుక అందరూ తప్పకుండా దత్తత తీసుకోబడినవారు. తండ్రియే వచ్చి దత్తత తీసుకుంటారు. వారిని తండ్రి అని అంటారు, దాదా అని అనరు. తండ్రిని తండ్రే అంటారు. ఆస్తి తండ్రి నుండే లభిస్తుంది. పినతండ్రి, మావయ్య లేక ఇతర వంశస్థులు కూడా దత్తత తీసుకుంటారు. ఒక పాప చెత్త కుండిలో పడి ఉన్నప్పుడు చూసి ఎవరో తీసుకెళ్ళి పిల్లలు లేనివారెవరికో ఇచ్చారని బాబా వినిపించారు కదా. ఆ పాప ఎవరి ఒడిలోకి వెళ్ళిందో వారినే తల్లి-తండ్రి అని పిలుస్తుంది కదా. అయితే ఇది అనంతమైన విషయము. పిల్లలైన మీరు కూడా అనంతమైన చెత్త కుండిలో పడి ఉన్నారు. విషయవైతరణీ నదిలో పడి ఉన్నారు. ఎంత మురికిగా అయిపోయారు! డ్రామానుసారముగా తండ్రి వచ్చి ఆ చెత్త నుండి బయటకు తీసి మిమ్మల్ని దత్తత తీసుకున్నారు. తమోప్రధాన ప్రపంచాన్ని చెత్త అనే అంటారు కదా. ఆసురీ గుణాలు గల మనుష్యులు దేహాభిమానులుగా ఉంటారు. కామ-క్రోధాలు కూడా పెద్ద వికారాలు కదా. మీరు రావణుడి యొక్క పెద్ద చెత్త కుండీలో పడి ఉన్నారు. వాస్తవానికి మీరు శరణాగతులు కూడా. చెత్త నుండి బయటపడి పుష్పాల వంటి దేవతలుగా అయ్యేందుకు అనంతమైన తండ్రి శరణులోకి వచ్చారు. ఈ సమయములో ప్రపంచమంతా పెద్ద చెత్తకుండిలో పడి ఉంది. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని చెత్త నుండి తీసి తమవారిగా చేసుకున్నారు. కానీ చెత్తలో ఉన్నవారు దానికి ఎంతగా అలవాటు పడ్డారంటే బయటకు తీసినా మళ్ళీ వారికి ఆ చెత్తనే నచ్చుతుంది. తండ్రి వచ్చి అనంతమైన చెత్త నుండి బయటకు తీస్తారు. బాబా, మీరు వచ్చి మమ్మల్ని పుష్పాలుగా తయారుచేయండి, ముళ్ళ అడవి నుండి తీసి పుష్పాలుగా చేయండి, భగవంతుని తోటలో కూర్చోబెట్టండి అని కూడా పిలుస్తారు. ఇప్పుడు అసురుల అడవిలో పడి ఉన్నారు. తండ్రి పిల్లలైన మిమ్మల్ని ఉద్యానవనములోకి తీసుకెళ్తారు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు, తర్వాత మళ్ళీ దేవతలుగా అవుతారు. ఇది దేవతల రాజధాని. బ్రాహ్మణుల రాజ్యము లేనే లేదు. భలే పాండవులనే పేరు ఉంది, కానీ పాండవులకు రాజ్యము లేదు. రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు తండ్రితో పాటు కూర్చొని ఉన్నారు. ఇప్పుడు అనంతమైన రాత్రి సమాప్తమై అనంతమైన పగలు ప్రారంభమవుతుంది. ఉదయము-ఉదయమే ఎవరొచ్చారనే పాట విన్నారు కదా. అనంతమైన రాత్రిని సమాప్తి చేసి అనంతమైన పగలుగా చేసేందుకు అనగా నరకాన్ని వినాశము చేయించి, స్వర్గ స్థాపన చేయించేందుకు వారు ఉదయము ఉదయమే వస్తారు. ఇది బుద్ధిలో ఉన్నా సంతోషంగా ఉంటారు. కొత్త ప్రపంచములో ఉన్నత పదవిని పొందేవారు ఎప్పుడూ తమ ఆసురీ స్వభావాన్ని చూపించరు. ఏ యజ్ఞము ద్వారా ఇంత ఉన్నతంగా అవుతారో ఆ యజ్ఞ సేవను చాలా ప్రేమగా చేస్తారు. ఇటువంటి యజ్ఞములో అయితే ఎముకలు కూడా ఇచ్చేయాలి. ఈ నడవడిక ద్వారా మేము ఉన్నత పదవి ఎలా పొందగలమని స్వయాన్ని గమనించుకోవాలి. మీరు తెలివిహీనులైన చిన్న పిల్లలైతే కారు కదా. రాజులుగా ఎలా అవుతారో, ప్రజలుగా ఎలా అవుతారో అర్థము చేసుకోగలరు. బాబా అనుభవీ రథమును తీసుకున్నారు. ఈ రథానికి రాజులు మొదలైనవారంతా చాలా బాగా తెలుసు. రాజుల దాస దాసీలకు కూడా చాలా సుఖము లభిస్తుంది. ఎందుకంటే వారు రాజులతోనే ఉంటారు కాని దాస దాసీలని అంటారు కదా. సుఖమైతే ఉంటుంది కదా. రాజు రాణులు భుజించే ఆహారమే వారికి లభిస్తుంది. బయట ఉండేవారు తినలేరు. దాసీలలో కూడా నంబరువారుగా ఉంటారు. కొంత మంది అలంకరించేవారు, కొంతమంది పిల్లలను సంభళించేవారు, కొంతమంది ఊడవడం మొదలైనవి చేసేవారు ఉంటారు. ఇక్కడి రాజులకే ఇంతమంది దాస దాసీలుంటే అక్కడ ఎంతమంది ఉంటారు. అందరికీ ఎవరి బాధ్యతలు వారికి ఉంటాయి. నివసించే స్థానాలు వేరుగా ఉంటాయి. అవి రాజా-రాణుల భవనాల వలె అలంకరింపబడి ఉండవు. ఉదాహరణకు సర్వెంట్ క్వార్టర్స్ (సేవకుల నివాస గృహాలు) ఉంటాయి కదా. రాజ మహలులోకి వస్తారు కాని సర్వెంట్ క్వార్టర్స్ లో నివసిస్తారు. కనుక మీపై మీరు దయ చూపించుకోండని తండ్రి చాలా మంచి రీతిలో తెలియజేస్తున్నారు. మనము ఉన్నతాతి ఉన్నతంగా తయారవ్వాలి. ఇప్పుడు మనము శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యాము. ఇది ఎంత గొప్ప సౌభాగ్యము! తర్వాత దేవతలుగా అవుతాము. ఈ సంగమయుగము చాలా కళ్యాణకారి యుగము. మీ ప్రతి మాటలో కళ్యాణము నిండి ఉంటుంది. భండారా (వంట గది) లో కూడా యోగయుక్తంగా ఉండి భోజనము తయారుచేస్తే అందులో చాలా మంది కళ్యాణము నిండి ఉంది. శ్రీనాథ ద్వారములో పూర్తి నిశ్శబ్దంగా ఉండి భోజనము తయారుచేస్తారు. ఆ సమయములో వారికి శ్రీనాథుడే గుర్తుంటారు. భక్తులు తమ భక్తిలో చాలా మస్త్ గా (ఆనందముగా) మగ్నమై ఉంటారు. మీరు జ్ఞానములో ఆనందంగా మునిగి ఉండాలి. కృష్ణుని భక్తి ఎంతగా చేస్తారో అడగకండి. బృందావనములో ఇరువురు కన్యలున్నారు. వారు పూర్తి భక్తులుగా ఉన్నారు. మేము ఇక్కడే ఉండిపోతాము, ఇక్కడే కృష్ణుని స్మృతిలోనే శరీరము వదలుతామని అంటారు. మంచి ఇంట్లో ఉండి, జ్ఞానము తీసుకొమ్మని ఎంతగా చెప్పినా, మేము ఇక్కడే ఉంటామని అంటారు. అటువంటి వారిని భక్తశిరోమణులని అంటారు. కృష్ణునిపై ఎంతగా బలిహారమవుతారు. అయితే ఇప్పుడు మీరు తండ్రిపై బలిహారం అవ్వాలి. మొట్టమొదట శివబాబాపై ఎంత మంది బలిహారం అయ్యారు! అనేకమంది వచ్చారు. భారతదేశములోకి వచ్చినప్పుడు చాలా మందికి వారి ఇల్లు-వాకిళ్ళు గుర్తుకు రావడం మొదలయింది. ఎంత మంది వెళ్ళిపోయారు. ఎంతో మందిపై గ్రహచారము కూర్చుంటుంది కదా. ఒక్కొక్కసారి ఒక్కొక్క దశ కూర్చుంటుంది. ఎవరైనా వస్తే ఎక్కడకొచ్చారో వారిని అడగమని బాబా చెప్తారు. బయట బోర్డుపై బ్రహ్మాకుమార-కుమారీలు అని చూసారు. ఇది ఒక పరివారము కదా! ఒకరు, నిరాకార పరమపిత శివ పరమాత్మ. రెండవవారు, ప్రజాపిత బ్రహ్మా కూడా గాయనం చేయబడి ఉన్నారు. వీరంతా వారి పిల్లలు, శివబాబా తాతయ్య. వారసత్వము వారి నుండి లభిస్తుంది. నన్ను స్మృతి చేస్తే మీరు పతితుల నుండి పావనంగా అవుతారని వారు సలహానిస్తున్నారు. కల్పక్రితము కూడా ఇలాగే సలహానిచ్చారు. ఇది ఎంత ఉన్నతమైన చదువు. మనము తండ్రి నుండి వారసత్వము తీసుకుంటున్నామని కూడా మీ బుద్ధిలో ఉంది.
పిల్లలైన మీరిప్పుడు మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే చదువు చదువుతున్నారు. మీరు దైవీ గుణాలు తప్పకుండా ధారణ చేయాలి. మీ ఆహార-పానీయాలు, మాట-నడవడిక ఎంత రాయల్ గా ఉండాలి. దేవతలు ఎంత తక్కువ తింటారు. వారికి ఎలాంటి లోభము ఉండదు. 36 రకాల భోజనము తయారవుతుంది కానీ ఎంత తక్కువ తింటారు. ఆహార పానీయాలపై లోభము ఉన్నా, దానిని కూడా ఆసురీ నడవడిక అని అంటారు. దైవీ గుణాలు ధారణ చేయాలంటే ఆహార పానీయాలు చాలా శుద్ధంగా, సాధారణంగా ఉండాలి. కానీ మాయ ఒక్కొక్కసారి రాతి బుద్ధిగా చేస్తుంది. కనుక వారికి పదవి కూడా అటువంటిదే లభిస్తుంది. తమ కళ్యాణము చేసుకునేందుకు దైవీగుణాలను ధారణ చేయండి అని తండ్రి చెప్తున్నారు. మంచి రీతిగా చదువుకుంటే, చదివిస్తూ ఉంటే మీకే బహుమతి లభిస్తుంది. మీకా బహుమతి తండ్రి ఇవ్వరు. మీరు మీ పురుషార్థము ద్వారా పొందుతారు. మేమెంత సేవ చేస్తున్నాము, మేము ఎలా తయారవుతాము అని స్వయాన్ని పరిశీలించుకోండి. ఈ సమయములో శరీరము వదిలేస్తే ఏ పదవి లభిస్తుంది? బాబాను అడిగితే, వీరు చేసే ఈ పనుల ద్వారా వీరు ఫలానా పదవి పొందుతారని వెంటనే చెప్తారు. పురుషార్థమే చేయకపోతే కల్ప-కల్పము కొరకు వారికి వారే నష్టము కలగచేసుకుంటారు. మంచి సేవ చేసేవారు తప్పకుండా మంచి పదవే పొందుతారు. వీరు దాస దాసీలుగా అవుతారని లోలోపల తెలిసిపోతుంది. కాని బయటికి చెప్పలేరు. పాఠశాలలో కూడా మేము సీనియర్ గా అవుతామా లేక జూనియర్ గా అవుతామా అని విద్యార్థులు అర్థం చేసుకుంటారు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. సీనియర్లు రాజా-రాణీలుగా అవుతారు. జూనియర్లు తక్కువ పదవి పొందుతారు. ధనవంతులలో కూడా సీనియర్లు, జూనియర్లు ఉంటారు. దాస-దాసీలలో కూడా సీనియర్లు, జూనియర్లు ఉంటారు. సీనియర్ల పదవి ఉన్నతంగా ఉంటుంది. ఊడ్చే దాసీలకు రాజభవనము లోపలకు వచ్చేందుకు అనుమతి ఉండదు. ఈ విషయాలన్నీ పిల్లలైన మీరు బాగా అర్థము చేసుకోగలరు. చివర్లో ఇంకా బాగా అర్థము చేసుకుంటారు. ఉన్నతంగా తయారయ్యే వారిని గౌరవించాలి కూడా. కుమార్కా దాది సీనియర్ కనుక వారిని గౌరవించాలి.
తండ్రి పిల్లలకు అటెన్షన్ ఇప్పిస్తున్నారు - మహారథి పిల్లలను గౌరవించండి. గౌరవించకుంటే మీపై గల పాప భారాన్ని పెంచుకుంటారు. ఈ విషయాలన్నిటిపై తండ్రి అటెన్షన్ ఇప్పిస్తారు. నంబరువారుగా ఎవరిని, ఎలా గౌరవించాలనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాబాకు, ప్రతి ఒక్కరి గురించి తెలుసు కదా. ఎవరినైనా ఏమైనా అంటే, ట్రేటర్ (ద్రోహి) గా అయ్యేందుకు ఆలస్యము చేయరు. ఇక కుమారీలు, మాతలపై కూడా ఎన్నో బంధనాలు ఏర్పడతాయి. అత్యాచారాలు సహనం చేయవలసి వస్తుంది. బాబా వీరు మమ్ములను చాలా విసిగిస్తున్నారు, మేమేం చెయ్యాలని చాలా మంది మాతలు వ్రాస్తారు. అరే! వారు బలవంతము చేసేందుకు మీరు జంతువులేమీ కాదు కదా. లోలోపల మీకు కోరిక ఉంది కనుకనే ఏం చేయాలని నన్ను అడుగుతున్నారు. ఇందులో అడిగే మాటే లేదు. ఆత్మ తనకు తానే మిత్రుడు, తనకు తానే శత్రువు. మీకెలా కావాలో అలా చేయండి. అడుగుతున్నారంటే మీకు కోరిక ఉందని అర్థమవుతుంది. ముఖ్యమైన విషయము స్మృతి. స్మృతి ద్వారానే మీరు పావనంగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు నంబర్వన్ పావనులు కదా. మమ్మా ఎంత సేవ చేసేవారు. మేము మమ్మా కంటే వివేకవంతులమని ఎవ్వరూ చెప్పలేరు. జ్ఞానములో మమ్మా అందరికంటే తెలివైనవారు. చాలా మందిలో యోగము చాలా తక్కువగా ఉంది. స్మృతిలో ఉండలేరు. స్మృతి చేయకపోతే వికర్మలు ఎలా వినాశనమవుతాయి? అంతిమంలో బాబా స్మృతిలోనే శరీరము వదలాలని నియమము చెప్తున్నది. శివబాబా స్మృతిలోనే ఆత్మ శరీరాన్ని వదలాలి. ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ గుర్తు రాకూడదు. దేనిపైనా ఆసక్తి ఉండకూడదు. మేము అశరీరులుగా వచ్చాము, తిరిగి అశరీరులుగానే వెళ్ళాలని అభ్యాసము చేయాలి. పిల్లలకు పదే పదే అర్థం చేయస్తూ ఉంటారు. చాలా మధురంగా అవ్వాలి. దైవీ గుణాలు కూడా ఉండాలి. దేహాభిమానము యొక్క భూతము ఉంటుంది కదా. స్వయంపై చాలా అటెన్షన్ పెట్టుకోవాలి. చాలా ప్రేమతో నడుచుకోవాలి. తండ్రిని స్మృతి చేయండి, చక్రమును స్మృతి చేయండి. చక్ర రహస్యమును ఎవరికి అర్థం చేయించినా ఆశ్చర్యపోతారు. 84 జన్మలే ఎవ్వరికీ గుర్తు లేకపోతే 84 లక్షలు ఎవరైనా ఎలా గుర్తు చేసుకుంటారు. కనీసం ఆలోచించడానికి కూడా అవ్వదు, ఈ చక్రమును గుర్తుంచుకున్నా అహో సౌభాగ్యము! ఇప్పుడీ నాటకము పూర్తి అవుతుంది. కనుక ఈ పాత ప్రపంచముపై వైరాగ్యము కలగాలి. బుద్ధి యోగము శాంతిధామము, సుఖధామములో ఉండాలి. గీతలో కూడా మన్మనాభవ అని ఉంది. గీత పఠనము చేసే వారొక్కరికి కూడా మన్మనాభవకు అర్థము తెలియదు. పిల్లలైన మీకు దీని అర్థము తెలుసు, భగవానువాచ - దేహ సంబంధాలన్నీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ మాటలు చెప్పింది ఎవరు? కృష్ణుడు భగవంతుడు కానే కారు. కొంతమంది, మేము శాస్త్రాలనే అంగీకరిస్తామని అంటారు. భగవంతుడు వచ్చినా నమ్మరు. వారు శాస్త్రాలనే చదువుతూ ఉంటారు. భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు, స్వర్గ స్థాపన జరుగుతూ ఉంది. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. భగవంతునిపై నిశ్చయముంటే వారసత్వము తీసుకోవడంలో నిమగ్నమౌతారు. భక్తి సమాప్తమైపోతుంది. కానీ నిశ్చయమున్నప్పుడే కదా. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. దేవతలుగా అయ్యేందుకు చాలా రాయల్ సంస్కారాలను ధారణ చేయాలి. ఆహార-పానీయాలు చాలా శుద్ధంగా, సాధారణంగా ఉంచుకోవాలి. తినాలనే అత్యాశ ఉండకూడదు. తమ కళ్యాణము చేసుకునేందుకు దైవీ గుణాలు ధారణ చేయాలి.
2. మీపై మీరు అటెన్షన్ పెట్టుకుంటూ, అందరితో చాలా ప్రేమగా వ్యవహరించాలి. మీకంటే సీనియర్లగా ఉన్నవారిని తప్పకుండా గౌరవించాలి. చాలా-చాలా మధురంగా అవ్వాలి. దేహాభిమానములోకి రాకూడదు.
వరదానము:-
దాతృత్వ స్థితి మరియు ఇముడ్చుకునే శక్తి ద్వారా సదా విఘ్నవినాశక్, సమాధాన స్వరూప భవ
విఘ్నవినాశక్, సమాధాన స్వరూపులుగా అయ్యే వరదానం విశేషంగా రెండు విషయాల ఆధారముతో ప్రాప్తిస్తుంది. 1.సదా మేము దాత పిల్లలము కనుక నేను అందరికీ ఇవ్వాలి అనే స్మృతి ఉండాలి. గౌరవం లభిస్తే, స్నేహం లభిస్తే, అప్పుడు స్నేహీగా అవుతాను అని కాదు, నేను ఇవ్వాలి అని ఉండాలి. 2.స్వయం పట్ల మరియు సంబంధ సంపర్కంలో సర్వుల పట్ల ఇముడ్చుకునే శక్తి స్వరూప సాగరునిగా అవ్వాలి. ఈ రెండు విశేషతల ద్వారా శుభభావన, శుభకామనతో సంపన్నమై సమాధాన స్వరూపంగా అవుతారు.
స్లోగన్:-
సత్యాన్ని మీ సహచరునిగా చేసుకుంటే మీ నావ ఎప్పుడూ మునిగిపోదు.