ఓంశాంతి. మిమ్ములను పొంది మేము మొత్తం విశ్వానికంతా రాజ్య పదవిని పొందుతామని అన్నదెవరు ? ఇప్పుడు మీరు విద్యార్థులు కూడా, పిల్లలు కూడా. అనంతమైన తండ్రి పిల్లలైన మనలను విశ్వానికి యజమానులుగా చేసేందుకు వచ్చారని మీకు తెలుసు. వారి ఎదుటనే మనము కూర్చుని రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము అనగా విశ్వానికి కిరీటధారులైన రాకుమారులు-రాకుమారీలుగా అయ్యేందుకు మీరు ఇక్కడకు చదువుకునేందుకు వచ్చారు. ఈ పాట భక్తి మార్గములో గాయనం చేయబడినది. బుద్ధి ద్వారా మేము విశ్వ మహారాజా-మహారాణులుగా అవుతామని పిల్లలు తెలుసుకున్నారు. తండ్రి జ్ఞానసాగరులు. సుప్రీమ్ ఆత్మిక టీచర్. వారు కూర్చుని ఆత్మలను చదివిస్తున్నారు. ఆత్మకు ఈ శరీరము రూపి కర్మేంద్రియాల ద్వారా తెలుసు, మేము తండ్రి ద్వారా విశ్వ కిరీటాన్ని ధరించే యువరాజు-యువరాణులుగా అయ్యే పాఠశాలలో కూర్చున్నాము అని. మరి ఎంత నషా ఉండాలి! మీ హృదయాన్ని మీరే ప్రశ్నించుకోండి - ఇంత నషా విద్యార్థులైన మాలో ఉందా? ఇదేమీ క్రొత్త విషయము కూడా కాదు. మనము కల్ప-కల్పము విశ్వ యువరాజు-యువరాణులుగా అయ్యేందుకు తండ్రి వద్దకు వచ్చాము. ఆ తండ్రి, తండ్రి కూడా, శిక్షకుడు కూడా. తండ్రి అడిగితే అందరూ మేము సూర్యవంశీ కిరీటధారి రాకుమార-రాకుమార్తెలు లేక లక్ష్మీనారాయణులుగా అవుతామని చెప్తారు. అయితే మేము అటువంటి పురుషార్థము చేస్తున్నామా అని మీ మనసును మీరే ప్రశ్నించుకోండి. స్వర్గ వారసత్వమును ఇచ్చేందుకు వచ్చిన అనంతమైన తండ్రి - మన తండ్రే కాక, టీచర్, గురువు కూడా అయ్యారు. కనుక తప్పకుండా ఇంత శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన వారసత్వము కూడా ఇస్తారు. నేడు చదువుకుంటున్నాము, రేపు కిరీటధారి యువరాజులుగా అవుతాము అనే సంతోషముందా అని పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఇది సంగమ యుగము కదా. ఇప్పుడు ఈ తీరములో ఉన్నారు, ఆ తీరానికి అంటే స్వర్గానికి వెళ్ళేందుకు చదువుకుంటున్నారు. అక్కడకు సర్వగుణ సంపన్నులుగా, 16 కళా సంపూర్ణులుగా అయ్యే వెళ్తాము. నేను అలా యోగ్యంగా అయ్యానా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. ఇది భక్తుడైన ఒక్క నారదుని విషయము కాదు. మీరందరూ భక్తులుగా ఉండేవారు. ఇప్పుడు తండ్రి భక్తి నుండి విడిపిస్తారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు తండ్రి పిల్లలుగా అయ్యామని, విశ్వ కిరీటధారి రాకుమారులుగా అయ్యేందుకు వచ్చామని, మీకు తెలుసు. తండ్రి చెప్తున్నారు, భలే మీ గృహస్థ వ్యవహారములో ఉండండి. వానప్రస్థులు గృహస్థ వ్యవహారములో ఉండే అవసరము లేదు, అలాగే కుమార-కుమారీలు కూడా గృహస్థ వ్యవహారములో ఉండరు. వారిది కూడా విద్యార్థి జీవితమే. బ్రహ్మచర్యములోనే చదువును చదువుకుంటారు. ఇప్పుడు ఈ చదువు చాలా ఉన్నతమైనది. ఇందులో సదాకాలానికి పవిత్రంగా అవ్వాలి. వారు బ్రహ్మచర్యములో చదువుకొని తర్వాత వికారాల్లోకి వెళ్తారు. ఇక్కడ మీరు బ్రహ్మచర్యములో ఉండి పూర్తి చదువును చదువుతారు. తండ్రి చెప్తున్నారు, నేను పవిత్రతా సాగరుడను, మిమ్ములను కూడా అలాగే చేస్తాను. అర్ధకల్పము మనము పవిత్రంగా ఉండేవారమని మీకు తెలుసు. బాబా, మేము పవిత్రంగా అయ్యి, పవిత్ర ప్రపంచానికి యజమానులుగా ఎందుకు అవ్వము అని తండ్రితో ప్రతిజ్ఞ చేశారు. ఎంత గొప్ప తండ్రి! భలే సాధారణ శరీరమే కావచ్చు కానీ ఆత్మకు నషా ఎక్కుతుంది కదా. పవిత్రంగా చేసేందుకు తండ్రి వచ్చారు. మీరు వికారాల్లోకి వెళుతూ-వెళుతూ వేశ్యాలయములో వచ్చి పడ్డారని తండ్రి చెప్తున్నారు. మీరు సత్యయుగములో పవిత్రంగా ఉండేవారు. ఈ రాధా-కృష్ణులు పవిత్ర రాకుమార-రాకుమారీలు కదా. రుద్రమాలను కూడా చూడండి. విష్ణుమాలను కూడా చూడండి. రుద్రమాలయే విష్ణుమాలగా అవుతుంది. వైజయంతి మాలలో వచ్చేందుకు తండ్రి అర్థము చేయిస్తున్నారు - మొదట నిరంతరం తండ్రిని స్మృతి చేయండి, మీ సమయాన్ని వృథా చేయకండి. ఈ గవ్వల వెనుక కోతులుగా అవ్వకండి. కోతులు శెనగలు తింటాయి. ఇప్పుడు తండ్రి మీకు రత్నాలను ఇస్తున్నారు. ఇంకా మీరు గవ్వలు లేక శెనగల వెనుక వెళ్తే మీ గతి ఏమవుతుంది? రావణుని జైలులోకి వెళ్తారు. తండ్రి వచ్చి రావణుని జైలు నుండి విడిపిస్తారు. వారు చెప్తున్నారు - దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను బుద్ధి ద్వారా త్యాగము చేయండి. స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోండి. నేను కల్ప-కల్పము భారతదేశములోనే వస్తానని తండ్రి చెప్తున్నారు. భారతవాసులైన పిల్లలను విశ్వకిరీటధారులైన రాకుమార-రాకుమారీలుగా చేస్తాను. ఎంత సహజంగా చదివిస్తారు. 4-8 గంటలు కూర్చోండి అని కూడా చెప్పరు. గృహస్థ వ్యవహారములో ఉంటూ స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేస్తే మీరు పతితుల నుండి పావనంగా అవుతారు. వికారాలలోకి వెళ్లేవారిని పతితులని అంటారు. దేవతలు పావనులు కనుక వారు మహిమ చేయబడ్డారు. అది అల్పకాల క్షణ భంగుర సుఖమని తండ్రి చెప్తున్నారు. కాకిరెట్టతో సమానమైన సుఖమని సన్యాసులు సరిగ్గా చెప్తారు. కానీ దేవతలకు ఎంత సుఖముంటుందో వారికి తెలియదు. దాని పేరే సుఖధామము. ఇది దుఃఖధామము. ఈ విషయాలను గురించి ప్రపంచములోని వారెవ్వరికీ తెలియదు. తండ్రియే కల్ప-కల్పము వచ్చి అర్థము చేయిస్తారు. దేహీ అభిమానులుగా చేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు ఆత్మలు, దేహము కాదు. దేహానికి మీరు యజమానులు. దేహము మీ యజమాని కాదు. 84 జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు మీరు తమోప్రధానంగా అయిపోయారు. మీ ఆత్మ మరియు శరీరము రెండూ పతితమైపోయాయి. దేహాభిమానులుగా అవ్వడం వలన మీ ద్వారా పాపాలు జరిగాయి. ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా అవ్వాలి. నాతో పాటు తిరిగి ఇంటికి రావాలి. ఆత్మ మరియు శరీరము రెండింటినీ పావనం చేసుకునేందుకు తండ్రి చెప్తున్నారు - "మన్మనాభవ.” తండ్రి మీకు రావణుడి నుండి అర్ధకల్పము స్వతంత్రమిప్పించారు. ఇప్పుడు మళ్లీ స్వతంత్రమును ఇప్పిస్తున్నారు. అర్ధకల్పము మీరు స్వతంత్రంగా రాజ్యము చేయండి. అక్కడ 5 వికారాల మాటే ఉండదు. ఇప్పుడు శ్రీమతమును అనుసరించి శ్రేష్ఠంగా అవ్వాలి. మిమ్ములను మీరే ప్రశ్నించుకోండి - మాలో ఇంకా ఎంతవరకు వికారాలు ఉన్నాయి? తండ్రి చెప్తున్నారు - ఒకటేమో సదా నన్నొక్కరినే స్మృతి చేయండి, ఎటువంటి యుద్ధాలు, గొడవలు కూడా చేయకూడదు. లేకుంటే మీరు పవిత్రంగా ఎలా అవుతారు? మీరు పురుషార్థము చేసి మాలలో కూర్చబడేందుకే ఇక్కడకు వచ్చారు. పాస్ అవ్వకుంటే మాలలో త్రిప్పబడలేరు. కల్ప-కల్పము చక్రవర్తి పదవిని పోగొట్టుకుంటారు. తర్వాత చివర్లో చాలా పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఆ చదువులో కూడా రిజిస్టరు ఉంటుంది. లక్షణాలను కూడా చూస్తారు. ఇది కూడా చదువే. ఉదయమే లేచి మీరు స్వయమే ఈ చదువు చదువుకోండి. పగటి పూట కర్మలు చేయాల్సిందే. ఖాళీ దొరకదు. కనుక భక్తి కూడా మనుష్యులు ఉదయమే లేచి చేస్తారు. ఇది జ్ఞాన మార్గము. భక్తిలో కూడా పూజ చేస్తూ చేస్తూ బుద్ధిలో ఎవరో ఒక దేహధారి స్మృతి వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మీరు తండ్రిని స్మృతి చేస్తారు కానీ వ్యాపారము మొదలైనవి స్మృతిలోకి వచ్చేస్తాయి. ఎంతెంత తండ్రి స్మృతిలో ఉంటారో అంత పాపాలు సమాప్తమవుతూ ఉంటాయి.
పిల్లలైన మీరు పురుషార్థము చేస్తూ చేస్తూ పూర్తి పవిత్రమైనప్పుడు ఈ మాల తయారవుతుంది. పూర్తి పురుషార్థము చేయలేదంటే ప్రజలలోకి వెళ్ళిపోతారు. బాగా యోగము చేసి చదువుకొని తమకు సంబంధించినదంతా భవిష్యత్తు కొరకు బదిలీ చేస్తే ప్రతిఫలము భవిష్యత్తులో లభిస్తుంది. ఈశ్వరార్థంగా ఇస్తే దాని ఫలితము తర్వాత జన్మలో లభిస్తుంది కదా. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - నేను ప్రత్యక్షంగా వచ్చాను. ఇప్పుడు మీరేం చేసినా మీ కొరకే చేసుకుంటారు. మనుష్యులు చేసే దాన-పుణ్యాలు పరోక్షమైనవి. ఈ సమయంలో మీరు తండ్రికి చాలా సహయోగము చేస్తారు. ఈ ధనమంతా సమాప్తమైపోతుందని మీకు తెలుసు. దీనికి బదులు తండ్రికి ఎందుకు సహయోగము చేయకూడదు. తండ్రి రాజ్యమును ఎలా స్థాపన చేస్తారు? ఏ సైన్యమూ లేదు, ఏ ఆయుధాలూ లేవు. అంతా గుప్తమే. కన్యకు కొందరు గుప్తంగా వరకట్నమునిస్తారు. పెట్టెను మూసేసి తాళంచెవిని చేతికిచ్చేస్తారు. కొంతమంది చాలా చూపించుకుంటారు, కొందరు గుప్తంగా చేస్తారు. తండ్రి కూడా చెప్తున్నారు, మీరందరూ ప్రేయసులు, మిమ్ములను విశ్వాధికారులుగా చేసేందుకు వచ్చాను. మీరు గుప్తంగా సహయోగము చేస్తారు. ఇది ఆత్మకు తెలుసు, ఏ బాహ్య ఆడంబరమూ లేదు. ఇది వికారీ పతిత ప్రపంచము. సృష్టి వృద్ధి అవ్వనే అవ్వాలి. ఆత్మలుపై నుండి రానే రావాలి. జన్మల సంఖ్య ఇంకా పెరగాలి. ఈ లెక్కతో ధాన్యము చాలదని కూడా చెప్తారు. ఇది ఆసురీ బుద్ధి. పిల్లలైన మీకిప్పుడు ఈశ్వరీయ బుద్ధి లభించింది. భగవంతుడు చదివిస్తున్నారు అంటే వారిని ఎంతగా గౌరవించాలి. ఎంతగా చదవాలి. కొంతమంది పిల్లలకు చదువుపై అభిరుచే ఉండదు. పిల్లలైన మీ బుద్ధిలో - మేము బాబా ద్వారా కిరీటధారి రాకుమార-రాకుమారీలుగా అవుతున్నాము అని ఉండాలి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - నా మతానుసారము నడుచుకోండి. తండ్రిని స్మృతి చేయండి. క్షణ క్షణము మేము మర్చిపోతామని అంటారు. మేము పాఠము మర్చిపోతామని విద్యార్థి అంటే టీచరేమి చేయగలరు! స్మృతి చేయకుంటే వికర్మలు వినాశనమవ్వవు. టీచర్, వీరు పాస్ అయిపోవాలి అని అందరిపై కృప చూపించడం లేక ఆశీర్వదించడం చేస్తారా? ఇక్కడ ఆశీర్వాదాలు లేక కృప చూపే మాటే లేదు. తండ్రి చదవమని చెప్తారు. భలే వ్యాపారాలు మొదలైనవి చేయండి కానీ తప్పకుండా చదవాలి. తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవ్వండి, ఇతరులకు కూడా దారి తెలపండి. మనసును ప్రశ్నించుకోవాలి - మేము తండ్రి సేవ ఎంతగా చేస్తున్నాము? ఎంతమందిని మా సమానంగా తయారు చేశాము? త్రిమూర్తి చిత్రాన్ని ఎదురుగా ఉంచారు. వీరు శివబాబా, ఇతను బ్రహ్మా. ఈ చదువు ద్వారా ఇలా తయారవుతారు. మళ్లీ 84 జన్మల తర్వాత ఇలా అవుతారు. శివబాబా బ్రహ్మా తనువులో ప్రవేశించి బ్రాహ్మణులను ఇలా తయారుచేస్తున్నారు. మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. ఇప్పుడు మీ మనసును మీరే - మేము పవిత్రమయ్యామా? దైవీగుణాలను ధారణ చేశామా? పాత దేహమును మరచిపోయామా? అని ప్రశ్నించుకోండి. ఇది పాత చెప్పు కదా. ఆత్మ పవిత్రమైపోతే చెప్పు కూడా ఫస్ట్ క్లాసుదే లభిస్తుంది. ఈ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తారు. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఈ రోజు పాత చెప్పులో ఉన్నాము, రేపు ఈ దేవతలుగా అవ్వాలనుకుంటున్నాము. తండ్రి ద్వారా భవిష్య అర్ధకల్పానికి విశ్వానికి కిరీటధారి రాకుమారులుగా అవుతారు. మన ఆ రాజ్యాన్ని ఎవ్వరూ లాక్కోలేరు. కావున తండ్రి శ్రీమతానుసారము నడుచుకోవాలి కదా. మేము ఎంతసేపు స్మృతి చేస్తున్నాము? ఎంతవరకు స్వదర్శన చక్రధారులుగా అయి, ఇతరులను తయారుచేస్తున్నాము? అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఎవరు చేస్తారో వారే పొందుతారు. తండ్రి ప్రతి రోజూ చదివిస్తారు. అందరి వద్దకు మురళీ వెళ్తుంది. మంచిది, మురళి దొరకకపోయినా 7 రోజుల కోర్సు అయితే లభించింది కదా, బుద్ధిలోకి జ్ఞానము వచ్చేసింది. ప్రారంభములో భట్టీ జరిగింది. కొందరు పక్కాగా, కొందరు కచ్చాగా తయారయ్యారు. ఎందుకంటే మాయ తుఫాన్లు కూడా వస్తూ ఉంటాయి కదా. 6-8 నెలలు పవిత్రంగా ఉండి మళ్లీ దేహాభిమానములోకి వచ్చి తమ హత్య తామే చేసుకుంటారు. మాయ చాలా శక్తిశాలి. అర్ధకల్పము మాయతో ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఓడిపోతే మీ పదవిని పోగొట్టుకుంటారు. నంబరువారుగా చాలా పదవులుంటాయి కదా. కొందరు రాజా-రాణి, కొందరు మంత్రులుగా, కొందరు ప్రజలుగా, కొందరికి వజ్ర వైఢూర్యాల మహళ్ళు ఉంటాయి. ప్రజలలో కూడా కొంత మంది చాలా ధనవంతులుగా ఉంటారు. వజ్ర వైఢూర్యాల మహళ్ళు ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి ప్రభుత్వము ప్రజల నుండి అప్పులు తీసుకుంటుంది కదా. కావున ప్రజలు షావుకార్లా లేక రాజులా? అంధకార నగరము... ఇవి ఇప్పటి విషయాలే. ఇప్పుడు పిల్లలైన మీకు మేము విశ్వానికి కిరీటధారి రాకుమారులుగా అయ్యేందుకు చదువుకుంటున్నామనే నిశ్చయముండాలి. ఆ కళాశాలలో చదివేవారు మేము బ్యారిస్టరుగా లేక ఇంజనీరుగా అవుతామని ఎప్పుడైనా మర్చిపోతారా? కొందరు నడుస్తూ-నడుస్తూ మాయా తుఫానులు రావడం వలన చదువును కూడా వదిలేస్తారు.
తండ్రి తన పిల్లలను రిక్వెస్ట్ చేస్తున్నారు - మధురమైన పిల్లలూ, బాగా చదువుకుంటే మంచి పదవిని పొందుతారు. తండ్రి గడ్డానికి గౌరవమివ్వండి. మీరు ఇటువంటి చెడు పనులు చేస్తే తండ్రి పేరును పాడుచేస్తారు. సత్యమైన తండ్రిని సత్యమైన టీచరును, సద్గురువును నిందింపచేసేవారు ఉన్నత పదవిని పొందలేరు. మీరిప్పుడు వజ్ర సమానంగా అవుతున్నారు, కనుక గవ్వల వెనుక పడకూడదు. బాబాకు సాక్షాత్కారమైన వెంటనే గవ్వలను వదిలేశారు. అరే! 21 జన్మలకు చక్రవర్తి పదవి లభిస్తూ ఉంటే ఇదంతా ఏం చేసుకోవాలి అని తమ సర్వస్వమునూ ఇచ్చేశారు. మనము విశ్వచక్రవర్తిత్వ పదవి తీసుకుంటామని, ఇదంతా వినాశనమవ్వనున్నదని కూడా మీకు తెలుసు. ఇప్పుడు చదువుకోకుంటే టూ లేట్ అయిపోతుంది, పశ్చాత్తాపపడవలసి వస్తుంది. పిల్లలకు అన్నీ సాక్షాత్కారమవుతాయి. మీరు నన్ను ఓ పతితపావనా! రండి అని పిలుస్తారు. ఇప్పుడు నేను పతిత ప్రపంచములోకి మీ కొరకు వచ్చాను, పావనంగా అవ్వండి అని పిల్లలైన మీకు చెప్తున్నాను. మీరు పదే పదే మురికిలో పడుతున్నారు. నేను కాలుడికే కాలుడను. అందరినీ తీసుకెళ్తాను. స్వర్గములోకి వెళ్లేందుకు తండ్రి వచ్చి మార్గము తెలుపుతున్నారు. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుందనే జ్ఞానమునిస్తారు. ఇది అనంతమైన జ్ఞానము, కల్పక్రితము చదువుకున్నవారే వచ్చి చదువుకుంటారు. అది కూడా సాక్షాత్కారమవుతూ ఉంటుంది. అనంతమైన తండ్రి వచ్చి చదివిస్తున్నారని, ఏ భగవంతుడిని కలుసుకునేందుకు ఇంత భక్తి చేశామో, వారే ఇక్కడకు వచ్చి చదివిస్తున్నారనే నిశ్చయము కలగాలి. అటువంటి భగవంతుడైన మన తండ్రిని వచ్చి కలుసుకోవాలి. నిశ్చయము పక్కాగా ఉంటే ఎంతో ఉల్లాస-ఉత్సాహాలతో పరుగెత్తుకొని వచ్చి కలుసుకుంటారు. ఇందులో మోసమేమీ లేదు. పవిత్రంగా అవ్వరు, చదువుకోరు, కేవలం బాబా దగ్గరకు వెళతాము అనేవారు కూడా చాలామంది ఉన్నారు. విహారయాత్రలకు వచ్చినట్లు వస్తారు. పిల్లలైన మీరు మీ రాజధానిని గుప్తంగా స్థాపన చేయాలని తండ్రి చెప్తున్నారు. పవిత్రులుగా అయితే, తమోప్రధానము నుండి సతిప్రధానంగా అవుతారు. ఈ రాజయోగాన్ని ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారు. మిగిలినవన్నీ హఠయోగాలు. తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. నేను అనంతమైన తండ్రి ద్వారా విశ్వానికి కిరీటధారి రాకుమారునిగా అయ్యేందుకు వచ్చాననే నషా ఉండాలి. అంతేకాక శ్రీమతమును కూడా అనుసరించాలి. మాయ ఎటువంటిదంటే బుద్ధియోగాన్ని తెంచివేస్తుంది. తండ్రి సర్వ సమర్థులు. కానీ మాయ కూడా సమర్థమైనదే. అందుకే అర్ధకల్పము రామరాజ్యము, అర్ధకల్పము రావణ రాజ్యము. ఈ విషయము కూడా ఎవ్వరికీ తెలియదు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మేము ఈ రోజు చదువుకుంటున్నాము, రేపు కిరీటధారులైన రాకుమారులు-రాకుమారీలుగా అవుతాము అనే నషా సదా ఉండాలి. అందుకు తగిన పురుషార్థము చేస్తున్నామా? తండ్రిని గౌరవిస్తున్నామా? చదువుపై అభిరుచి ఉందా? అని హృదయపూర్వకంగా ప్రశ్నించుకోవాలి.
2. తండ్రి కర్తవ్యములో గుప్త సహాయకులుగా అవ్వాలి. భవిష్యత్తు కొరకు మీ బ్యాగ్-బ్యాగేజీనంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. గవ్వల వెనుక సమయాన్ని పోగొట్టుకోకుండా వజ్ర సమానంగా అయ్యే పురుషార్థము చేయాలి.