07-04-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - అనంతమైన తండ్రికి విశ్వాసపాత్రులుగా ఉంటే, పూర్తి మైట్ (శక్తి) లభిస్తుంది, మాయపై విజయము లభిస్తూ ఉంటుంది"

ప్రశ్న:-

తండ్రి వద్ద ఉన్న ముఖ్యమైన అథారిటీ ఏమిటి? దాని గుర్తులు ఏమిటి?

జవాబు:-

తండ్రి వద్ద ముఖ్యంగా జ్ఞానం యొక్క అథారిటీ ఉంది. జ్ఞాన సాగరులు కనుక పిల్లలైన మీకు చదువును చదివిస్తారు. తమ సమానంగా నాలెడ్జ్ ఫుల్ గా తయారుచేస్తారు. మీ వద్ద చదువు యొక్క లక్ష్యము ఉద్దేశ్యము ఉంది. చదువు ద్వారానే మీరు ఉన్నత పదవిని పొందుతారు.

గీతము:-

పప్రంచము మారిపోయినా... (బదల్ జాయె దునియా...)

ఓంశాంతి. భక్తులు భగవంతుడిని మహిమ చేస్తారు. ఇప్పుడు మీరు భక్తులు కారు. మీరు ఆ భగవంతుని పిల్లలుగా అయ్యారు. ఇక్కడ కూడా విశ్వాసపాత్రులైన పిల్లలే కావాలి. ప్రతి విషయంలో విశ్వాసపాత్రులుగా ఉండాలి. స్త్రీ దృష్టి పతి వైపు, పతి దృష్టి స్త్రీ వైపు కాకుండా మరోవైపుకు వెళ్తే దానిని అవిశ్వాసపాత్రత అని అంటారు. ఇప్పుడిక్కడ అనంతమైన తండ్రి ఉన్నారు. వారి దగ్గర విశ్వాసపాత్రులు, అవిశ్వాసపాత్రులు - ఇరువురూ ఉన్నారు. విశ్వాసపాత్రులుగా అయి మళ్ళీ విశ్వాసఘాతకులుగా అవుతారు. తండ్రి అత్యున్నతమైన అథారిటీ (అధికారి), ఆల్మైటీ (సర్వశక్తివంతులు) కదా! కనుక వారి పిల్లలు కూడా అలాగే ఉండాలి. తండ్రిలో శక్తి ఉంది కనుక పిల్లలు రావణునిపై విజయము పొందేందుకు యుక్తులు తెలుపుతారు. అందుకే వారిని సర్వశక్తివంతుడని కూడా అంటారు. మీరు కూడా శక్తి సేనయే కదా! మీరు స్వయాన్ని కూడా ఆల్మైటీగా భావిస్తారు. తండ్రిలో ఉన్న మైట్ ను మనకు ఇస్తారు, మాయా రావణునిపై గెలుపు ఎలా పొందగలమో తెలుపుతారు. కనుక మీరు కూడా శక్తివంతులుగా అవ్వాలి. తండ్రి జ్ఞాన అథారిటీ, నాలెడ్జ్ ఫుల్ కదా! ఎలాగైతే వారు శాస్త్రాలకు, భక్తి మార్గానికి అథారిటీగా ఉన్నారో అలా మీరిప్పుడు ఆల్మైటీ అథారిటీగా జ్ఞాన సంపన్నులుగా అవుతారు. మీకు కూడా జ్ఞానము లభిస్తుంది. ఇది పాఠశాల. మీరు ఇక్కడ చదివే జ్ఞానముతో ఉన్నత పదవి పొందగలరు. అటువంటి పాఠశాల ఇది ఒక్కటే. ఇక్కడ మీరు చదువుకోవాలి. ఇతర ప్రార్థనలు మొదలైనవి చేయనవసరము లేదు. మీకు ఈ చదువు ద్వారా వారసత్వము లభిస్తుంది. ఇందులో లక్ష్యముంది. తండ్రి నాలెడ్జ్ ఫుల్ అని పిల్లలైన మీకు తెలుసు. వారి చదువు పూర్తిగా భిన్నమైనది. తండ్రి జ్ఞానసాగరులు కనుక వారికి అన్నీ తెలుసు. వారే మనకు సృష్టి యొక్క ఆది-మధ్య-అంతిమముల జ్ఞానము ఇస్తారు. ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. తండ్రి సన్ముఖముగా వచ్చి జ్ఞానమిచ్చి వెళ్ళిపోతారు. ఈ చదువు ద్వారా ఏ ప్రాలబ్ధం లభిస్తుందో అది కూడా మీకు తెలుసు. మిగతా సత్సంగాలు లేక గురువులు, మఠాధిపతులు మొదలైనవారంతా భక్తి మార్గానికి చెందినవారు. ఇప్పుడు మీకు జ్ఞానము లభిస్తోంది. ఇది కూడా మీకు తెలుసు, వారిలో ఎవరైనా ఇక్కడికి చెందినవారైతే ఇక్కడకు వస్తారు. పిల్లలైన మీరు సేవ కొరకు భిన్న భిన్న యుక్తులు రచించాలి. మీ అనుభవాలను వినిపించి అనేకమంది భాగ్యాన్ని తయారుచేయాలి. సేవాధారి పిల్లలైన మీ స్థితి చాలా నిర్భయంగా, స్థిరంగా, యోగయుక్తంగా ఉండాలి. యోగంలో ఉండి, సేవ చేస్తే సఫలత లభిస్తుంది.

పిల్లలూ, మిమ్ములను మీరు పూర్తిగా సంభాళించుకోవాలి. మీకు ఎప్పుడూ కూడా ఆవేశము మొదలైనవి రాకూడదు. పూర్తిగా యోగయుక్తంగా ఉండాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు - వాస్తవానికి మీరంతా వానప్రస్థులు. వాణి నుండి అతీతమైన స్థితిలో ఉండేవారు. వానప్రస్థులు అనగా వాణి నుండి దూరంగా ఉండే ఇంటిని, తండ్రిని గుర్తు చేసుకునేవారు. ఇది తప్ప ఇక ఏ కోరికా ఉండకూడదు. మాకు మంచి దుస్తులు కావాలి, ఇటువంటి కోరికలన్నీ ఛీ-ఛీ కోరికలు. దేహాభిమానం గలవారు సేవ చెయ్యలేరు. దేహీ అభిమానులుగా అవ్వాల్సి ఉంటుంది. భగవంతుని పిల్లలకు మైట్ కావాలి. అది కూడా యోగ శక్తి. తండ్రికి అయితే పిల్లలందరి గురించి తెలుసు కదా! ఈ ఈ లోపాలు తొలగించుకోమని బాబా వెంటనే చెప్తారు. బాబా అర్థం చేయిస్తున్నారు - శివుని మందిరానికి వెళ్ళండి. అక్కడ మీకు చాలా మంది లభిస్తారు. చాలామంది కాశీకి వెళ్లి నివసిస్తారు. కాశీనాథుడు మా కళ్యాణం చేస్తారని భావిస్తారు. కాశీలో మీకు చాలా మంది కొనుగోలుదారులు లభిస్తారు. కానీ ఇందులో చాలా చురుకైన బుద్ధి గలవారు కావాలి. గంగా స్నానం చేసేవారికి కూడా అర్థం చేయించవచ్చు. మందిరాలకు వెళ్ళి కూడా అర్థం చేయించండి. హనుమంతుని వలె గుప్త వేషంలో వెళ్లండి. వాస్తవానికి హనుమంతుడు మీరే కదా. చెప్పుల మధ్యలోకి వెళ్ళి కూర్చునే విషయం కాదు. ఇందులో చాలా తెలివిగలవారు కావాలి. బాబా అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడింకా ఎవ్వరూ కర్మాతీతులుగా అవ్వలేదు. కొద్దో గొప్పో లోపాలు తప్పకుండా ఉన్నాయి.

ఉండేది ఈ ఒక్క దుకాణమే అని, అందరూ ఇక్కడకే వస్తారని పిల్లలైన మీకు నషా ఉండాలి. ఒక రోజు ఈ సన్యాసులు మొదలైనవారంతా వచ్చేస్తారు. ఉండేది ఒకే దుకాణమైతే ఇంకెక్కడికి వెళ్తారు! ఎవరైతే చాలా భ్రమిస్తూ, వెతుకుతూ ఉంటారో వారికే దారి లభిస్తుంది. ఇది ఒక్కటే దుకాణం అని వారు అర్థం చేసుకుంటారు. అందరి సద్గతిదాత ఒక్క తండ్రే కదా! ఇలా నషా ఎక్కి ఉండాలి. పతితులను పావనంగా చేసి శాంతిధామము, సుఖధామమును వారసత్వంగా ఇచ్చేందుకు నేను వచ్చాను. మీది కూడా ఇదే వ్యాపారము. అందరి కళ్యాణం చేయాలి. ఇది పాత ప్రపంచం, దీని ఆయుష్షు ఎంత? ఈ పాత ప్రపంచం సమాప్తం అవుతుందని త్వరలో తెలుసుకుంటారు. క్రొత్త ప్రపంచ స్థాపన జరిగి పాత ప్రపంచము వినాశనమవుతుందని ఆత్మలందరి బుద్ధిలోకి వస్తుంది. ముందు-ముందు ఖచ్చితంగా ఇక్కడ భగవంతుడు ఉన్నారు అని అంటారు. రచయిత అయిన తండ్రినే మర్చిపోయారు. త్రిమూర్తి చిత్రములో శివుని చిత్రాన్ని తొలగించివేశారు. కనుక అది ఎందుకూ పనికిరాకుండా పోయింది. రచయిత వారే కదా! శివుని చిత్రం ఉంటే బ్రహ్మా ద్వారా స్థాపన అని స్పష్టంగా తెలిసిపోతుంది. ప్రజాపిత బ్రహ్మా ఉంటే తప్పకుండా బి.కెలు కూడా ఉండాలి. బ్రాహ్మణ కులం అన్నిటికంటే శ్రేష్ఠమైనది. మీరంతా బ్రహ్మా సంతానము. బ్రాహ్మణులను ఎలా రచిస్తారో కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రియే వచ్చి మిమ్ములను శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారుచేస్తారు. ఇవి చాలా క్లిష్టమైన విషయాలు. తండ్రి సమ్ముఖంగా వచ్చి అర్థం చేయించినప్పుడు అర్థం చేసుకుంటారు. ఒకప్పుడు దేవతలుగా ఉన్నవారే ఇప్పుడు శూద్రులుగా అయ్యారు. ఇప్పుడు వారిని ఎలా వెతకాలో అందుకు యుక్తులు రచించాలి. ఇది బి.కె.ల భారీ కార్యమని అందరూ అర్థము చేసుకోవాలి. ఎన్నో కరపత్రాలు మొదలైనవి పంచాలి. ఏరోప్లేన్ నుండి కరపత్రాలను విసరాలని కూడా బాబా తెలియజేశారు. కనీసం వార్తాపత్రికంత కాగితం ఉంటే, దానిలో ముఖ్యమైన పాయింట్లు, మెట్ల చిత్రం మొదలైనవి కూడా వచ్చేస్తాయి. ముఖ్యంగా ఇంగ్లీషు, హిందీ భాషలలో ఉండాలి. కనుక పిల్లలకు సేవ ఎలా వృద్ధి చేయాలి? అనే ఆలోచన రోజంతా ఉండాలి. డ్రామా అనుసారంగా పురుషార్థం జరుగుతూ ఉంటుందని కూడా తెలుసు. ఈ సర్వీస్ బాగా చేసేవారి పదవి కూడా ఉన్నతంగా ఉంటుందని కూడా అర్థం చేసుకుంటారు. ప్రతి యాక్టరుకు తమ పాత్ర ఉంది అని ఈ లైను కూడా తప్పకుండా వ్రాయాలి. తండ్రి కూడా ఈ డ్రామాలో నిరాకార ప్రపంచం నుండి వచ్చి సాకార శరీరాన్ని ఆధారంగా తీసుకొని పాత్ర అభినయిస్తున్నారు. ఎవరెవరు ఎంత పాత్రను అభినయిస్తారో ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. కనుక ఈ సృష్టి చక్రం గురించి తెలుసుకుంటే, మనుష్యులు స్వదర్శన చక్రధారులుగా అయి చక్రవర్తి రాజులుగా, విశ్వానికి యజమానులుగా అవ్వగలరని ముఖ్యంగా వ్రాయాలి. మీ వద్ద మొత్తం జ్ఞానమంతా ఉంది కదా! తండ్రి వద్ద ఉన్న గీతా జ్ఞానము ద్వారానే మనుష్యులు నరుని నుండి నారాయణునిగా అవుతారు. ఫుల్ నాలెడ్జ్ బుద్ధిలోకి వచ్చేస్తే ఫుల్ చక్రవర్తి పదవి తీసుకుంటారు. కనుక పిల్లలు ఇలా ఆలోచించి తండ్రి సేవలో నిమగ్నమైపోవాలి.

జైపూర్ లో కూడా ఈ ఆధ్యాత్మిక మ్యూజియం స్థిరంగా ఉంటుంది. అక్కడ ఇలా వ్రాసి ఉంది - ఇది అర్థం చేసుకుంటే మనుష్యులు విశ్వానికి యజమానులుగా అవ్వగలరు. ఇది చూసినవారు ఒకరికొకరు వినిపించుకుంటూ ఉంటారు. పిల్లలు సదా సర్వీసులో ఉన్నారు. మమ్మా కూడా సర్వీసులో ఉన్నారు. వారిని నియమించటం జరిగింది. సరస్వతి ఎవరో ఏ శాస్త్రాలలోనూ లేదు. ప్రజాపిత బ్రహ్మాకు కేవలం ఒక పుత్రికనే ఉంటారా? అనేక పేర్లు కలిగిన అనేకమంది పుత్రికలు ఉంటారు కదా! మీ వలె మమ్మా కూడా దత్తత తీసుకోబడినవారు. ఒక హెడ్ వెళ్లిపోతే మరొకరిని నియమించడం జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ను కూడా మరొకరిని నియమిస్తారు. సమర్థులని భావించినప్పుడు వారిని నియమిస్తారు, వారి టైమ్ పూర్తి అయిపోతే ఇంకొకరిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. తండ్రి పిల్లలకు మొదట ఎవరిని, ఎలా గౌరవించాలో ఆ నడవడికను నేర్పిస్తారు. చదువురాని వారికి ఇతరులను గౌరవించడం కూడా రాదు. బాగా తెలివైనవారినైతే అందరూ గౌరవించాల్సిందే. పెద్దవారిని ఆదరించటం వలన వారు కూడా నేర్చుకుంటారు. చదువురాని వారు తెలివి తక్కువవారుగా ఉంటారు. తండ్రి కూడా చదువురాని వారిని ఉద్ధరించారు. ఈ రోజుల్లో స్త్రీలను ముందుంచుతున్నారు. ఆత్మలమైన మా నిశ్చితార్థము పరమాత్మతో జరిగిందని పిల్లలు తెలుసుకున్నారు. మేమైతే వెళ్ళి విష్ణుపురికి యజమానులవుతామని మీకు చాలా సంతోషం కలుగుతుంది. కన్యల బుద్ధియోగము వరుడిని చూడకపోయినా అతనితో జోడించబడి ఉంటుంది కదా! ఆత్మ-పరమాత్మల ఈ నిశ్చితార్థము చాలా అద్భుతమైనది అని కూడా ఆత్మకు తెలుసు. ఒక్క తండ్రినే గుర్తు చేయాల్సి ఉంటుంది. అక్కడైతే గురువును గుర్తు చేసుకోండి, ఫలానా మంత్రం గుర్తు చేసుకోండి అని చెప్తారు. ఇక్కడైతే అన్నీ తండ్రియే. వారు వచ్చి వీరి ద్వారా నిశ్చితార్థము చేయిస్తారు. నేను మీ తండ్రిని కూడా, నా నుండి వారసత్వము లభిస్తుందని అంటున్నారు. కన్యకు నిశ్చితార్థం జరిగితే వరుడిని మర్చిపోరు, మరి మీరెందుకు మర్చిపోతున్నారు? కర్మాతీత అవస్థ పొందేందుకు టైమ్ పడుతుంది. కర్మాతీత అవస్థకు చేరుకుని ఎవరూ ఇంకా తిరిగి వెళ్ళలేదు. మొదట ప్రియుడు నడిస్తే, అతని వెనుక ఊరేగింపు బయలుదేరుతుంది. శంకరుని ఊరేగింపు కాదు. శివుని ఊరేగింపు. ప్రియుడు ఒక్కరే. మిగిలిన వారందరూ ప్రేయసులు. ఇది శివబాబా ఊరేగింపు. కాని బిడ్డ పేరును పెట్టేశారు. ఉదహరణ ఇచ్చి అర్థం చేయించబడుతుంది. తండ్రి వచ్చి పుష్పాలుగా తయారుచేసి అందరినీ తీసుకెళ్తారు. కామచితిపై కూర్చుని పతితులుగా అయిన పిల్లలను జ్ఞానచితిపై కూర్చోబెట్టి పుష్పాలుగా తయారుచేసి అందరినీ తీసుకెళ్తారు. ఇది పాత ప్రపంచం కదా! కల్ప-కల్పము తండ్రి వస్తారు. ఛీ-ఛీ గా ఉన్న మనలను పుష్పాలుగా చేసి తీసుకెళ్తారు. రావణుడు ఛీ-ఛీ గా చేస్తాడు, శివబాబా పుష్పాలుగా చేస్తారు. అందుకు శివబాబా చాలా యుక్తులు అర్థం చేయిస్తూ ఉంటారు. అచ్ఛా!

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఆహార-పానీయాలకు చెందిన ఛీ-ఛీ కోరికలను వదిలి, దేహీ అభిమానులుగా అయి సేవ చెయ్యాలి. స్మృతి ద్వారా మైట్ తీసుకొని స్థిరమైన నిర్భయ స్థితిని తయారుచేసుకోవాలి.

2. ఎవరైతే చదువులో చురుకుగా, తెలివైనవారిగా ఉంటారో వారిని గౌరవించాలి. భ్రమిస్తూ వెతుకుతూ ఉన్న వారికి దారిని చూపించే యుక్తులు రచించాలి. అందరి కళ్యాణము చెయ్యాలి.

వరదానము:-

తమ తపస్వీ స్వరూపము ద్వారా సర్వులకు ప్రాప్తులను అనుభూతి చేయించే మాస్టర్ విధాత భవ

ఎలాగైతే సూర్యుడు విశ్వానికి వెలుగును మరియు అనేక వినాశి ప్రాప్తులను అనుభూతి చేయిస్తారో, అలా తపస్వీ ఆత్మలైన మీరు మీ తపస్వీ స్వరూపము ద్వారా అందరికీ ప్రాప్తుల కిరణాలను అనుభూతి చేయించండి. అందుకు మొదట జమా ఖాతాను పెంచుకోండి. తర్వాత జమా చేసుకున్న ఖజానాలను మాస్టర్ విధాతగా అయి ఇస్తూ వెళ్లండి. తపస్వీ మూర్తి అంటే అర్థము - తపస్సు ద్వారా శాంతి, శక్తి కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నట్లు అనుభవంలోకి రావాలి.

స్లోగన్:-

స్వయం నమ్రచిత్తులుగా అయి అందరికీ గౌరవం ఇస్తూ నడవండి - ఇదే సత్యమైన పరోపకారము.