ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. గుడ్ మార్నింగ్ తర్వాత తండ్రిని స్మృతి చేయమని పిల్లలకు చెప్పబడ్తుంది. "ఓ పతితపావనా! మీరు వచ్చి పావనంగా చేయండి" అని పిలుస్తారు కూడా. అందుకే తండ్రి మొట్టమొదటే ఆత్మిక తండ్రిని స్మృతి చేయమని చెప్తున్నారు. సర్వ ఆత్మల తండ్రి ఒకే ఒక్కరు. తండ్రిని ఎప్పుడూ సర్వవ్యాపి అని అనరు. కావున పిల్లలూ! - మొట్టమొదట ఎంత ఎక్కువ వీలైతే, అంత తండ్రిని స్మృతి చేయండి. ఏ సాకారులను గానీ, ఆకారులను గానీ స్మృతి చేయకండి. ఒక్క తండ్రిని తప్ప మరెవ్వరినీ స్మృతి చేయకండి. ఇది చాలా సులభము కదా. మనుష్యులు మేము చాలా బిజీగా ఉన్నాము, తీరిక లేదు అని అంటారు. కానీ దీనికోసం తీరిక సదా ఉంటుంది. తండ్రి యుక్తులు తెలుపుతున్నారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే మన పాపాలు భస్మమవుతాయని మీకు తెలుసు. ముఖ్యమైన విషయము ఇదే. వ్యాపారాలు మొదలైనవి చేసుకోండి, వద్దని చెప్పరు. అవన్నీ చేస్తూ కేవలం ఒక్క తండ్రిని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. మేము పతితులమని అందరూ భావిస్తారు. సాధుసన్యాసులు, ఋషులు, మునులు మొదలైన వారందరూ భగవంతుడిని కలుసుకునేందుకు సాధన చేస్తున్నారని మీకు తెలుసు. కానీ వారి పరిచయము తెలిసినంతవరకు వారిని కలవలేము. ఈ ప్రపంచములో ఎవ్వరికీ తండ్రి పరిచయము లేదని మీకు తెలుసు. దేహ పరిచయమైతే అందరికీ ఉంది. వస్తువు పెద్దదిగా ఉంటే అది వెంటనే పరిచయమవుతుంది. తండ్రి వచ్చినప్పుడు మాత్రమే ఆత్మ పరిచయాన్ని తెలుపుతారు. ఆత్మ మరియు శరీరము ఇవి రెండూ వేరు వేరుగా ఉంటాయి. ఆత్మ చాలా సూక్ష్మమైన ఒక నక్షత్రము. ఆత్మలను ఎవ్వరూ ఈ కంటితో చూడలేరు. కావున ఇక్కడకు వచ్చినప్పుడు దేహీ అభిమానులుగా అయి కూర్చోవాలి. అర్ధకల్పము సదా ఆరోగ్యవంతముగా అయ్యేందుకు ఇది కూడా ఒక ఆసుపత్రి వంటిది. ఆత్మ అవినాశి. ఎప్పుడూ వినాశనమవ్వదు. పాత్ర అంతా ఆత్మదే. ఆత్మ అంటుంది - నేను ఎప్పుడూ వినాశనము చెందను. ఆత్మలన్నీ అవినాశియే. శరీరము వినాశనమవుతుంది. ఆత్మలమైన మనము అవినాశి అని ఇప్పుడు మీ బుద్ధిలో బాగా కూర్చున్నది. మనము 84 జన్మలు తీసుకుంటాము. ఇది ఒక నాటకము, ఈ నాటకములో ఏ ఏ ధర్మ స్థాపకులు ఎప్పుడెప్పుడు వస్తారో, ఎన్ని జన్మలు తీసుకుంటారో మీకు తెలుసు. 84 జన్మలని గాయనమేదైతే ఉందో అది తప్పకుండా ఒక ధర్మానికి చెందిన వారిదే. అందరికీ 84 జన్మలుండేందుకు వీలు లేదు. అన్ని ధర్మాల వారు ఒకేసారి కలిసి రారు. ఇతరుల ఈ లెక్కను మనము ఎందుకు తీయాలి? ఫలానా ఫలానా సమయంలో ధర్మ స్థాపన కోసం వస్తారని మీకు తెలుసు. తర్వాత ఆ ధర్మము వృద్ధి చెందుతుంది. అందరూ సతోప్రధానము నుండి తమోప్రధానంగా అయ్యే తీరాలి. ఈ ప్రపంచము తమోప్రధానంగా అయినప్పుడు తండ్రి వచ్చి సతోప్రధాన సత్యయుగమును తయారుచేస్తారు. భారతవాసులమైన మనము మాత్రమే నూతన ప్రపంచములో రాజ్యపాలన చేస్తామని, ఇతర ధర్మములేవీ ఉండవని పిల్లలైన మీకు తెలుసు. పిల్లలైన మీలో కూడా ఎవరైతే ఉన్నత పదవిని తీసుకుంటారో, వారు స్మృతిలో ఉండే పురుషార్థము చేస్తారు. అంతేకాక బాబా, మేము ఇంత సమయము మీ స్మృతిలో ఉన్నామని కూడా వ్రాస్తారు. చాలామంది సిగ్గు వలన పూర్తి సమాచారము తెలుపరు. బాబా ఏమంటారో అని భావిస్తారు. కానీ తెలిసిపోతుంది కదా. పాఠశాలలో టీచర్లు - మీరు బాగా చదవకపోతే ఫెయిల్ అవుతారని విద్యార్థులకు తెలుపుతారు కదా. లౌకిక తల్లి-తండ్రులు కూడా చదువును బట్టి ఇది చాలా గొప్ప పాఠశాల అని భావిస్తారు కదా. ఇక్కడ నెంబరు వారుగా కూర్చోబెట్టరు, కానీ నెంబరు వారుగా ఉంటారని బుద్ధితో అర్థం చేసుకుంటారు. తండ్రి మంచి మంచి పిల్లలను సేవ కొరకు ఎక్కడికో పంపుతూ ఉంటారు, వారు వెళ్లిపోతే ఇతరులు మాకు మహారథులు కావాలని బాబాకు వ్రాస్తారు అనగా మాకంటే వారు చురుకుగా, తెలివిగలవారిగా, ప్రసిద్ధంగా ఉంటారని భావిస్తారు. నంబరువారుగా అయితే ఉంటారు కదా. ప్రదర్శినీలో కూడా అనేక రకాలైనవారు వస్తారు. కనుక వచ్చిన వారిని పరిశీలించేందుకు గైడ్ లు కూడా ఉండాలి. వచ్చినవారు ఎటువంటివారో లోపలికి ఆహ్వానించేవారికి తెలుస్తుంది. ఫలానావారు వీరికి అర్థం చేయించండి అని సూచనలివ్వాలి. ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి అందరూ ఉన్నారని మీరు కూడా అర్థం చేసుకోగలరు. అక్కడ అందరికీ సేవ చేసే తీరాలి. ఎవరైనా గొప్పవారు వస్తే వారిని అందరూ తప్పకుండా గౌరవిస్తారు. ఇది ఒక నియమము. తండ్రి లేక టీచరు తరగతిలో విద్యార్థులను మహిమ చేస్తారు. ఇది కూడా అన్నిటికంటే గొప్ప గౌరవము. పేరు ప్రసిద్ధము చేసే పిల్లలను మహిమ చేస్తారు లేక గౌరవిస్తారు. వీరు ఫలానా ధనవంతులు, ఫలానా ధర్మానికి చెందినవారు అని తెలపడం కూడా వారిని గౌరవించడమే కదా. అత్యంత ఉన్నతమైనవారు భగవంతుడని ఇప్పుడు మీకు తెలుసు. భగవంతుడే అత్యంత ఉన్నతులని వారు కూడా తప్పకుండా అంటారు. కానీ వారి జీవితచరిత్రను తెలుపమంటే సర్వవ్యాపి అని అంటారు. ఒక్కసారిగా అగౌరవపరుస్తారు. అత్యంత శ్రేష్ఠమైన వారు భగవంతుడని, వారు మూలవతన వాసులని, ఇప్పుడు మీరు అర్థం చేయించగలరు. సూక్ష్మవతనములో ఉండేది దేవతలు. ఇక్కడ ఉండేవారు మనుష్యులు. అత్యంత ఉన్నతమైన భగవంతుడు నిరాకారులు.
వజ్ర సమానంగా ఉన్న మనమే మళ్లీ గవ్వ సమానంగా అయ్యామని, మీరిప్పుడు తెలుసుకున్నారు. కానీ భగవంతుడిని మీ కంటే ఎక్కువగా కిందకు తీసుకెళ్లారు. వారి పరిచయం తెలియనే తెలియదు. భారతవాసులైన మీకు మాత్రమే పరిచయము లభిస్తుంది. ఆ తర్వాత పరిచయము తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు అందరికీ తండ్రి పరిచయమునిస్తూ ఉంటారు. అనేకమందికి తండ్రి పరిచయము లభిస్తుంది. త్రిమూర్తి, సృష్టి చకము, కల్పవృక్షము - ఈ మూడు చిత్రాలు ముఖ్యమైనవి. ఇందులో ఎంతో జ్ఞానముంది. ఈ లక్ష్మీనారాయణులు సత్యయుగపు యజమానులుగా ఉండేవారని ఎవరైనా చెప్తారు. అయితే సత్యయుగానికి ముందు ఏ యుగముండేది? దీని గురించి కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఇది కలియుగ అంతిమ సమయము, ప్రజల పై ప్రజా రాజ్యముంది. ఇప్పుడు రాజులు ఎవ్వరూ లేరు. ఎంతో తేడా ఉంది. సత్యయుగము ప్రారంభములో రాజులుండేవారు. ఇప్పుడు కలియుగములో కూడా రాజులున్నారు. ఇప్పుడున్నవారు పవిత్రంగా లేకపోయినా కొంతమంది ధనమునిచ్చి బిరుదులు తీసుకుంటారు. మహారాజులు ఒక్కరు కూడా లేరు కానీ బిరుదును కొనుక్కుంటారు. ఉదాహరణకు పటియాలా మహారాజు, జోధ్ పుర్, బికానీర్ మహారాజు,... ఇటువంటి బిరుదులు తీసుకుంటారు కదా. ఈ పేరు అవినాశిగా నడుస్తూనే వస్తోంది. మొదట పవిత్ర మహారాజులుండేవారు. ఇప్పుడుండేది అపవిత్రులు. కానీ రాజులు, మహారాజులు అనే పదాలు మాత్రము కొనసాగుతూనే ఉన్నాయి. ఈ లక్ష్మీనారాయణులు సత్యయుగపు యజమానులుగా ఉండేవారు. అయితే ఆ రాజ్యము ఎవరు తీసుకున్నారు? రాజ్యస్థాపన ఎలా జరుగుతుందో ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి అంటున్నారు - 21 జన్మల కొరకు ఇప్పుడు నేను మిమ్ములను చదివిస్తున్నాను. వారైతే చదువుకొని ఈ ఒక్క జన్మకు మాత్రమే బ్యారిస్టరు మొదలైనవారిగా అవుతారు. మీరిప్పుడు చదువుకొని భవిష్యత్తులో మహారాజా-మహారాణిగా అవుతారు. డ్రామా ప్లాను అనుసారముగా కొత్త ప్రపంచము స్థాపనవుతూ ఉంది. ఇప్పుడిది పాత ప్రపంచము. ఎంత మంచి-మంచి పెద్ద భవనాలున్నా వజ్ర వైఢూర్యాల భవనాలు తయారుచేసేందుకు ఎవ్వరికీ శక్తి లేదు. సత్యయుగములో అన్ని మహళ్ళూ వజ్ర వైఢూర్యాలతో నిర్మిస్తారు కదా. భవనాలు నిర్మించేందుకు ఎక్కువ సమయము కూడా పట్టదు. ఇక్కడ కూడా భూకంపాలు మొదలైనవి సంభవించినప్పుడు అనేకమంది పనివారిని పెట్టి 1-2 సంవత్సరాలలో మొత్తం పట్టణమంతటినీ పునః నిర్మాణము చేస్తారు. క్రొత్త ఢిల్లీని తయారు చేసేందుకు 8-10 సంవత్సరాలు పట్టింది. కానీ ఇక్కడి కూలివారికి, అక్కడి కూలివారికి తేడా ఉంటుంది కదా. ఈ రోజులలో కొత్త కొత్త అన్వేషణలు కూడా వస్తున్నాయి. భవనాలు నిర్మించే సైన్స్ కూడా చాలా తీవ్రంగా ఉంది. అన్నీ రెడీమేడ్ గా లభిస్తాయి. వెంటనే ఫ్లాట్ తయారైపోతుంది. చాలా త్వరత్వరగా తయారవుతూ ఉన్నాయి. అందువలన ఇదంతా అక్కడ ఉపయోగపడుతుంది కదా. ఇవన్నీ మీ వెంట వస్తాయి. సంస్కారాలైతే అలాగే ఉంటాయి కదా. ఈ సైన్స్ సంస్కారము కూడా మీతోనే వస్తుంది. ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - పవిత్రంగా అవ్వాలంటే తండ్రిని స్మృతి చేయండి. తండ్రి కూడా పిల్లలకు గుడ్ మార్నింగ్ చెప్పి ఆ తర్వాత శిక్షణనిస్తారు - పిల్లలూ, తండ్రి స్మృతిలో కూర్చున్నారా? నడుస్తూ-తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి ఎందుకంటే జన్మ-జన్మాంతరాల పాప భారము తలపై ఉంది. మెట్లు దిగుతూ దిగుతూ 84 జన్మలు తీసుకుంటారు. ఇప్పుడు మళ్లీ ఒకే జన్మలో ఎక్కే కళ పొందుతారు. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారో అంత సంతోషము కూడా ఉంటుంది, అంత శక్తి కూడా లభిస్తుంది. చాలా మంది పిల్లలను ముందు నెంబరులో పెట్టడం జరుగుతుంది కానీ స్మృతిలో అసలు ఉండరు. భలే జ్ఞానములో తీవ్రంగా ఉంటారు కానీ స్మృతి యాత్ర చేయనే చేయరు. తండ్రి అయితే పిల్లలను మహిమ చేస్తారు. ఈ బ్రహ్మా కూడా నంబర్ వన్ లో ఉన్నారు. కావున తప్పకుండా శ్రమ కూడా చేస్తూ ఉంటారు కదా. సదా శివబాబాయే అర్థం చేయిస్తున్నారని భావిస్తే బుద్ధియోగము అక్కడ జోడించబడి ఉంటుంది. వీరు కూడా నేర్చుకుంటున్నారు కదా. అయినా శివబాబాను స్మృతి చేయమని చెప్తూనే ఉంటారు. ఇతరులకు అర్థము చేయించేందుకు చిత్రాలున్నాయి. భగవంతుడని ఒక్క నిరాకారుడిని మాత్రమే అంటారు. వారు వచ్చి శరీరాన్ని ధరిస్తారు. భగవంతుని పిల్లలైన ఆత్మలందరూ సోదరులు. ఇప్పుడు ఈ శరీరములో విరాజమానమై ఉన్నారు. అందరూ అకాలమూర్తులే. ఇది అకాలమూర్తి సింహాసనము. అకాల సింహాసనమంటే ప్రత్యేకంగా ఏదో ఒక వస్తువు కాదు. ఇది అకాలమూర్తి కూర్చునే సింహాసనము. భృకుటి మధ్య ఆత్మ విరాజమానమై ఉంటుంది. దీనిని అకాలతక్త్ అని అంటారు. అకాలతక్త్ అనగా అకాలమూర్తి సింహాసనము. ఆత్మలన్నీ అవినాశి. చాలా సూక్ష్మంగా ఉంటాయి. తండ్రి అయితే నిరాకారులు. వారు తమ సింహాసనాన్ని ఎక్కడ నుండి తెస్తారు? తండ్రి అంటున్నారు - ఇది నా సింహాసనము కూడా అవుతుంది ఎందుకంటే నేను వచ్చి ఈ సింహాసనాన్ని అప్పుగా తీసుకుంటాను. కావున ఈ సింహాసనము నాది కూడా అవుతుంది. నేను వచ్చి బ్రహ్మా సాధారణ వృద్ధ శరీరములోని అకాల సింహాసనముపై వచ్చి కూర్చుంటాను. ఆత్మలందరికీ సింహాసనము ఈ భృకుటి అని మీరు తెలుసుకున్నారు. మనుష్యుల గురించి మాత్రమే తెలుపుతున్నాను, జంతువుల విషయము కాదు. మొదట జంతువుల కంటే హీనంగా ఉన్న మనుష్యులు బాగుపడాలి. ఎవరైనా జంతువుల విషయము అడిగితే మొదట మీరు బాగుపడండి అని చెప్పండి. సత్యయుగములో అయితే జంతువులు కూడా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి. చెత్తా చెదారము ఉండనే ఉండదు. రాజ మహళ్ళలో పావురాలు మొదలైనవి మురికి చేస్తే శిక్షిస్తారు. కొంచెము కూడా చెత్త, మురికి ఉండదు. అక్కడ చాలా జాగ్రత్త ఉంటుంది. కాపలాదారులుంటారు. జంతువులు, పక్షులు ఎప్పుడూ లోపలికి దూరి రాకుండా గమనిస్తూ ఉంటారు. చాలా శుభ్రంగా ఉంటుంది. లక్ష్మీనారాయణుల మందిరములో కూడా ఏంతో శుభ్రత ఉంటుంది. పార్వతీ-శంకరుల మందిరాలలో పావురాలు కూడా చూపిస్తారు. కావున అవి ఆ మందిరాలను తప్పకుండా పాడు చేస్తూ ఉంటాయి. శాస్త్రాలలో కట్టుకథలు అనేకము వ్రాసేశారు.
ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - వారిలో కూడా కొంతమంది మాత్రమే ధారణ చేస్తారు. మిగిలిన వారికి ఏ మాత్రము అర్థము కాదు. తండ్రి పిల్లలకు ఎంతో ప్రేమగా అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, చాలా చాలా మధురంగా అవ్వండి. నోటి ద్వారా ఎల్లప్పుడూ రత్నాలే వెలువడూతూ ఉండాలి. మీరు జ్ఞానీ మరియు యోగీలు (రూప-బసంత్). మీ నోటి నుండి రాళ్లు వెలువడకూడదు. గొప్పతనమంతా ఆత్మదే. నేను ప్రెసిడెంటును, నేను ఫలానా,... ఇది నా శరీరము పేరు అని ఆత్మ చెప్తుంది. అయితే ఆత్మలు ఎవరి సంతానము? ఒకే ఒక్క పరమాత్ముని సంతానము. కనుక వారి నుండి తప్పకుండా వారసత్వము లభిస్తూ ఉంటుంది కదా. అటువంటి పరమాత్మ సర్వవ్యాపి ఎలా అవుతారు! మనకు కూడా మొదట తెలిసేది కాదని మీకు తెలుసు. ఇప్పుడు మీ బుద్ధి ఎంతో వికసించింది. మీరు ఏ మందిరాలకు వెళ్లినా ఇవన్నీ అసత్య చిత్రాలని భావిస్తారు. 10 భుజాలు ఉన్నవారు, ఏనుగు తొండము కలిగినవారు ఎవరైనా ఉంటారా? ఇదంతా భక్తిమార్గములోని సామగ్రి. వాస్తవానికి ఒక్క శివబాబాను మాత్రమే భక్తి చేయాలి. వారే అందరి సద్గతిదాత. ఈ లక్ష్మీనారాయణులు కూడా 84 జన్మలు తీసుకుంటారని మీ బుద్ధిలో ఉంది. ఆ తర్వాత అత్యంత శ్రేష్ఠమైన తండ్రి వచ్చి అందరికీ సద్గతినిస్తారు. వారికంటే గొప్పవారు మరెవ్వరూ లేరు. ఈ జ్ఞాన విషయాలను మీలో కూడా నెంబరు వారిగా ధారణ చేస్తారు. ధారణ చేయలేకపోతే ఇక దేనికి పనికి వస్తారు? కొంతమంది అంధులకు చేతికర్రగా అయ్యేందుకు బదులు వారే అంధులుగా అవుతారు. పాలు ఇవ్వని ఆవులను గోశాలలో పెడతారు. ఇక్కడ కూడా కొంతమంది జ్ఞానము అనే పాలు ఇవ్వలేరు. పురుషార్థమే చేయని పిల్లలు చాలా మంది ఉన్నారు. ఎవరికైనా కళ్యాణము చేయాలి అని భావించరు. తమ భాగ్యము గురించి వారికి పట్టింపే ఉండదు. ఏం లభిస్తే అదే మంచిది అని అనుకుంటారు. అందుకే తండ్రి వారి భాగ్యములో లేదని అంటారు. సద్గతిని పొందేందుకు మీరు పురుషార్థము చేయాలి. ఆత్మాభిమానులుగా అవ్వాలి. తండ్రి అత్యంత ఉన్నతమైనవారు. కానీ పతిత ప్రపంచములో ఎటువంటి పాత శరీరములో వస్తారో చూడండి. వారిని పిలిచేదే పతిత ప్రపంచములో. రావణుడు పూర్తిగా భ్రష్టులుగా చేసినప్పుడు తండ్రి వచ్చి శ్రేష్ఠంగా తయారుచేస్తారు. మంచి పురుషార్థము చేసేవారు రాజా-రాణులుగా అవుతారు, పురుషార్థము చేయనివారు పేదవారిగా అవుతారు. అదృష్టంలో లేకుంటే పురుషార్థము చేయలేరు. కొంతమంది చాలా మంచి భాగ్యాన్ని తయారుచేసుకుంటారు. ప్రతి ఒక్కరూ స్వయం ఎంత సేవ చేస్తున్నారో, చూసుకోగలరు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. జ్ఞానీ యోగీలు (రూప్-బసంత్) గా అయి సదా నోటి నుండి రత్నాలే వస్తూ ఉండాలి. చాలా చాలా మధురంగా తయారవ్వాలి. ఎప్పుడూ రాళ్లు (కఠిన వచనాలు) వెలువడకూడదు.
2. జ్ఞాన-యోగాలలో చురుకుగా, తీవ్రంగా అయి తమ మరియు ఇతరుల కళ్యాణము చేయాలి. మీ ఉన్నత భాగ్యమును తయారుచేసుకొనే పురుషార్థము చేయాలి. అంధులకు చేతికర్రగా అవ్వాలి.