14-04-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - మీకు వినాశీ శరీరాలపై ప్రేమ ఉండకూడదు, ఒక్క విదేహీ తండ్రిని మాత్రమే ప్రేమించండి, దేహాన్ని చూస్తున్నా చూడకండి”

ప్రశ్న:-

బుద్ధిని స్వచ్ఛంగా చేసుకునేందుకు పురుషార్థము ఏమిటి ? స్వచ్ఛమైన బుద్ధి కలవారి గుర్తులు ఎలా ఉంటాయి?

జవాబు:-

దేహీ అభిమానులవ్వడం ద్వారానే బుద్ధి స్వచ్ఛంగా అవుతుంది. ఇటువంటి దేహీ అభిమాని పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఒక్క తండ్రిని మాత్రమే ప్రేమిస్తారు. తండ్రి చెప్పేది మాత్రమే వింటారు. కానీ మందబుద్ధి కలవారు దేహాన్ని ప్రేమిస్తారు. దేహమునే అలంకరించుకుంటూ ఉంటారు.

ఓంశాంతి. ఓంశాంతి అని చెప్పింది ఎవరు? వింటున్నది ఎవరు? ఇతర సత్సంగాలలో జిజ్ఞాసువులు వింటారు. మహాత్ములు లేక గురువులు మొదలైనవారు వినిపిస్తున్నారని అంటారు. ఇక్కడ పరమాత్మ వినిపిస్తున్నారు, ఆత్మలు వింటున్నాయి. ఇది క్రొత్త విషయము కదా. ఇక్కడ దేహీ అభిమానులుగా అవ్వవలసి ఉంటుంది. చాలామంది ఇక్కడ కూడా దేహాభిమానులుగా అయి కూర్చుంటారు. పిల్లలైన మీరు దేహీ-అభిమానులుగా అయి కూర్చోవాలి. నేను ఆత్మను, ఈ శరీరములో విరాజమానమై ఉన్నాను. శివబాబా మాకు అర్థం చేయిస్తున్నారని బుద్ధిలో బాగా గుర్తుండాలి. ఆత్మనైన నా సంబంధము పరమాత్మతో ఉందని గుర్తుండాలి. పరమపిత పరమాత్మ వచ్చి ఈ శరీరము ద్వారా వినిపిస్తున్నారు. కనుక ఇతను ఒక మధ్యవర్తి మాత్రమే. మీకు అర్థం చేయించేవారు ఆ శివబాబాయే. ఇతనికి కూడా వారసత్వమునిచ్చేవారు వారే కనుక మీ బుద్ధి అటువైపు వెళ్ళాలి. ఒక తండ్రికి 5-7 మంది పిల్లలున్నారనుకోండి, వాళ్ళ బుద్ధియోగము తండ్రి వైపు ఉంటుంది కదా. ఎందుకంటే వారికి తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది, సోదరుని నుండి వారసత్వము లభించదు. వారసత్వము ఎల్లప్పుడూ తండ్రి నుండే లభిస్తుంది. ఆత్మ నుండి ఆత్మకు వారసత్వము లభించదు. ఆత్మల రూపములో మనమంతా సోదరులమని మీకు తెలుసు. ఆత్మలైన మనందరి కనెక్షన్ ఒక్క పరమపిత పరమాత్మతోనే ఉంది. వారు చెప్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. నా ఒక్కరితోనే మీ ప్రీతిని పెట్టుకోండి. రచనతో ప్రీతిని పెట్టుకోకండి. ఆత్మాభిమానులుగా అవ్వాలి. నన్ను తప్ప ఏ ఇతర దేహధారులను స్మృతి చేసినా, దానిని దేహాభిమానమని అంటారు. ఈ దేహధారి మీ ఎదుట ఉన్నా మీరు ఇతడిని చూడకండి. బుద్ధిలో సదా వారి(శివబాబా) స్మృతి ఉండాలి. ప్రపంచములోని వారు కేవలం మాటవరుసకు అందరూ భాయి-భాయి (సోదరులు) అని అంటారు. ఆత్మలైన మనమంతా పరమపిత పరమాత్ముని సంతానమని ఇప్పుడు మీకు తెలుసు. వారసత్వము తండ్రి అయిన పరమాత్ముని నుండి లభిస్తుంది. తండ్రి చెప్తున్నారు - మీ ప్రేమ నా ఒక్కరితోనే ఉండాలి. నేనే స్వయంగా వచ్చి ఆత్మలైన మీ నిశ్చితార్థము నాతో చేయిస్తాను, దేహధారులతో కాదు. ఇక్కడ ఉన్న ఇతర సంబంధాలన్నీ దేహధారులవే. ఈ సమయంలో మీరు దేహీ అభిమానులుగా అవ్వాలి. ఆత్మలైన మనము తండ్రి ద్వారా వింటున్నాము. కనుక బుద్ధి తండ్రి వైపు వెళ్ళాలి. తండ్రి వీరి ఆత్మ ప్రక్కన కూర్చుని మనకు జ్ఞానమునిస్తున్నారు. వారు ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నారు. ఆత్మ శరీరమనే ఇంటిలోకి వచ్చి పాత్రను అభినయిస్తుంది. ఎలాగైతే వారు ఫ్రీగా ఉన్నా పాత్రను అభినయించేందుకు స్వయాన్ని అండర్ హౌస్ అరెస్ట్ (గృహ నిర్బంధం) చేసుకుంటారో, అలా ఆత్మ ఇందులో ప్రవేశించి స్వయాన్ని ఈ ఇంటిలో బంధించుకొని పాత్రను అభినయిస్తుంది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకొని పాత్రను అభినయిస్తుంది. ఈ సమయంలో ఎవరెంత దేహీ-అభిమానులుగా ఉంటారో వారు అంత ఉన్నత పదవిని పొందుతారు. ఈ బాబా శరీరముపై కూడా మీకు ప్రీతి ఉండకూడదు, కొద్దిగా కూడా ఉండకూడదు. ఈ శరీరము దేనికీ పనికి రాదు. కేవలం మీకు అర్థం చేయించేందుకే నేను ఈ శరీరములోకి ప్రవేశిస్తాను. ఇది రావణ రాజ్యము, పరాయి దేశము. రావణుడిని కాలుస్తారు కానీ ఎందుకు కాలుస్తారో తెలియదు. చిత్రాలు మొదలైనవి వేటినైతే తయారుచేస్తారో వాటి గురించి వారికే తెలియదు. పూర్తిగా మందబుద్ధి కలవారిగా ఉన్నారు. రావణ రాజ్యములో అందరూ మందబుద్ధి కలవారిగా అయిపోతారు. దేహాభిమానులుగా ఉన్నారు కదా. తుచ్ఛబుద్ధి కలవారిగా అయిపోయారు. తండ్రి చెప్తున్నారు - మందబుద్ధి కలవారిగా ఉన్నవారు దేహమునే స్మృతి చేస్తూ ఉంటారు. దేహమునే ప్రేమిస్తూ ఉంటారు. స్వచ్ఛ బుద్ధి కలవారు స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మను స్మృతి చేసి పరమాత్మ ద్వారానే వింటూ ఉంటారు, ఇందులోనే శ్రమ ఉంది. ఇతను కేవలం తండ్రి రథము. చాలామందికి ఈ రథముపై ప్రేమ ఏర్పడింది. ఉదాహరణకు హుస్సేన్ గుర్రాన్ని ఎంతగా అలంకరిస్తారు! అయితే మహిమ ఎవరిది? హుస్సేన్ ది కదా. గుర్రానిదైతే కాదు. తప్పకుండా హుస్సేన్ (భగవంతుడి) ఆత్మ మనుష్య శరీరములోనే వచ్చి ఉంటుంది కదా. అయితే వారికి ఈ విషయాలు అర్థము కావు. వాస్తవానికి ఇప్పుడు దీనిని రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞము అని అంటారు. అశ్వము అనే పదము విని వారు గుర్రముగా భావించారు, యజ్ఞము చేసి అందులో గుర్రాన్ని స్వాహా చేస్తారు. ఈ కథలన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఇప్పుడు వీరు మిమ్ములను చాలా సుందరంగా చేసే ప్రయాణికుడు కదా.

మొదట మనము తెల్లగా ఉండేవారిమి, తర్వాత నల్లగా అయ్యామని ఇప్పుడు మీకు తెలుసు. ఏ ఆత్మలైనా మొట్టమొదట పరంధామము నుండి వచ్చినప్పుడు సతోప్రధానంగా ఉండి తర్వాత సతో, రజో, తమోలోకి వస్తాయి. తండ్రి వచ్చి అందరినీ సుందరంగా చేస్తారు. ధర్మ స్థాపన కొరకు వచ్చిన ఆత్మలన్నీ సుందరంగా ఉంటాయి, తర్వాత కామచితిపై కూర్చుని నల్లగా అయిపోతాయి. మొదట సుందరంగా, తర్వాత శ్యామంగా అవుతాయి. ఈ ఆత్మ(బ్రహ్మా) మొదటి నంబరులో మొట్టమొదట వస్తారు కనుక అందరికంటే ఎక్కువ సుందరంగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణుల వంటి సహజ సౌందర్యము ఇతరులెవ్వరికీ ఉండదు. ఇది జ్ఞానానికి సంబంధించిన విషయము. భలే క్రైస్తవులు భారతీయుల కంటే సుందరంగా (తెల్లగా) ఉంటారు ఎందుకంటే వారు అటువైపు ఉంటారు, కానీ సత్యయుగములో సహజ సౌందర్యముంటుంది. ఆత్మ, శరీరము రెండూ సుందరంగా ఉంటాయి. ఈ సమయంలో అందరూ పతితమై నల్లగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి అందరినీ సుందరంగా చేస్తారు. మొదట సతోప్రధానంగా, పవిత్రంగా ఉంటారు. తర్వాత క్రిందికి దిగుతూ-దిగుతూ కామచితిపై కూర్చుని నల్లగా అయిపోతారు. ఇప్పుడు ఆత్మలన్నిటినీ పవిత్రంగా చేసేందుకు తండ్రి వచ్చారు. తండ్రిని స్మృతి చేస్తేనే మీరు పావనంగా అవుతారు. కనుక వారొక్కరినే స్మృతి చేయాలి. దేహధారులపై ప్రీతి ఉండకూడదు. మేము ఒక్క తండ్రి వారమని, సర్వస్వమూ వారేనని బుద్ధిలో ఉండాలి. ఈ కనులతో చూసేదంతా వినాశనమైపోతుంది. చూసే ఈ కనులు కూడా సమాప్తమైపోతాయి. పరమపిత పరమాత్మనైతే త్రినేత్రి అని అంటారు, వారికి జ్ఞానం యొక్క మూడవ నేత్రముంది. వారికి త్రినేత్రి, త్రికాలదర్శి, త్రిలోకనాథుడు అనే టైటిల్స్ లభించాయి. ఇప్పుడు మీకు మూడు లోకాల జ్ఞానముంది. తర్వాత ఇది మాయమైపోతుంది. ఎవరిలో జ్ఞానముందో వారే వచ్చి ఇస్తారు. మీకు తండ్రి 84 జన్మల జ్ఞానము వినిపిస్తున్నారు. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను మిమ్ములను పావనంగా చేసేందుకు ఈ శరీరములో ప్రవేశించాను. నన్ను స్మృతి చేస్తేనే మీరు పావనంగా అవుతారు. ఇతరులెవ్వరిని స్మృతి చేసినా సతోప్రధానంగా అవ్వలేరు. పాపాలు నశించకపోతే వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి అని అంటారు. మనుష్యులైతే చాలా అంధశ్రద్ధలో ఉన్నారు. దేహధారుల పట్లనే మోహం పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు దేహీ-అభిమానులుగా అవ్వాలి. ఒక్కరిలోనే మోహం ఉండాలి. ఇతరులెవ్వరిలోనైనా మోహముంటే, వారు తండ్రితో విపరీత బుద్ధికలవారు. తండ్రి అయిన నన్నొక్కరినే స్మృతి చేయమని తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తారు. శ్రమ ఉండేది ఇందులోనే. పతితులైన మమ్ములను పావనంగా చేయమని కూడా మీరంటారు. పావనంగా చేసేది తండ్రి ఒక్కరే. పిల్లలైన మీకు 84 జన్మల చరిత్ర-భూగోళమంతా ఆ తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు. అది సహజమే కదా. అన్నింటికంటే కష్టమైన సబ్జెక్టు స్మృతే. తండ్రితో యోగము ఉంచడంలో ఎవ్వరూ చురుకుగా లేరు.

ఏ పిల్లలైతే స్మృతి చేయడంలో చురుగ్గా లేరో వారు పండితుని వంటివారు. జ్ఞానములో భలే ఎంత చురుకుగా ఉన్నా, స్మృతిలో లేకుంటే వారు పండితులే. బాబా ఒక పండితుని కథ వినిపిస్తూ ఉంటారు కదా. ఎవరికైతే వినిపించారో వారు పరమాత్ముడిని స్మృతి చేసి నదిని దాటేసారు. ఈ ఉదాహరణ కూడా మీ కొరకే. తండ్రిని స్మృతి చేస్తే మీరు ఆవలి తీరానికి చేరుకుంటారు. కేవలం మురళిలో మాత్రమే చురుకుగా ఉంటే ఆవలి తీరానికి వెళ్ళలేరు. స్మృతి చేయకుంటే వికర్మలు వినాశనమవ్వవు. ఈ ఉదహరణలు అన్నీ తయారుచేసినవి. తండ్రి కూర్చుని వీటి యథార్థమైన అర్థమును అర్థం చేయిస్తారు, వారికి నిశ్చయం ఏర్పడింది. పరమాత్మను స్మృతి చేస్తే ఆవలి తీరానికి చేరుకుంటారనే ఒక్క మాటను గట్టిగా పట్టుకున్నారు. కేవలం జ్ఞానము ఉండి యోగము లేకుంటే ఉన్నత పదవిని పొందలేరు. స్మృతిలో ఉండని ఇటువంటివారు చాలామంది ఉన్నారు. ముఖ్యమైనది యోగమే. చాలామంది మంచి మంచి సేవలు చేసేవారున్నారు. కానీ బుద్ధియోగము సరిగ్గా లేకుంటే ఎక్కడో ఒకచోట చిక్కుకుంటారు. యోగము చేసేవారు ఎప్పుడూ దేహాభిమానములో చిక్కుకోరు. వారికి అశుద్ధ సంకల్పాలు రావు. స్మృతిలో కచ్చాగా(అపరిపక్వంగా) ఉంటే తుఫానులు వస్తాయి. యోగము ద్వారా కర్మేంద్రియాలు పూర్తిగా వశమైపోతాయి. తండ్రి తప్పొప్పులను అర్థము చేసుకునే బుద్ధి కూడా ఇస్తారు. ఇతరుల దేహాల వైపు బుద్ధి వెళ్లినందుకు 'విపరీత బుద్ధి వినశ్యంతి' అవుతారు. జ్ఞానము వేరు, యోగము వేరు. యోగము ద్వారా ఆరోగ్యము, జ్ఞానము ద్వారా ఐశ్వర్యము లభిస్తాయి. యోగము ద్వారా శరీర ఆయువు పెరుగుతుంది, ఆత్మ చిన్నదిగా-పెద్దదిగా అవ్వదు. నా శరీర ఆయువు పెరుగుతుందని ఆత్మ చెప్తుంది. ఇప్పుడు ఆయువు చిన్నదిగా ఉంది, రాబోయే అర్ధకల్పము కొరకు శరీర ఆయువు పెరుగుతుంది. మనము తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతాము. ఆత్మ పవిత్రమవుతుంది. ఆత్మను పవిత్రంగా తయారుచేసుకోవడం పైననే అంతా ఆధారపడి ఉంది. పవిత్రంగా అవ్వకుంటే పదవి కూడా పొందలేరు.

చార్టు పెట్టడంలో పిల్లలను మాయ సోమరిగా చేసేస్తుంది. పిల్లలు స్మృతియాత్ర యొక్క చార్టును చాలా అభిరుచితో పెట్టాలి. మేము తండ్రిని స్మృతి చేస్తున్నామా లేక ఎవరైనా బంధు-మిత్రులు మొదలైనవారి వైపు బుద్ధి వెళుతూ ఉందా? అని పరిశీలించుకోవాలి. మొత్తం రోజంతా స్మృతి ఎంత సేపు ఉంది? లేక ప్రీతి ఎవరిపై ఉంది? ఎంత సమయము వృథా చేశాను? వీటిని గురించి చార్టు వ్రాయాలి. కానీ రెగ్యులర్ గా చార్టును వ్రాసే శక్తి ఎవ్వరిలోనూ లేదు. అరుదుగా ఎవరో ఒకరు వ్రాస్తారు. మాయ చార్టును పూర్తిగా వ్రాయనివ్వదు. సోమరులుగా చేసేస్తుంది, చురుకుదనముండదు. నన్నొక్కరినే స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. నేను ప్రేయసులందరికీ ప్రియుడను. మరి ప్రియుడిని స్మృతి చేయాలి కదా. ప్రియుడైన తండ్రి చెప్తున్నారు - మీరు నన్ను అర్ధకల్పము స్మృతి చేశారు. ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయని నేను చెప్తున్నాను. ఇటువంటి సుఖమునిచ్చే తండ్రిని ఎంత స్మృతి చేయాలి! మిగిలిన వారందరూ దుఃఖమునిచ్చేవారు. వారు ఎందుకూ పనికొచ్చేవారు కాదు. అంతిమ సమయంలో తండ్రి అయిన పరమాత్ముడు ఒక్కరు మాత్రమే పనికి వస్తారు. అంతిమ సమయం - ఒకటి హద్దులోనిది, రెండవది అనంతమైనది.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - మంచిరీతిగా స్మృతి చేస్తూ ఉంటే అకాలమృత్యువు జరగదు. మిమ్ములను అమరులుగా చేస్తుంది. మొదట తండ్రితో ప్రీతిబుద్ధి కలిగి ఉండాలి. ఎవరి శరీరముపై అయినా ప్రీతి ఉంటే క్రింద పడిపోతారు. ఫెయిల్ అయిపోతారు. చంద్రవంశములోకి వెళ్ళిపోతారు. స్వర్గమని సత్యయుగీ సూర్యవంశీ రాజధానినే అంటారు. త్రేతా యుగమును కూడా స్వర్గమని అనరు. అదేవిధంగా ద్వాపర మరియు కలియుగాలు ఉన్నాయి, కలియుగమును రౌరవ నరకమని, తమోప్రధానమని అంటారు. ద్వాపరయుగమును ఇలా అనరు. తమోప్రధానము నుండి సతోప్రధానంగా అయ్యేందుకు స్మృతి చేయాలి. మాకు ఫలానావారితో చాలా ప్రీతి ఉందని స్వయం కూడా అర్థము చేసుకుంటారు. వారి ఆధారము లేకుంటే మాకు కళ్యాణము జరగదు అని భావిస్తారు. ఒకవేళ ఇటువంటి స్థితిలో మరణిస్తే ఏమైపోతుంది. వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి అవుతారు. దుమ్ము, ధూళితో సమానమైన అనగా విలువలేని చాలా చిన్న పదవిని పొందుతారు.

ఈనాటి ప్రపంచంలో ఫ్యాషన్లు కూడా చాలా కష్టపెడ్తున్నాయి. తమ వైపు ఆకర్షించుకునేందుకు శరీరాన్ని ఎంతగానో అలంకరించుకుంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, ఎవరి నామరూపాలలోనూ చిక్కుకోకండి. లక్ష్మీనారాయణుల డ్రస్సు ఎంత రాయల్ గా ఉందో చూడండి. అది శివాలయము, దీనిని వేశ్యాలయమని అంటారు. ఈ దేవతల ముందుకెళ్లి మేము వేశ్యాలయములో నివసించేవారమని చెప్తారు. ఈవేళ, రేపు ఫ్యాషన్లు చాలా కష్టపెడ్తున్నాయి. అందరి దృష్టి వారి మీద పడ్తుంది, ఎత్తుకొని వెళ్ళిపోతారు. సత్యయుగంలో అయితే నడవడిక నియమానుసారంగా ఉంటుంది. అక్కడ సహజ సౌందర్యము ఉంటుంది కదా. అంధశ్రద్ధ మాటే ఉండదు. ఇక్కడవారిని చూస్తూనే మనసు వారి వైపుకు వెళ్ళిపోతుంది, ఇతర ధర్మాల వారిని కూడా వివాహము చేసుకుంటారు. ఇప్పుడు మీది ఈశ్వరీయ బుద్ధి. రాతి బుద్ధి నుండి పారస బుద్ధిగా, తండ్రి తప్ప ఇతరులెవ్వరూ తయారుచేయలేరు. వారిది రావణ సంప్రదాయము, ఇప్పుడు మీరు రాముని సంప్రదాయము వారిగా అయ్యారు. పాండవులు, కౌరవులు ఒకే సంప్రదాయానికి చెందినవారు. ఇక యాదవులనగా యూరోపు వాసులు. యాదవులనగా యూరోపు వాసులని గీత ద్వారా ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. వారు యాదవ సంప్రదాయము కూడా ఇక్కడిదేనని చెప్తారు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు - యాదవులనగా యూరోపు వాసులు, వారు తమ వినాశనము కొరకు ఈ మూసలము(మిస్సైల్స్) మొదలైనవి తయారుచేశారు. పాండవులు విజయము పొందుతారు. వారు వెళ్ళి స్వర్గానికి యజమానులుగా అవుతారు. పరమాత్మనే స్వయంగా వచ్చి స్వర్గ స్థాపన చేస్తారు. శాస్త్రాలలో అయితే పాండవులు పర్వతాలపై కరిగిపోయి మరణించారని వ్రాసేశారు. దాని వలన ఏం లాభము వచ్చింది? ఏ మాత్రము అర్థమే లేదు. రాతి బుద్ధికలవారు కదా. డ్రామా రహస్యము గురించి ఎవ్వరికీ కొంచెము కూడా తెలియదు. బాబా వద్దకు పిల్లలు వస్తారు. భలే నగలు మొదలైనవి ధరించండి అని చెప్తాను. అప్పుడు పిల్లలు, ఇక్కడ నగలెక్కడ శోభిస్తాయి, పతిత ఆత్మల పతిత శరీరాలకు నగలేం శోభిస్తాయి! అని అంటారు. అక్కడ మనము నగలు మొదలైన వాటితో అలంకరింపబడి ఉంటాము. లెక్కలేనంత ధనముంటుంది. అందరూ చాలా-చాలా సుఖంగా ఉంటారు. భలే వీరు రాజు, మేము ప్రజలు అని ఫీల్ అవుతాము కానీ దుఃఖమనే మాటే ఉండదు. ఇక్కడ ధాన్యము మొదలైనవి లభించకపోతే మనుష్యులు దుఃఖపడ్తారు. అక్కడైతే అన్నీ లభిస్తాయి. నోటి ద్వారా దుఃఖమనే మాటే వెలువడదు. దాని పేరే స్వర్గము. యూరోపువాసులు దానిని ప్యారడైజ్ అని అంటారు. అక్కడ దేవీ దేవతలుండేవారని భావిస్తారు. అందుకే వారి చిత్రాలు కూడా చాలా కొంటారు. అయితే ఆ స్వర్గమెక్కడకు వెళ్ళిపోయిందో ఎవ్వరికీ తెలియదు. ఈ చక్రమెలా తిరుగుతుందో ఇప్పుడు మీకు తెలుసు. క్రొత్తది పాతదిగా, మళ్ళీ పాతదే కొత్త ప్రపంచంగా అవుతుంది. దేహీ-అభిమానులుగా అవ్వడంలో చాలా శ్రమ ఉంది. మీరు దేహీ అభిమానులుగా అవ్వడంతో ఈ అనేక జబ్బులు మొదలైనవాటి నుండి విడుదల అవ్వగలరు. తండ్రిని స్మృతి చేస్తే ఉన్నత పదవిని పొందుతారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఏ దేహధారులను మీరు ఆధారంగా చేసుకోకూడదు. శరీరాలపై ప్రీతి పెట్టుకోకూడదు. ఒక్క తండ్రిపైనే హృదయపూర్వక ప్రీతిని పెట్టుకోవాలి. ఎవ్వరి నామ రూపాలలో చిక్కుకోకూడదు.

2. స్మృతి చార్టును అభిరుచితో వ్రాయాలి. ఇందులో సోమరులుగా అవ్వకూడదు. నా బుద్ధి ఎవరి వైపు అయినా వెళ్తూ ఉందా? ఎంత సమయము వృథా చేశాను? సుఖమునిచ్చే తండ్రి ఎంత సమయం గుర్తుంటారు? అని చార్టులో పరిశీలించుకోవాలి.

వరదానము:-

విశ్వమహారాజు పదవిని ప్రాప్తి చేసుకునే సర్వ శక్తుల స్టాకుతో సంపన్న భవ

ఎవరైతే విశ్వమహారాజు పదవిని ప్రాప్తి చేసుకునే ఆత్మలుగా ఉంటారో వారి పురుషార్థము కేవలం స్వయం పట్ల మాత్రమే ఉండదు. స్వయం యొక్క జీవితంలో వచ్చే విఘ్నాలను లేక పరీక్షలను దాటడం అనేది చాలా కామన్ విషయం. కానీ ఎవరైతే విశ్వమహారాజులుగా అయ్యే ఆత్మలుగా ఉంటారో వారి వద్ద ఇప్పటి నుండే సర్వ శక్తుల స్టాకు నిండుగా ఉంటుంది. వారి ప్రతి సెకండు, ప్రతి సంకల్పము ఇతరుల పట్ల ఉంటుంది. తనువు, మనసు, ధనము, సమయము, శ్వాస అన్నీ విశ్వకళ్యాణంలో సఫలమవుతూ ఉంటాయి.

స్లోగన్:-

ఒక్క బలహీనత ఉన్నా అది అనేక విశేషతలను సమాప్తం చేస్తుంది, అందుకే బలహీనతలకు విడాకులివ్వండి.